పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఐదు రోజులవుతోంది. దాడిలో మరణించినవారి మృతదేహాలతో బాధితులు సొంతూళ్లకి చేరారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టూర్ క్యాన్సిల్ చేసుకుని తిరుగు ప్రయాణమైన పర్యాటకులు కూడా పలు రాష్ట్రాల విమానాశ్రయాల్లో కనిపిస్తున్నారు. ఆ భయానక పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యులు వారు. అంతకుమించి కాశ్మీరీ ప్రజల ప్రేమాభిమానాలను స్వయంగా అనుభవించిన వారు. ఆ పర్యాటకులు, బాధితులు వెల్లడిచేస్తున్న నాటి అనుభవాలు, దేశ సౌభ్రాతృత్వానికి చిహ్నాలు..
కేరళ నుంచి ఆరతి ఆర్ మీనన్ తన తల్లీదండ్రితో, కుమారులతో బైసరన్ క్యాంపు చేరుకున్న కొన్ని క్షణాల్లోనే ముష్కరులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 65 ఏళ్ల ఆరతి తండ్రి కూడా చనిపోయారు. ఆ క్షణం తన కళ్లముందు ఏం జరిగిందో ఆమె ఇలా చెబుతున్నారు.
బాణాసంచా పేలుళ్లు అనుకున్నాం..
‘దుబాయ్ లో ఉండే నేను పిల్లలను తీసుకుని కేరళలోని కొచ్చికి వచ్చాను. వేసవి సెలవులు గడుపుదామని కాశ్మీర్ టూర్ ప్లాన్ చేశాం. పిల్లలతో కలసి ఏప్రిల్ 21న మేమంతా కాశ్మీర్ వెళ్లాం. 22 ఉదయం పహల్గామ్ చేరుకున్నాం. బైసరన్ క్యాంపుకు కొంత దూరంలో కారు పార్కు చేశాం. అమ్మ కారులోనే ఉండిపోయింది. నాన్న, నేను, పిల్లలు పోనీల సహాయంతో పచ్చిక బయళ్లకు చేరుకున్నాం. కాశ్మీర్ అందాలను చూస్తూ కొంత దూరం నడిచామో లేదో గన్ షాట్లు వినిపించాయి. మొదట వాటిని బాణాసంచా అనుకున్నాం. వరుసగా పేలుళ్లు వినిపిస్తుంటే టెర్రర్ దాడి అని అర్థమైంది.
ప్రాణాలు కాపాడుకోవాలని పక్కనే ఉన్న కంచెవైపు పరుగెత్తాం. కంచె కింద నుండి పాక్కుంటూ సురక్షిత ప్రాంతానికి వెళ్లాలనుకున్నాం. కానీ, ఆ కంచె నుండే ఇద్దరు ముష్కరులు మావైపు వచ్చారు. ఒకతను ఏదో అంటున్నాడు, మాకు అర్థం కాలేదు. అర్థం కాలేదని చెప్పాం. ఆ మరుక్షణమే అతను నాన్నపై కాల్పులు జరిపాడు. నాన్న కింద పడిపోయారు. మావైపు వచ్చిన ఇద్దరు దుండగులను నేను చాలా స్పష్టంగా చూశాను. వాళ్లు ఆర్మీ డ్రెస్సులో లేరు. భయంతో పిల్లలిద్దరూ గట్టిగా కేకలు వేశారు. అప్పుడు ఆ మనుషులు మమ్మల్ని దాటుకుని వెళ్లారు. నాన్న చనిపోయాడని నాకు తెలుస్తూనే ఉంది. అయినా పిల్లలిద్దరినీ పట్టుకుని దూరంగా పరుగెత్తాను. అడవిలోకి వెళ్లిపోయాను. ఎటూ దారి కనిపించలేదు. గంటపాటు అక్కడే పిచ్చిదానిలా తిరిగాను. ఫోను సిగల్ రాగానే మా డ్రైవర్ ముసఫిర్కి ఫోన్ చేశాను. అప్పుడే మా వైపు కొన్ని పోనీ (గుర్రాలు)లు పరుగెత్తుకుంటూ వచ్చాయి. వాటి వెంట మేము కూడా పరుగెత్తాం’ అంటూ ఆ భయంకర క్షణాలని ఆరతి గుర్తుచేసుకున్నారు.
తెల్లవార్లూ మాతోనే హాస్పిటల్లో ఉన్నారు..
ఆ తరువాత కాశ్మీర్ నుండి కొచ్చికి వచ్చేంత వరకు కాశ్మీర్లో ఆరతి ఎంతోమంది కాశ్మీరీలని కలిశారు. వారంతా తనని కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారని ఆమె చెప్పారు. ‘మా డ్రైవర్ ముసఫిర్, మరో వ్యక్తి సమీర్ ఇప్పుడు కాశ్మీర్ నాకిచ్చిన అన్నదమ్ములు. నేను క్షేమంగా ఇక్కడి వరకు చేరుకున్నానంటే వారి సాయం వల్లే. నాన్న మృతదేహం మార్చురీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు అన్నీ వారే చూసుకున్నారు. నాన్న శవం కోసం తెల్లవారుజాము 3 గంటల వరకు నేను హాస్పటల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నన్ను ఎంతో శ్రద్ధగా, వాళ్ల చెల్లిలాగా చూసుకున్నారు. ఆ క్షణం నా కళ్ల వెంట కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. నాన్న పోయిన బాధని దిగమింగుకున్న నా కళ్లు, వాళ్ల ప్రేమకి వర్షించాయి’ అంటూ కాశ్మీర్ ప్రజలు తన పట్ల చూపించిన ప్రేమని ఆమె మీడియా ముందు చెప్పారు.
శ్రీనగర్ నుండి వెనుదిరిగన ఆరతి వాళ్లతో అన్న మాటలను కూడా చెప్పారు. ‘నాన్నని కోల్పోయిన నాకు ఈ కాశ్మీర్ ఇద్దరు సోదరులను ఇచ్చింది. అల్లా మిమ్మల్ని రక్షించాలి’ అని వారితో నేను అన్నాను. అప్పుడు నా ముఖంలో నాన్న పోయిన దు:ఖాన్ని కనిపించనివ్వలేదు. ఎందుకంటే అప్పటికి అమ్మకి ఆ విషయం చెప్పలేదు’ అంటున్న ఆరతి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న తరువాతే తండ్రి మృతి వార్త తల్లితో చెప్పారు.
కాశ్మీర్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం..
తమిళనాడు నుండి ఏప్రిల్ 19న శ్రీనగర్కి చేరుకున్న జయతి, ఆమె కొడుకు దాడి జరిగినప్పుడు ఘటన జరిగిన ప్రాంతానికి 3 కి.మీ దూరంలోని బెటవ్ లోయలో ఉన్నారు. ఆ అనుభవాన్ని వాళ్లు ఇలా చెప్పారు. ‘బైసరన్లో కాల్పులు జరిగాయని తెలిసి మేము చాలా భయపడిపోయాం. కానీ మేము బస చేసిన చోట ఉన్న స్థానికులు మాకు ధైర్యం చెప్పారు. ఎంతమందిని వీలైతే అంతమందిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తామని భరోసా ఇచ్చారు. మమ్మల్ని వాళ్లు సొంత తమ్ముళ్లా, అక్కల్లా చూసుకున్నారు’ అని తమిళనాడుకు చేరుకున్న వాళ్లు చెప్పారు. ఆ ప్రయాణం గురించి జయతి ఇంకా ఇలా చెబుతున్నారు. ‘కాశ్మీర్లో సూపర్ డ్రైవర్స్ ఉన్నారు. నేను మున్నార్ నుంచి కొడైకెనాల్ వరకు యాత్ర చేశాను. కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి నైపుణ్యం గల డ్రైవర్లను ఎక్కడా చూడలేదు. ఎవరికీ ఇబ్బంది లేకుండా, వాహనాలకు డ్యామేజీ జరగకుండా చాలా నేర్పుగా వాళ్లు వాహనాలని నడిపిస్తారు. ఆ విషయమే నేను అడిగినప్పుడు అతడు నవ్వుతూ ‘ మీ (పర్యాటకుల) వల్లే మేము బతుకుతున్నాం. మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అలాగే క్షేమంగా, సకాలంలో గమ్యం చేర్చాలి. అందుకే వేగంగా డ్రైవింగ్ చేసినా జాగ్రత్తగా ఉంటాం’ అన్నాడు అని ఆమె చెప్పారు. ఈ ఘటనతో తాము ట్రిప్ని మధ్యలోనే క్యాన్సిల్ చేసుకుని వచ్చాము. అంత మంచి మనుషులతో ఎక్కువ రోజులు గడపలేకపోయాం’ అంటూ జయతి ఒకింత బాధగా చెప్పారు. ఆమె మాటలకు అడ్డు పడుతూ, జయతి కొడుకు ఫోనులో ఓ ఫొటోని చూపిస్తూ ఇలా అన్నారు.
నాకు అన్నలా కనిపించాడు..
‘ప్రజలంతా ముస్లింలు, క్రిస్టియన్లు అని మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ ఫొటో చూడండి. మమ్మల్ని కాశ్మీర్లో అందమైన ప్రదేశాలకి తిప్పిన మా డ్రైవర్తో మేము దిగిన ఫొటో ఇది. అతను ముస్లిం. దాడి తరువాత మాకు ధైర్యం చెప్పి విమానాశ్రయానికి చేర్చేవరకు కూడా అతను మాకు సాయంగా నిలిచాడు. భయపడొద్దని మాకు ధైర్యం చెప్పాడు. నాకు అప్పుడు అతను ఒక అన్నలా కనిపించాడు. మేమంతా కొన్ని గంటలపాటు వాళ్లతో కలిసి ప్రయాణించాం. వారి మాటల్లో, మా పట్ల చూపించిన ప్రేమలో మాకు ఒకటే అర్థమైంది. కులం, మతంతో వారికి సంబంధం లేదు. కాశ్మీర్కి వచ్చిన అతిథులను గౌరవంగా చూసుకోవడమే వాళ్లకి తెలిసింది’ అంటున్నాడు.
మాకు శిక్ష వేయకండి..
దాడిలో భర్తని కోల్పోయి ఇంటికి చేరిన ఓ కుటుంబం తమకెదురైన అనుభవాన్ని ఇలా చెప్పింది. ‘నా భర్తని చంపింది ముస్లింలే. అయితే మేం క్షేమంగా ఇంటికి వచ్చేలా చేసింది కూడా ముస్లింలే. అందరినీ ఒకే గాటన కట్టేయలేం. మేం బయల్దేరిన దగ్గర నుండి మాకు ఆతిథ్యమిచ్చింది, పోనీల ద్వారా బైసరన్కి చేర్చింది, హోటల్ సిబ్బంది.. అందరూ ముస్లింలే. వారంతా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. మేం ముస్లింలతోనే కలిసి ఉంటున్నాం. వాళ్లతో పాటే పెరిగాం’ అని తల్లి చెబుతుంటే కూతురు కూడా తన అనుభవాన్ని ఇలా చెప్పారు. ‘మేము ఈ రోజు ఇలా మాట్లాడుతున్నామంటే కాశ్మీరీ ముస్లింలు చేసిన సాయం వల్లే. మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు చాలా క్షేమంగా తీసుకువచ్చారు. మాకు వీడ్కోలు పలుకుతూ క్యాబ్ డ్రైవర్ రెండు చేతులూ జోడించి ఇలా అన్నాడు : ‘మేం తప్పు చేయలేదు. మమ్మల్ని ద్వేషించకండి. ఎవరో చేసిన తప్పుకి మాకు శిక్ష వేయకండి’ అని ఆమె చెప్పింది.
ఈ మాటల్లో ఎంతో బాధ అంతకుమించి అభద్రత కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఆలోచించి అడుగులు వేయాలి. ఉన్మాదం తలకెక్కిన వ్యక్తులు చేసే ప్రలోభాలకు లోబడి, మనతో చిరకాలం నుంచి స్నేహం చేస్తున్న అబ్దుల్ భారుని వదులుకుంటామా! మనకి ఏ కష్టమొచ్చినా, ‘నేనున్నాన’ంటూ సాయం చేసే సలీమా అక్కని ఇంటికి రావద్దని చెబుతామా! ఆలోచించండి..