కూచిపూడికి వన్నె వేదాంతం రాథేశ్యామ్‌…

కూచిపూడి నాట్యమంటేనే వైవిధ్యభరితం. అందులో నృత్యరీతులు హృద్యంగా సాగుతుంటాయి. సంగీతానికి తోడు సాహిత్యంతో కూడిన పాటలు సాగుతుంటే గజ్జె కట్టిన కళాకారులు తాండవమాడతారు. అలాంటి కళాకారుడిగా రాథేశ్యామ్‌ స్టేజ్‌ ఎక్కితే నృత్యంతో ఎవరైనా నృత్యంలో లీనమై పరవశించాల్సిందే. నృత్యరీతులు, హావభావాలు, ఔరా అనిపించాల్సిందే. సౌందర్యవంతమైన రూపంతో ప్రదర్శనలు, నట్వాంగంతో హావభావాలు, విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఐదు దశాబ్దాలుగా ఆయన కూచిపూడి కళను భావితరాలకు అందిస్తూ వేలాదిమంది కళాకారులను తీర్చిదిద్దారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అవార్డులను సైతం కైవసం చేసుకుంటున్నారు. ఆయన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.

వేదాంతం రాథేశ్యామ్‌ కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో వేదాంతం సూర్యనారాయణ, సత్యవతమ్మ దంపతులకు జన్మిచారు. చిన్న వయసులోనే కూచిపూడి నృత్యాన్ని కుటుంబ వారసత్వంగా తీసుకున్నారు. వేదాంతం పార్వతీశం, వేదాంతం సీతారామశాస్త్రి, వెంపటి పెద్ద సత్యం, వెంపటి చినసత్యం, పివిజి కృష్ణ శర్మ, వై.సీతారామాంజనేయులు, భాగవతుల సత్య సుందర రామశాస్త్రి, బొక్కా కుమార స్వామి, వేదాంతం సత్యనారాయణ శర్మ, సినీ నృత్యదర్శకులు పసుమర్తి కృష్ణమూర్తిల వద్ద నాట్య, నృత్యరీతులను నేర్చుకున్నారు. నాగార్జున యూనివర్శిటీ ద్వారా ఎంఎ తెలుగు పూర్తిచేశారు. అనంతరం హిందీ, సంస్కృత భాషల్లోనూ ప్రవీణులయ్యారు. ఆగిరిపల్లిలో తెలుగు భాషా ప్రవీణ ఆరేళ్లు, ప్రొద్దుటూరులో ఏడాదిపాటు తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశారు. కూచిపూడి నృత్యంలో డిప్లమో (ఆనర్స్‌) పొందారు. తొలుత పామర్రులో తెలుగు ఉపాధ్యాయులుగా రెండేళ్లపాటు పనిచేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కూచిపూడి శ్రీ సిద్ధేంధ్ర కళాశాలలో రాష్ట్రప్రభుత్వం తరపున కళాశాల ప్రారంభం కావటంతో అక్కడ మొదట్లో నృత్య అధ్యాపకునిగా చేరి ఎందరినో ఈ కళలో ప్రోత్సహించి నిపుణులుగా తయారుచేశారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌గా కూడా వ్యవహరించారు. ఆట, పాట, మాట, పద్యం వంటి కళల్లో శిక్షణ ఇచ్చారు. స్త్రీ, పురుష వేషాలను ధరించి పాటలు పాడుతూ సందర్భానుసారంగా నృత్యరీతులు పాటిస్తూ కళారూపాల ప్రదర్శనలు ఇవ్వటంలో ఆయన దిట్ట. కువైట్‌, సింగపూర్‌, యుఎస్‌ఎ తదితర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలకు దర్శకత్వం వహించటమే కాకుండా తనే అనేక ప్రదర్శనల్లో నర్తించటం, కొన్నింటికి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. అనతికాలంలోనే అసాధారణ కూచిపూడి కళాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

కర్నాటక రాష్ట్రప్రభుత్వం ఆయన్ను కూచిపూడి టెక్ట్‌బుక్‌ కమిటీకి చైర్మన్‌గా నియమించింది. 2000లకుపైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆయన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ఆయన నాట్య కళాకారుడే కాకుండా స్వతహాగా నృత్యరీతులపై పాటలు పాడటంలో దిట్ట. నృత్యరీతులతో ప్రేక్షకులను సమ్మోహనం చేయటం ఆయనకున్న సహజ నైపుణ్యం. చక్కటి వాక్చాతుర్యం, నృత్యరీతుల్లో స్పష్టత ఆద్యంతం తొణికిచలాడుతుంటాయి. దేశ విదేశాల్లో జరిగిన నృత్య ప్రదర్శనల్లో ఆయన స్వయంగా నాట్యరీతులను ఆచరించటంతోపాటుగా తన శిష్యులతో ఇచ్చిన ప్రదర్శనలు సైతం గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నిలిచాయి.

నిరంతరం కళామతల్లి సేవలోనే…

ఉద్యోగ విరమణ తర్వాత నుంచి తన ఇంటి వద్దే ‘కూచిపూడి నాట్య శిల్పారామం’ ఏర్పాటుచేసి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ ఆలిండియా రేడియోకు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకశాఖ, సాంస్కృతిక శాఖ ద్వారా ఉగాది పురస్కారాల ఎంపిక కమిటీలో సభ్యులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక చైర్మన్‌ ఛాంబర్‌లో సబ్‌కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు. నృత్య పోటీల్లో న్యాయనిర్ణేతగా పలు యూనివర్శిటీలు ఆహ్వానిస్తున్నాయి.

పోషించిన పాత్రలివే…

ఛండాలిక నృత్య నాటకంలో బౌద్ధ బిక్షువు, క్షీర సాగర మథనంలో అప్సరస శుక్రాచార్య, నట్వాంగం. హరవిలాపంలో ప్రమధుడు, ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడు, నిర్వాహక సూత్రధారి, హిరణ్య కశ్యప, ఉషా పరిణయంలో చిత్రలేఖ, సూత్రధారి, శ్రీకృష్ణ పారిజాతంలో నారదుడు, రుక్మిణీ కళ్యాణంలో అగ్ని జ్యోతన, శ్రీనివాస కళ్యాణంలో రుషి సుఖ మహర్షి, గొల్లవాడు, గొల్ల కలాపంలో గొల్లభామ, సూత్రధారిలో సోమయాజి, శ్రీకృష్ణ విజయంలో సూత్రధారి, భామాకలాపంలో భామ, శ్రీకృష్ణుడు, మాధవి, విప్రనారాయణలో కావేరీ, అర్చకస్వామి తిలోత్తమలో రాజు సుంద, పార్వతీకళ్యాణంలో పార్వతి, సూత్రధారి వంటి పాత్రలను పోషించారు. నాట్యము, నృత్తము, నృత్యం వ్యస్త నృత్యాంశాలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ‘కూచిపూడి భాగవతుల చరిత్ర పుటలు’ అనే పుస్తకాన్ని ఆయన రచించారు. సిద్దేంధ్ర యోగిపై టెలీఫిల్మ్‌ను తీయగా అందులో సూత్రధారి వేషంలో అలరించారు. ఆయన ప్రతిభను గుర్తించిన దూరదర్శన్‌ సంస్థ ప్రతినిధులు ఎటాప్‌ హోల్డర్‌గా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు, కేంద్ర సంగీత నాటక అవార్డు, అకాడమీ ఆఫ్‌ యూనివర్శల్‌ గ్లోబల్‌ పీస్‌ ద్వారా గౌరవ డాక్టరేట్‌ పొందారు. ‘కూచిపూడిలో సూత్రధారీ విధానం (యువ హాస్యకారి)’పై రెండేళ్లపాటు ఫెలోషిప్‌ (తంజావూరు) చేశారు.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️