వేసవిలో చర్మాన్ని కాపాడుకుందాం..!

Apr 22,2025 04:06 #health tips, #Jeevana Stories, #Summer

ఎండలు మండిపోతున్న వేసవిలో చర్మాన్ని కాపాడుకోవటం కూడా చాలా కీలకం. భానుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలి పోతుంటుంది. చెమట పొక్కులు మొదలుకొని సెగగడ్డలు దాకా ఎన్నో రకాల సమస్యలు చర్మంపై దాడిచేస్తుంటాయి. జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా చెప్పుకుంటే అనేక సమస్యలు ఇబ్బంది పెట్టేవి చాలా ఉన్నాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మంపై ఎండ ప్రభావంతో ముఖం, కళ్లు జీవం లేనట్లుగా కనిపిస్తుంటాయి. కంటి చుట్టూ నల్లటి వలయాలు, ముఖంలో తాజాదనం లేకపోవడం వంటి సమస్యలు ఎదురవు తుంటాయి. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించటం ద్వారా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.
మృతకరణాలు తొలగించుకోవాలి : చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే వాటిలో మృతకణాలు కూడా ఒకటి. వీటి వల్ల చర్మం డల్‌గా కనిపిస్తుంటుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. ఈ క్రమంలో మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. సౌందర్య రక్షణలో భాగంగా వీటిని తొలగించు కోవడం చాలా అవసరం. దీనికోసం స్నానం చేయడానికి ముందు ఏదైనా ఏదైనా నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే కొంతవరకూ మృతకణాలు పోతాయి. చర్మానికి ఎలాంటి హానిలేకుండా సులభంగా వీటిని వదిలించుకోవచ్చు.
మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి : అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవటం సహజంగా జరిగే ప్రక్రియే. దీనికోసం వివిధ రకాల క్రీములు వాడటం, వ్యాక్సింగ్‌ చేసుకోవటం వంటివి చేస్తుంటారు. వీటివల్ల చర్మం ఇరిటేట్‌ అయి ఎరుపెక్కడం, దురదరావడం…ఇలా పలు సమస్యలు తలెత్తుతాయి. అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ముందు, ఆ తర్వాత ఆ ప్రదేశంలో చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేయడం తప్పనిసరి. దీనికోసం చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజింగ్‌ క్రీములను ఎంపికచేసుకోవాలి.
తాజా పండ్లు: వేసవికాలంలో చర్మాన్ని తాజాగా మార్చుకోవడానికి, మెరిపించుకోవడానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం సైతం మేని మెరుపుపై ప్రభావం చూపుతుంది. మచ్చలేని మెరిసే చర్మం సొంతమవుతుంది.
సన్‌స్క్రీన్‌ మేలు : బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవటం మంచిది. ఇది ఎండ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. బయటకు వెళ్లే ముందు ఖచ్చితంగా 20 నిమిషాల ముందే రాసుకుంటే మంచిది. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయటం తప్పనిసరి. చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవడమూ ముఖ్యమే.


వంటింటి చిట్కాలూ మేలే…
వేసవిలో చర్మంపై టానింగ్‌ అనేది ప్రతిఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ఎండ వేడిమితో అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమస్య మరింత ఎక్కువమవుతుంటుంది. సున్నిత చర్మం కలిగిన వారు మరీ ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. సన్‌స్క్రీన్‌ చర్మాన్ని కొంతవరకూ రక్షించినప్పటికీ ఎక్కువ ప్రభావంతంగా పనిచేయదు. ఫలితంగా చర్మం కాంతి హీనమవుతుంటుంది. అందువల్ల చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వంటింటి చిట్కాలతో చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవటంతోపాటుగా వేడి నుంచి రక్షణ పొందొచ్చు.
బాదం పిండి : బాదం పిండి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ పిండితో కలబంద రసాన్ని కలిసి స్నానం చేస్తే చర్మంపై టాన్‌ పోతుంది. ఎక్కువ కాంతివంతంగా కూడా ఉంటుంది.
దోసకాయ : ఇంట్లో ఉండే కూరగాయల్లో దోసకాయ ఒకటి. శరీరానికి నీటిని అందించే కూరగాయ కూడాను. ఇందులో విటమిన్‌ ఎ, బి 1 ఉండటం వల్ల దోసకాయ శరీరం లోపలే కాదు. బయట కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వారానికి మూడుసార్లు దోసకాయను ముఖం, మెడ భాగాల్లోనే కాదు. కాలి భాగాల్లో రుద్దినా ప్రభావం కనిపిస్తుంది.
టమోటా : టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో బయట తిరిగి వచ్చినప్పుడు, టమోటా గుజ్జులో చక్కెర కలుపుకొని ప్యాక్‌లా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు, పొడిచర్మం రెండింటికీ చక్కగా పనిచేస్తుంది. పొడి చర్మం ఉన్న వారు ఇందులో ఆలిల్‌ ఆయిల్‌ లేదా బాదం నూనెతో కలిపి ఉపయోగించొచ్చు. గంధపు చెక్కను ఉపయోగించినా చర్మం కాంతివంతమవుతుంది.
పెరుగు : పెరుగు ఎల్లప్పుడూ చర్మాన్ని సున్నితంగా ఉంచుతుంది. ఎండ నుంచి వచ్చిన తర్వాత పులియబెట్టిన పెరుగును కొంచెం పసుపుతో కలిపి ముఖం, మెడ, చేతి భాగాల్లో మర్దనా చేసి అరగంట తర్వాత కడిగేయొచ్చు. ఇలా చేస్తే ఆయా భాగాల్లో టాన్‌ తొలగిపోయి, ప్రకాశవంతంగా ఉంటాయి.
బొప్పాయి : బొప్పాయితో తయారుచేసిన మాస్క్‌ శరీరంలోని అన్ని భాగాలకూ ఉపయుక్తంగా ఉంటుంది. బొప్పాయి పండ్లను ముక్కలుగా కట్‌ చేసి గుజ్జుగా చేసి తేనెతో కలిపి ముఖం, మెడ భాగాల్లో ప్యాక్‌లా అప్లైచేసి ఓ 20 నిముషాలు ఆగి కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. వేడి వల్ల ఏర్పడే మొటిమలు రాకుండా చేస్తుంది.
నారింజ, నిమ్మ : చర్మానికి అవసరమైన సి విటమిన్‌ నారింజ, నిమ్మ భర్తీ చేస్తాయి. పెరుగు పులియబెట్టి నారింజ రసం కలిపి చర్మంపై అప్లై చేయాలి. ఇది సన్‌ టాన్‌తోపాటు పొడి చర్మాన్ని నివారిస్తుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. నిమ్మరసం తరచుగా చాలామంది ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని రిఫ్రెష్‌ చేస్తుంది.

ఇవి కూడా చేయొచ్చు
–  ఐస్‌ ముక్కల్ని ముఖంపై రద్దుకోవటం ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది. ముడతల ప్రభావం తగ్గుతుంది.
– కీరదోస గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టాక ముఖం, మెడపై రాసుకుంటే మురికిని తొలగించి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది.
– కలబంద గుజ్జును ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత ముఖానికి మర్దన చేస్తే కమిలిన చర్మం తాజాగా మారుతుంది. చర్మంపై వేడి ప్రభావం కూడా తగ్గుతుంది.
– గులాబీ నీటిని గోరువెచ్చగా చేసి కీరదోస రసం కలిపి ఐసుముక్కలను కళ్లపై పెట్టుకుంటే కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు దూరమవుతాయి. ఉబ్బిన కళ్లకు సాంత్వన చేకూరుతుంది.

– డాక్టర్‌ జి.అర్చన మాధురి,
ఎంబిబిఎస్‌, ఎండి డివిఎల్‌,
డెర్మటాలజిస్ట్‌,
కాస్మోటిక్‌ కేర్‌ స్పెషలిస్ట్‌,
విజయవాడ

➡️