ఉరుముతున్న యుద్ధ భయం!

ఇప్పుడు దేశ ప్రజలు రెండు భిన్న భావోద్వేగాలకు గురవుతున్నారు. పహల్గామ్‌ దాడికి ప్రతిగా చేసిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’కి జయజయధ్వానాలు పలకడం ఒకటైతే, దేశంలో యుద్ధ మేఘాలు సృష్టిస్తున్న భయాందోళన రెండోది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు వెన్నాడుతున్నాయి.

‘సిందూర్‌’కి ప్రతిగా ప్రత్యర్థి దేశం జనావాసాలపై దాడులు జరపటం దారుణం. వారి విచక్షణారహిత దాడికి కాశ్మీర్‌లోని కొండ ప్రాంతం పూంచ్‌ గ్రామం అతలాకుతలమైంది. ఆ ప్రాంతాన్ని కవర్‌ చేసిన ఓ అంతర్జాతీయ మీడియా ఆ దృశ్యాలను ప్రసారం చేస్తున్నప్పుడు ఓ మహిళ ఏడుస్తూ ‘ఇది పెను విపత్తు’ అని గట్టిగా అరవడం కనిపించింది.

కుప్పకూలిన భవానాలు, పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడిన గోడలు, దుమ్ము, ధూళితో.. రక్తంతో తడిసిన బట్టలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ‘నేను కూడబెట్టుకున్నదంతా నేలమట్టమైంది’ అన్న రోదనలు అక్కడ వినిపిస్తున్నాయి. ‘సిందూర్‌’ జరిగిన గంటల వ్యవధిలోనే మే 7 బుధవారం అర్ధరాత్రి కాశ్మీర్‌ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతీకార దాడి జరిగింది. ఉదయం 11:30 నిమిషాల వరకు బాంబుల మోత మోగింది. ఈ ఘటనలో 11 మంది అమాయక కాశ్మీరీ పౌరులు మరణించారు. వారిలో పిల్లలు కూడా ఉన్నారు. 40 మందికి పైగా పౌరులు గాయపడ్డారు.
ఈ దాడి గురించి పూంచ్‌ గ్రామ వాసి రమీజ్‌ చౌదరి ఇలా చెప్పారు. ‘ఇప్పుడు జరిగిన దాడి 40 ఏళ్లల్లో మేము ఎప్పుడూ చూడలేదు’ అని ఆయన చెబుతున్నప్పుడు భయంతో గొంతు వణికింది.

యుద్ధం తాలూకు ఈ భయానక పరిణామాలు ముందుగా కాశ్మీర్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో కనిపించాయి. అక్కడ జరిగిన బాంబు దాడులను ప్రత్యక్ష సాక్షులు ఇలా వివరించారు. ‘మొదట మేము ఆ శబ్ధాలను ఉరుములు అనుకున్నాం. ఆకాశం గర్జించినట్లు మాకు వినపడింది’ అని పూంచ్‌లోని చందక్‌ గ్రామానికి చెందిన 22 ఏళ్ల అల్తాఫ్‌ అమీన్‌ చెప్పారు.

మాకు యుద్ధం వద్దు..

భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతం ఎల్‌ఓసీ నుండి పూంచ్‌ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాడి తరువాత అక్కడ రక్తం మడుగులో తడిసిన టీనేజ్‌ బాలుడి మృతదేహాన్ని వ్యాన్‌లో ఎక్కించడం వీడియోలో కనిపించింది. అతని ఒక చెయ్యి పూర్తిగా విరిగిపోయి ఉంది. అదే వీడియోలో విడివిడి భాగాలతో రక్తం ముద్దయిన ఓ బాలుడి శవం చూడడానికే భయంకరంగా ఉంది. బాంబు దాడిలో అతని తల పూర్తిగా ఛిద్రమైంది. ఈ పరిణామాలే ఆ ప్రజలను యుద్ధం నుండి దూరంగా ఉంచమని వేడుకుంటున్నాయి.

‘మాకు బాంబు మోతలు కొత్తవి కాదు.. కానీ, 2003 కాల్పుల విరమణ తరువాత చోటుచేసుకున్న ఈ పరిణామాలు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి’ అంటూ ఆ గ్రామస్తులు వేరే ప్రాంతాలకు గుంపులు గుంపులుగా తరలిపోతున్నారు.

పూంచ్‌ జిల్లా నుండి దాదాపు 260 కిలోమీటర్ల దూరంలో ఉత్తర కాశ్మీరంలో బారాముల్లా జిల్లా ఉంది. అక్కడి సరిహద్దు గ్రామం సలామాబాద్‌ ఉరి వాసులు ఈ దాడులతో భయాందోళనలకి గురై పిల్లాపాపలతో ఊరు వదిలి పోతున్నారు. పర్వత ప్రాంతమైన సలామాబాద్‌లో బాంబు దాడికి చాలా ఇళ్ల ఇంటిపైకప్పులు ఎగిరిపడ్డాయి. మంటలు ఎగిసిపడి చుట్టుపక్క గ్రామాలను కూడా శిథిలం చేశాయి. ఈ దాడితో తన ఇద్దరు కుమార్తెలతో ఊరి వదిలిపోతున్న అహ్మద్‌ ఇలా అన్నారు. ‘మేము చాలా భయపడుతున్నాం. మేము చనిపోతామా? మాకు రక్షణ లేదా? ఎక్కడికి వెళ్లాలి. దిక్కుతోచడం లేదు’ అని అతను రోదిస్తూ చెప్పాడు.

80 ఏళ్ల గులాం మహ్మద్‌ చోపాన్‌ మాట్లాడుతూ ‘రాత్రి వేళ జరిగిన ఈ దాడికి తెల్లవారే సరికి ఊరు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ఈ వయసులో ఇల్లు వదిలి పోవాల్సి వస్తోంది. ఇది నాకు చాలా బాధకరమైన సందర్భం. కానీ వేరే మార్గం లేదు’ అని ఆ వృద్ధుడు వాపోయాడు.
కుంకుమ పువ్వు ఎక్కువగా పండే ఈ కొండ ప్రాంతం బుధవారం అర్ధరాత్రి బాంబు మోతలతో దద్దరిల్లింది. నిద్రలో ఉన్న గ్రామస్తులు పెద్ద పెద్ద శబ్ధాలు రావడంతో భయభయంగా మేల్కొన్నారు. రాత్రికి రాత్రే ఊరు దాటి పారిపోయారు’ అని ఉరి వాసి మహ్మద్‌ చెప్పారు.
ఉరి గ్రామ నివాసి ఫరూఖ్‌ అహ్మద్‌ యుద్ధం గురించి ఇలా అన్నారు. ‘యుద్ధాన్ని ఎప్పుడూ ఆహ్వానించకూడదు. ఎందుకంటే బాంబులు మీ గుర్తింపుని అడగవు. అవి అందరినీ నాశనం చేస్తాయి. యుద్ధానికి పిలుపునిచ్చే వారికి అర్ధరాత్రి నిద్రపోతున్న మీ పిల్లలపై బాంబులు పడినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

➡️