
వాషింగ్టన్ : వివాహ బంధం నుండి వేరుపడేందుకు మరో కుబేర జంట సిద్ధమయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు.. దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (49), ఆయన భార్య నికోల్ షనాహన్ (37) లు విడాకుల బాటపట్టారు. అయితే, మనస్పర్ధల కారణంగా... 2021 నుంచి సెర్జీ బ్రిన్-షనాహన్ వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం. వీరి విడాకులకు సంబంధించి సెర్జీ బ్రిన్ ఈ నెలలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
2015లో మొదటి భార్యతో విడాకులు..
సెర్జీ బ్రిన్ మొదట 23 అండ్ మీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు అన్నే వొజిస్కీని 2007లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 2015లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం సెర్జీ బ్రిన్-షనాహన్తో సహజీవనాన్ని సాగించారు. 2018లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. షనాహన్కు మూడేళ్ల కూతురు ఉంది. విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన వీరు పరస్పరం విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సెర్జీ బ్రిన్ సంపద 94 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7 లక్షల కోట్లు)
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్ను లారీ పేజ్తో కలిసి సెర్జీ బ్రిన్ 1998 లో స్థాపించారు. అనంతరం దానిని ఆల్ఫాబెట్ కంపెనీగా మార్చారు. అయితే, 2019 లో సెర్జీతోపాటు లారీ పేజ్ కూడా ఆల్ఫాబెట్ నుంచి బయటకు వచ్చారు. అయినప్పటికీ వారికి అందులో షేర్లు ఉండటంతో ఆ సంస్థ బోర్డు సభ్యులుగా ఇద్దరూ కొనసాగుతున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం... సెర్జీ బ్రిన్ సంపద 94 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7లక్షల కోట్లు).
ప్రపంచ కుబేరుల్లో విడాకులు పొందిన మూడో జంట..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ - మెకంజీ స్కాట్ దంపతులు విడాకులు తీసుకున్నారు.
ఇటీవలే... ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్-మిలిందా దంపతులు కూడా విడాకులు తీసుకున్న సంగతి విదితమే. అయితే, గత మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులు పొందిన మూడో జంట సెర్జీ బ్రిన్-షనాహన్ కావడం విశేషం. విడాకుల సమయంలో ఈ కుబేరులు భారీ స్థాయిలో భరణాన్ని సమర్పించుకున్నారు. వారి సంపదలో ఎంత మొత్తం చెల్లించారనే విషయాన్ని కూడా వెల్లడించారు.
ప్రైవేటు న్యాయమూర్తిని ఎంచుకున్నారు.. వివరాలు తెలిసే అవకాశం తక్కువే..
హై ప్రొఫైల్ కేసు కావడం, సెర్జీ బ్రిన్-షనాహన్ విడాకులపై ప్రజల్లో ఆసక్తి ఉండటం, చిన్నారి కస్టడీ గురించిన వివరాలు బయటకు వెళ్లే ఆస్కారం ఉన్న నేపథ్యంలో... విడాకుల విషయంపై పూర్తి గోప్యత పాటించేందుకు ఈ జంట చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అందువల్ల వీరి విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.