Mar 26,2023 12:21

న్యూఢిల్లీ  :   ఖలిస్తానీ నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం కేంద్రం కెనడా హై కమిషనర్‌కి సమన్లు జారీ చేసింది.   మా దౌత్యవేత్తలు భద్రత కోసం కెనడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం, ఇలా అయితే వారు దౌత్యవిధులను నిర్వర్తించగలరని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఓ ప్రకటనలో వెల్లడించారు. పోలీసుల సమక్షంలో ఇలాంటి శక్తులను ఎలా అనుమతిస్తారని   కెనడాని ప్రశ్నించారు.   పోలీసులు ఉన్నా భద్రతను ఎలా ఉల్లంఘిస్తారని.. దీనిపై వివరణ ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరింది. వియన్నా కన్వేన్షన్‌ ప్రకారం ఈ దాడిలో పాల్గొన్న  అందరిని అరెస్ట్‌ చేసి, విచారణ జరపాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. అలాగే భారత  రాయబార కార్యాలయం వెలుపల భద్రతా ఏర్పాట్లపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
గత ఆదివారం ఖలిస్తాన్‌ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో కెనడాలో భారత రాయబారి సంజరు కుమార్‌ వర్మ పాల్గొనాల్సిన  కార్యక్రమం రద్దు చేయబడింది.  నిరసనను రిపోర్ట్‌ చేస్తున్న జర్నలిస్ట్‌పై కూడా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.