
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటర్నెట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ తరగతులు తప్పనిసరి అయ్యాయి. ఇంటర్నెట్ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఇంత వినియోగం పెరిగినా... నిత్యవసర వస్తువుగా మారినా... ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 290 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ వినియోగానికి దూరంగా ఉన్నారు. అంటే ప్రపంచంలోని దాదాపు 37 శాతం మందికి ఇంటర్నెట్ అందని ద్రాక్షేనని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వెల్లడించింది. కాగా, ఈ 290 కోట్ల మందిలో 96శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం.
కరోనాకి ముందు అంటే... 2019లో డిజిటల్కి మారిన వారి సంఖ్య 410కోట్లు ఉండగా... ఈ ఏడాది ఆ సంఖ్య 490కోట్లకు చేరినట్లు ఐటీయూ అంచనా వేసింది. అయినా, కోట్లాది మంది ఇంటర్నెట్ సదుపాయం లేక డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. పేద దేశాల్లో ఇంటర్నెట్కి అయ్యే ఖర్చులను ప్రజలు భరించలేక వినియోగించడం లేదని పేర్కొంది. పేదరికం, నిరాక్షరాస్యత, పరిమిత విద్యుత్ సదుపాయం, డిజిటల్ నైపుణ్యాల కొరత వారికి సవాళ్లుగా మారుతున్నాయని తెలిపింది. వారందరినీ డిజిటల్గా అనుసంధించడం కోసం.. వారికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఐటీయూ పేర్కొంది.