
ముంబయి : వాస్తవిక కధాంశంతో సూర్య హీరోగా మూడు నెలల క్రితం విడుదలైన సినిమా జైభీమ్ సంచలనం సృష్టిస్తూనే ఉంది. దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ వాస్తవ కథను ఆసక్తి కరంగా మలిచిన విధానం పలువురినీ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రానికి సంబందించిన ఓ వీడియోని 'అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడెమీ' పేరుతో ఉంచారు. అకాడెమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఉంచటం ఇదే మొదటిసారి. దర్శకుడి కథనాన్ని విశ్లేషించిన తీరుపై చర్చించడంతో పాటు సినిమాలోని ఒక సన్నివేశం ప్రసారమైంది. జ్ఞానవేల్ కథ, కథనాన్ని ఎలా నడిపించారు అన్న అంశంపై ఈ వీడియోలో చర్చించారు. ఆస్కార్ యూట్యూబ్ చానెల్లో సూర్య సినిమా ప్రసారం కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ''వాట్ ఎ న్యూస్ జై భీమ్ దూసుకెళుతోంది'' అంటూ ఒక అభిమాని ట్వీట్ చేశారు. దళితుల అణచివేతతో పాటు కులవివక్షకు వ్యతిరేకంగా కోర్టులో ఒక మహిళ జరిపిన పోరాటమే ఈ సినిమా కథాంశం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన జీవితాన్ని దళితులకు న్యాయం అందించేందుకు అంకితం చేసిన ప్రముఖ న్యాయవాది చంద్రు పాత్రలో సూర్య నటించారు. గోల్డెన్ గ్లోబ్స్ 2022లో ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా జై భీమ్ నామినేట్ అయింది.