
వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
జిజిహెచ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
-స్పందనలో కలెక్టర్కు వినతిపత్రం అందజేత
నెల్లూరు:గ్రీన్ వైన్స్ డే స్పందన కార్యక్రమంలో భాగంగా సర్వజన ప్రభుత్వ ప్రధాన వైద్యశాల (జిజిహెచ్) లో గత కొన్ని నెలలుగా పనిచేయునటువంటి 8 లిఫ్టులను మరమ్మత్తు, హాస్పిటల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరుతూ సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి వైద్య సహాయ నిమిత్తం పేద ప్రజలు ప్రభుత్వ సర్వజన ప్రధాన వైద్యశాలకు వస్తుంటారన్నారు. గత కొన్ని నెలలుగా 8 లిస్టులు పనిచేయకపోవడంతో పేషెంట్లు వారి సహాయకులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, కనీసం వీల్ చైర్లు కూడా పేషెంట్లకు సరిపడా లేక వారి సహాయకుల సహకారంతో నడిచి వెళ్తున్నారన్నారు. ఎమ్మారై, సిటీ స్కాన్ రిపోర్టులు సకాలంలో అందజేయకపోవడం వల్ల రోగులకు అందే వైద్య సేవలకు విఘాతం కలుగుతుందని,ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓల సంఖ్య తక్కువగా ఉన్నందువలన రోగులకు సేవలు అందడం లేదని వాపోయారు. అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, మందులను అందుబాటులోకి తీసుకురావాలని, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. ప్రజారోగ్యనికి సంబందించిన సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కష్ణయ్య , కార్యదర్శి వర్గ సభ్యులు కిన్నెర కుమార్ ,కొండా ప్రసాద్ రూరల్ కమిటీ సభ్యులు వీర్ల శ్రీనివాసులు , శాఖ కార్యదర్శి ఒంగోలు సుధీర్ , డివైఎఫ్ఐ రూరల్ కార్యదర్శి కండె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.