ఉద్రిక్తల్లోనూ మార్కెట్లకు లాభాలు

ముంబయి : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడులు నిర్వహించినప్పటికీ సెన్సెక్స్‌, నిఫ్టీలు సానుకూలంగా నమోదయ్యాయి. పాకిస్థాన్‌ ఈ సమస్యను మరింత జఠిలం చేయకపోవచ్చన్న అంచనాల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపట్లోనే లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో 80,747 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 24,414 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, ఐటిసి, రిలయన్స్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మరోవైపు భారత భద్రతా బలగాలు చేపట్టిన దాడుల కారణంగా పాక్‌ మార్కెట్లు మాత్రం కుప్పకూలాయి. కరాచీ 100 ఓ దశలో దాదాపు 6 శాతం నష్టంతో 6,272 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత కొంత కోలుకుని తుదకు 3470 పాయింట్లు లేదా 3.09 శాతం నష్టంతో ముగిసింది.

➡️