ప్రజాశక్తి - ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి,విజయవాడ సిటీ: విజయవాడ టౌటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని వించిపేటలో బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సోదాలు నిర్వహించింది. ఉదయం నుంచి వించిపేట గాంధీబొమ్మ సెంటర్లో పలువురి ఇళ్లల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సోహైల్ బేగ్, మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ మహమ్మద్ అనే ముగ్గురు యువకులను ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, జిహాదీ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయడం లాంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి ఇళ్లతోపాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఎన్ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొదట విజయవాడ వన్టౌన్ కొత్తపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో వేర్వేరు రాష్ట్రాల లింకులు బయటపడడంతో, దీని తీవ్రతను బట్టి ఇటీవలే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఎకు బదిలీ చేసింది.
అప్పటి నుంచి ఈ ఆన్లైన్ నెట్వర్క్పై అధికారులు నిఘా పెట్టారు. అరెస్టయిన ముగ్గురు నిందితులకు నగరంలో లేదా ఇతర ప్రాంతాలలో ఎవరితోనైనా రహస్య సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఏవైనా అనుమానాస్పద పత్రాలు దొరుకుతాయేమోనని ఇళ్లల్లో తనిఖీ నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. ఈ ఏడాది మార్చి, మేలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే.








కామెంట్లు (0)