మృతుని కుటుంబానికి మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శ
ప్రజాశక్తి - అమలాపురం, అమరావతి బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విషాద ఘటన చోటుచేసు కుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో మంగళవారం రాత్రి ఒక ప్రైవేటు కళాశాల వద్ద ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైరు తగిలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్కుమార్ (21)గా గుర్తించారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఆయన తన స్వగ్రామం బెండమూర్లంక వచ్చారు. స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి ఓడలరేవులో ఒక కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బుధవారం అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.ఐదు లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రేమ్ కుమార్ మృతి కలచివేసింది : పవన్ కల్యాణ్
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై జన సైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్లు (0)