జలవనరులశాఖ మంత్రి నిమ్మల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాయలసీమ తాగునీటి అవసరాలకే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తున్నామని, హంద్రీనీవా పరిధిలో 13 టిఎంసిలు అవసరం ఉందని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనిపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2027 జూన్ వరకు శ్రీశైలం జాలలను తాగునీటి కోసం భద్రపరచుకోవాల్సి ఉందని, కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, అగ్రికల్చర్ శాఖలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు నీటి విడుదల చేపడుతున్నామని వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టిఎంసిల నీరు అందుబాటులో ఉండగా, రానున్న పది రోజుల్లో మరో 100 టిఎంసిల వరకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి ఉన్న 63 శాతం వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హంద్రీనీవా పరిధిలో రిజర్వాయర్ల తాగునీటి అవసరాల కోసం 13 టిఎంసిలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టిఎంసిల నీటిని గురువారం నుంచి విడుదల చేయనున్నామన్నారు. అలాగే తెలుగుగంగ ద్వారా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 10 టిఎంసిల నీటిని విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో తాగునీటి అవసరాల కోసం 32 టిఎంసిల నీరు అవసరమని తెలిపారు.








కామెంట్లు (0)