- నితీశ్రెడ్డి అరంగేట్రం పక్కా
- నేడు ఇంగ్లండ్తో తొలి టి20
- రాత్రి 7.00గం||ల నుంచి
కోల్కతా: ఇంగ్లండ్తో సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్తో తొలుత ఐదు టి20ల సిరీస్, ఆ తర్వాత వన్డే సిరీస్లో తలపడనుంది. ఐదు టి20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో బుధవారం తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఈ సమరానికి ‘సై బాల్ వర్సెస్ బజ్బాల్’గా క్రీడా నిపుణులు నామకరణం చేశారు. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో తొలిసారి ఆడనున్నాడు. ఇటీవల దేశీయ క్రికెట్లో రాణించి ఫిట్నెస్ సాధించిన షమీ.. మళ్లీ జట్టులో చోటు సాధించాడు. దీంతో అందరి దృష్టి షమీపైనే ఉంది. స్వదేశంలో, టి20లో భారత్ను ఓడించడం పర్యాటక జట్లకు పెద్ద సవాలే. ఈ ఫార్మాట్లో భారత జట్టుపై ఇంగ్లండ్ రికార్డు మెరుగ్గా ఉండగా.. అగ్రశ్రేణి జట్లలో అత్యధిక విజయశాతం కలిగిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. 24 మ్యాచుల్లో భారత జట్టుపై ఇంగ్లాండ్ 11 సార్లు గెలిచింది. విజయశాతం 45.80శాతం ఉంది. ఇక ఏ జట్టయినా భారత్ను సొంత మైదానాల్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. ఇటీవలికాలంలో టి20ల్లో భారత్ రికార్డు అజేయంగా ఉంది. ఈ క్రమంలోనే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా అనేక చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. టి20ల్లో భారత్కు అచ్చివచ్చిన మైదానల్లో ఇదొకటి. ఇప్పటివరకు ఇక్కడ ఏడు టి20 అంతర్జాతీయ మ్యాచులు జరగ్గా.. ఇంగ్లండ్తో ఆడిన ఏకైక టి20లో టీమిండియా ఓటమిపాలైంది.
ఓపెనర్లుగా సంజు, అభిషేక్
గత టి20 ప్రపంచ కప్ని కైవసం చేసుకున్న టీమిండియా.. టైటిల్ విజేతగా నిలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ, జడేజా ఈ ఫార్మాట్లకు గుడ్బై చెప్పారు. శుభ్మన్ గిల్కు సైతం ఛాన్స్ ఇవ్వకపోవడంతో టాప్ ఆర్డర్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. సంజు శాంసన్, అభిషేక్ శర్మ గత కొన్ని సిరీస్ల నుంచి ఓపెనింగ్ చేస్తూ వస్తున్నారు. ఇదే జోడీ ఇంగ్లండ్తో సిరీస్లోనూ ఇన్నింగ్స్ను ప్రారం భించే ఛాన్స్ ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మూడు, నాలులో స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది.
పుష్కలంగా ఆల్రౌండర్లు…
టీమిండియాకు ఈ ఫార్మాట్లో పుష్కలంగా ఆల్రౌండర్లు ఉన్నారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, సుందర్, హార్దిక్ పాండ్యా, నితీశ్రెడ్డితో ఐదుగురు నాణ్యమైన ఆల్రౌండర్లు దొరికారు. ఇక రెగ్యులర్ స్పిన్నర్ల కోటాలో రవి బిష్ణోరు ఉండనే ఉన్నాడు. మరోవైపు రవి బిష్ణోరు ప్లేస్లో వరుణ్కు ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీడియం పేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీశ్రెడ్డి తుదిజట్టులో ఆడే ఛాన్స్ ఉంది. నితీష్ను తీసుకుంటే షమీ, అర్ష్దీప్, హార్దిక్ పాండ్యా రూపంలో జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు కోటాలో ఉన్నారు.
జట్లు(అంచనా)..
భారత్: సూర్యకుమార్(కెప్టెన్), సంజు(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్, రింకు సింగ్, నితీశ్ రెడ్డి, అక్షర్, అర్ష్దీప్, షమీ, వరుణ్.
ఇంగ్లాండ్: బట్లర్ (కెప్టెన్), డకెట్, సాల్ట్(వికెట్ కీపర్), బ్రూక్, లివింగ్స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కిన్సన్, ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్.