నీలి పంట రహస్యాల ‘నీలంపు రాశి’

Apr 28,2025 05:27 #book review, #Nilampu rasi, #sahityam

రచయిత్రి చంద్రలత చాలా ఒద్దికగా, ఓపికగా రాసిన సౌందర్యత్మక కావ్యం, చారిత్రాత్మక నవల ‘నీలంపు రాశి. బ్రిటిష్‌ వారు వృద్ధి చేసిన నీలి పంటను ఇతివృత్తంగా చేసుకొని రాసిన నవల ఇది. 1830- 70 వరకు చరిత్ర సంఘటనలను ఆధారంగా బ్రిటిష్‌ ఇండియాలో రాజకీయ, వ్యవసాయ మార్పులను మిక్కిలి నాటకీయంగా, హృద్యంగా తీర్చిదిద్దిన విధానం చాలా ముచ్చట గొలిపిస్తుంది.
బెంగాల్‌ నేటివ్‌ రచయిత శిశిరుడు ఓడ ప్రయాణం ద్వారా దండుబాటకు చేరుకోవడంతో నవల ప్రారంభమవుతుంది. దండుబాటలో రాబిన్సన్‌ అనే బ్రిటిష్‌ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత జార్జ్‌. అతని కుమారుడు హ్యారీ… ఒక విధంగా ఈ నవలా నాయకుడు అతడే. అతడితోపాటు ఇంగ్లాండ్లో చదువుకుని బ్రిటిష్‌ ఇండియాలో మద్రాస్‌ ప్రెసిడెన్సీకి పరిపాలన అధికారిగా వచ్చిన aరష్ట్రశ్రీవవ. వీరి అధీనంలో ఉన్న ఒక గ్రామంలో సాంబశివుడి కుటుంబం, సాంబశివుడు ద్వారా హ్యారీ నీలి పంటను వ్యాప్తి చేసిన విధానం ఒక పక్క; తూర్పు బెంగాల్లో నీలి పంటపై రైతులు తిరగబడే విధానం.. దానికి వారు ఎదుర్కొన్న శిక్షలు.. ప్రజలను జాగృతం చేసే నాటకాలు రావడం, వాటిని ఫాదర్‌ ఫ్రాన్సిస్‌ లాంటి పాస్టర్లు సహాయ సహకారాలు అందించడం.. ఇదీ సూక్ష్మంగా ఇతివృత్తం.
బ్రిటిష్‌ కుటుంబాలు భారతదేశంలో తమ సంస్క ృతిని విడవకుండా ఎలా జీవించేవి, వారి అభిరుచులు ఎలా ఉండేవి? ఈ నవల్లో చూడొచ్చు. ఇది నీలి పంటకు సంబంధించిన కథ కాబట్టి లూయిసా పాత్ర ద్వారా ఇక్కడి చేనేత అద్దకాల మాదిరి ప్రతులను సేకరించి స్క్రాచ్‌ బుక్కుగా తీర్చిదిద్దడం.. అలాంటి సరదా పనులు కూడా భవిష్యత్తులో బ్రిటీష్‌ వాణిజ్యానికి, భారతదేశ మార్కెట్‌ను అవగతం చేసుకోవడానికి ఉపయోగపడిన విధానం కథలో అంతర్లీనంగా వివరిస్తుంది ఈ నవల. భారతీయ రైతు కుటుంబాలు ఒకే మాట మీద ఉండే విధానం.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.., బ్రిటిష్‌ రాజ్‌ ద్వారా నూతన పోకడలను ఆస్వాదించి తమకు ఆపాదించుకునే వ్యక్తులకు ఉదాహరణగా సాంబశివుడు, పార్వతి పాత్రలను తీర్చిదిద్దే విధానం.. బ్రిటిష్‌ మాయలో పడకండి అని చివరి వరకు హెచ్చరించి జాతీయోద్యమ ఆలోచనలను రగుల్గొల్పిన చలపతి పాత్ర పాఠకులను ఆకట్టుకుంటాయి.
భారతీయ సాంప్రదాయ చేతివృత్తికి ప్రతినిధి నీలారి కనకయ్య పాత్ర. తన తాత ముత్తాతల నుంచి కళాత్మకంగా నేర్చుకున్న నీలిపంటను భరిణలకెత్తిన విధానం,. అది వస్త్రంపై అందమైన అద్దకంగా మలిచిన తీరు, నీలారి కనకయ్య వేరే పాత్రకు చెప్పినా చదువుతున్న మనలను ఆయన కుటీర పరిశ్రమలోకి తీసుకు వెళ్లి, ఆయనే మనకు చెపుతున్నాడా అన్నంత హృద్యంగా సాగుతుంది. ఇండిగో ప్లాంట్ల చేతిలో ఈ చేతి వృత్తుల వ్యవస్థ ఎలా చిన్నాభిన్నమైందో చూపడం మన హృదయాన్ని మెలి పెడుతుంది.
తూర్పు బెంగాల్‌ ప్రాంతంలో ఒక నేటివ్‌ రచయిత రాసిన ‘నీలార్ణవం’ నాటకం అనువాదం ద్వారా బ్రిటిష్‌ రాజ్‌ కోర్టులో నిలబడ్డ ఫాదర్‌ ఫ్రాన్సిస్‌. మతవ్యాప్తికి వచ్చిన బ్రిటిష్‌ పాస్టర్లు భారతీయుల్లో అక్షర జ్ఞానాన్ని పెంచి, మంచి చెడులను నింపిన వారికి ప్రతీకగా ఫాదర్‌ ఫ్రాన్సిస్‌ పాత్రను ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంగ్లాండ్‌ నుంచి బయలుదేరిన ఓడలు ప్రతి 500 టన్నులకు ఒక పాస్టర్‌ని తీసుకువెళ్లాలి అనే నిబంధన ఉందంట. ”మీ వారి ప్రవర్తనను బట్టి, వారి జీవన విధానాలను బట్టి, మీ మతాన్ని అంచనా వేస్తాం, మీ మత గ్రంథాలతో కాదు” అనే భారతీయుల ఆలోచనను అనుసరించి, పాస్టర్లు ధర్మాన్ని బోధిస్తే అది తమ వ్యాపారానికి ఎక్కడ అడ్డుకట్ట అవుతుందో అని 499 టన్నుల సరుకు మాత్రమే ఓడల్లో పంపించేవారు బ్రిటిష్‌ వర్తకులు. ఈ విషయాన్ని ఈ నవల ఎంత నాటకీయంగా చర్చించిందో..
బ్రిటిష్‌ రాజ్‌లో బ్రిటిష్‌ ఉద్యోగుల కోసం ‘కాంట్రాక్ట్‌ వైఫ్‌ సిస్టం’ దానికి ప్రతిఫలంగా జూలియా లాంటి బిడ్డలు.. అటు బ్రిటిష్‌ వాళ్లకు చెందక, ఇటు భారత సంతతికి చెందక మధ్యన నలిగిపోయే వ్యక్తులకు ప్రతీకలు ఈ జూలియాలు. అలాగే బ్రిటిష్‌ పురటాళ్ళు తమ బిడ్డలకు తగినంత పాలు ఇవ్వలేక, భారతీయ స్త్రీలను తమ బిడ్డలకు పాలిచ్చే దాదులుగా వాడుకునే విధానం, అందులో వారి భయాందోళనలు… దీనికోసం బ్రిటిష్‌ రాణి గారి యాక్ట్‌.. ఇలాంటి సూక్ష్మమైన విషయాలను కూడా ఈ నవల చర్చించింది.
”ప్రకృతితో సంభాషిస్తూ ఉండాలి. అదే నేర్పుతుంది అన్ని కిటుకులనూ” అంటూ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కాదు ప్రకృతి పరిశీలనలలోనే పుడతారు” అంటూ హ్యారి పాత్ర ద్వారా నీలిపంట రహస్యాలను వెలికి తీసే క్రమంలో రచయిత్రి నీలి పంట శాస్త్రజ్ఞురాలవుతారు. వీటిని వివరించే క్రమంలో, మన చుట్టూ ఉన్న పనుల్లో ఎంత శాస్త్రీయత దాగి ఉందో అర్ధమయ్యాక ఒకింత పులకింతకు గురవుతాం.
పుస్తకం పేరు నీలంపు రాశి. ప్రతి పుటలోపూ నీలి పదాన్ని విడిచిపెట్టకుండా పాఠకులకు నీలంపై ఉన్న సమస్త జ్ఞానాన్ని అందిస్తారు రచయిత్రి. సముద్రంలో, ఆకాశంలో, ఇంద్రధనస్సులో, పక్షులలో ఇలా ప్రకృతిలో ఉన్న నీలిరంగును సందర్భానుసారంగా, మిక్కిలి సౌందర్యాత్మకంగా వివరిస్తారు. నవల సార్ధక నామధేయి.
రచయిత్రి సాంప్రదాయ రైతు పక్షపాతి. అతడు లేకపోతే ఈ జీవకోటికి ఆహారం లేదన్న ఆరాధన భావం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పుల్లయ్య కట్ట పులికాట్‌గా రూపాంతరం చెందడం వంటి ఎన్నో పదాల యొక్క పూర్వ నామాలు ఈ నవల వెలికి తీసింది. ఈ రచయిత్రి తెలుగు పదాలను ఎంత ఆత్మీయంగా వాడారో, పుస్తకంలో ఈ రచయిత్రి వాడిన శైలి చదివితే, తెలుగు భాషలో ఉన్న సౌందర్యం మరొక్కమారు ఎరుకలోకి వస్తుంది.
రచయిత్రి ఎన్ని విషయాలను సేకరించారో, నవలలో ఉండే ప్రాంతాలను ఎంత సూక్ష్మంగా పరిశీలించారో ప్రతి పుటలోనూ మనకు కనిపిస్తుంది. తను తెలుసుకున్న ప్రతి విషయం నవలలో మిక్కిలి నాటకీయంగా, సౌందర్యాత్మకంగా నిక్షిప్తం చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో పాఠకుడు కొన్నిచోట్ల మిక్కిలి శ్రద్ధతో, ఏకాగ్రతగా చదవ వలసిన అవసరం ఏర్పడింది. ఈ నవలలో వెతుకుదామన్నా చిన్న అక్షర దోషం కనిపించదు. ఆనాటి చారిత్రక సాక్ష్యాలుగా ఉన్న బొమ్మలు సందర్భానుసారం ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. ఎంతో శ్రమదమాదులుకోర్చి రాసిన ఈ నవలను తెలుగు భాష సంస్కృతి ఆరాధకులందరూ చదవదగ్గది.

– డాక్టర్‌ ఆల్తి మోహన రావు
99638 95636

➡️