Aug 19,2022 11:34

న్యూఢిల్లీ : ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా నివాసంలో సిబిఐ సోదాలు జరపడంపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న పనితీరుకు ప్రతిఫలితమే ఈ దాడులన్నారు. సిబిఐ చర్యను స్వాగతిస్తామని, పూర్తిగా సహకరిస్తామని, అయితే ఏమీ బయటకు రాదని అన్నారు. ఢిల్లీ కొత్త ఎక్సైజ్‌ పాలసీలో అవినీతి ఆరోపణలపై సిబిఐ ఈ రోజు ఉదయం సిసోడియా నివాసంతో సహా 21 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఈ దాడులపై కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. 'ఢిల్లీలో విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ... సిసోడియా ఫోటోను అమెరికా అతిపెద్ద వార్తా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తన ఫ్రంట్‌ పేజీలో పోస్టు చేసింది. ఆ రోజే సిబిఐ దాడులు వచ్చాయి' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సిబిఐని స్వాగతిస్తున్నామని, పూర్తిగా సహకరిస్తామన్నారు. గతంలో కూడా దర్యాప్తులు, సోదాలు జరిగాయని, ఏదీ బయటకు రాలేదని, ఇకపై కూడా రావని పేర్కొన్నారు. అదేవిధంగా మనీష్‌ సిసోడియా ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. 2021-22 ఎక్సైజ్‌ పాలసీ అమలులో అవినీతి జరిగిందంటూ గత నెలలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా.. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి విదితమే.