Mar 19,2023 17:12

హైదరాబాద్‌  :   తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయల్దేరారు. ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కెటిఆర్‌, ఎంపి సంతోష్‌లు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న ఈడి విచారణకు హాజరుకాలేదు.
విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడి కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.