
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ వారి సమస్యలు విని, ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదేపదే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్దితులు ఉండకూడదని, పోలీస్ అధికారులే స్వయంగా బాదితుల వద్దకు వెళ్లి విచారించి సకాలంలో చట్టపరిధిలో ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్నీత గడువులోపు పరిష్కరిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలతో 39 మంది ఫిర్యాదుదారులు జిల్లా ఎస్పీకి వారి సమస్యలు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి పి మహేష్, స్పందన ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య సిబ్బంది పాల్గొన్నారు.