
- రాయలసీమ 3 జిల్ల్లాల్లో అమలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాయలసీమలోని మూడు జిల్లాల్లో జూన్ 1 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాగులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరూులు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి ఒక్కో రేషన్ కార్డుకు గరిష్టంగా మూడు కిలోలు బియ్యానికి బదులు రాగులను ఉచితంగా ఎమ్డియు వాహనాల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. ఇందులో ఎటువంటి బలవంతం లేదని, కార్డుదారుల ఇష్టం బట్టి బియ్యం లేదా రాగులు తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. రాగులు పంపిణీ ద్వారా సుమారు 10 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. పూర్తిస్థాయి నిల్వలు చేరుకోగానే రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో జులై 1 నుంచి రాగులు ఉచిత పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 2023ను మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించి ఇప్పటికే నంద్యాల జిల్లాలో జనుల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరుకు తెలియజేయాలని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.