
శ్రీనగర్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై మంగళవారం రాహుల్ గాంధీ స్పందించారు. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. జమ్ములో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. దిగ్విజయ్ వ్యాఖ్యలతో తాను, పార్టీ ఏకీభవించడం లేదని అన్నారు. సాయుధ బలగాలు ఎలాంటి రుజువులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటితో పార్టీకి సంబంధం లేదని అన్నారు. పార్టీ అభిప్రాయాలు చర్చల నుండే వెలువడుతాయని, మన భద్రతాదళాల సామర్థ్యం తనకు తెలుసునని అన్నారు. వారు ఎలాంటి రుజువులు చూపించాల్సిన అవసరం లేదని రాహుల్గాంధీ వెల్లడించారు. జమ్ముకాశ్మీర్లో కొనసాగుతున్న భారత్ జోడోయాత్రలో సోమవారం దిగ్విజయ్ సింగ్ పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి బిజెపి పదేపదే ప్రస్తావిస్తోందని, అబద్ధాలతో పాలన సాగిస్తోందని మండిపడ్డారు. చాలామందిని చంపామని చెబుతుంది కానీ రుజువులు మాత్రం ఇప్పటివరకు చూపించలేకపోయిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.