
ప్రజాశక్తి-చీరాల
ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నాటు తయారీని అరికట్టేందుకు కిరాణా షాపుల దుకాణదారులు అందరూ సహకరించాలని డిఎస్పీ శ్రీకాంత్ అన్నారు. శనివారం బోడిపాలెంలోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుకాణదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాణ దుకాణాలలో నాటు సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం, పలు పదార్థాలను కొనుగోలు చేస్తున్న వ్యక్తుల వివరాలను సేకరించాలని సూచించారు. నల్ల బెల్లం 10 కేజీలకు మించి ఎవరైనా కొనుగోలు చేసినా వారి ఆధార్, సెల్ నెంబర్ వివరాలను సేకరించాలని, అనుమానితులకు, కొత్త వ్యక్తులకు వాటిని అమ్మరాదని సూచించారు. నింబంధనలను మీరితే నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన సమయంలో వారిపై కట్టే కేసులలో ముడి పదార్థాలను అమ్మిన దుకాణదారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వన్టౌన్ సిఐ మల్లిఖార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.