‘Cosmos 482’ – భూమ్మీదకు దూసుకొస్తున్న ‘కాస్మోస్‌ 482’..!

సైటెక్‌ : అర్థ శతాబ్దం క్రితం సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్‌ 482’ శనివారం భూమ్మీద దూసుకొస్తూ కూలబోతోంది..! శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్‌ ఈ కాస్మోస్‌ 482 ను ప్రయోగించింది. ఈ వ్యోమనౌకకు 495 కిలోల ల్యాండర్‌ను అమర్చారు. ఈ నౌక శుక్ర గ్రహ కక్ష్యలోనికి వెళ్లి ల్యాండర్‌ను అక్కడ దించాలి అయితే ప్రయోగం విఫలమై ల్యాండర్‌తోపాటు ఈ నౌక కూడా భూ కక్ష్యలో ఇరుక్కుపోయింది. గడిచిన 53 ఏండ్లుగా ఇది కక్ష్యలోనే తిరుగుతూ మెల్లమెల్లగా భూమిని సమీపిస్తోంది. ఇది నేడు భూమ్మీద కూలనుంది. ఈ 500 కెజిల బరువున్న నౌక, 242 కిలో మీటర్ల వేగంతో వస్తూ నేరుగా భూమిని ఢీకొట్టనుందని యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) అంచనా వేసింది.

దీని డిజైన్‌ ప్రత్యేకం… ఫిరంగిలా దూసుకొస్తుంది..
భూమిపై 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న సువిశాల ప్రదేశంలో అటు బ్రిటన్‌ మొదలుకొని ఇటు ఆస్ట్రేలియా వరకు ఈ అంతరిక్ష నౌక ఎక్కడైనా కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, పీడనపరంగా భూమి వాతావరణంతో పోలిస్తే శుక్ర గ్రహంపై పరిస్థితులు కఠినంగా ఉంటాయి. అప్పటి కాలంలో … అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని శుక్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగేలా ‘కాస్మోస్‌ 482’ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసి, టైటానియం ఉష్ణరక్షణ కవచంలో ఉంచి ప్రయోగించారు. అందువల్ల భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ ఇతర అంతరిక్ష నౌకలు, ఖగోళ వస్తువుల మాదిరిగా ‘కాస్మోస్‌ 482’ గాలి ఒరిపిడికి మండిపోయి శకలాలుగా రాలిపోదని, ‘ఫిరంగి గుండు’ మాదిరిగా ‘ఒకే ముక్క’గా చెక్కు చెదరకుండా భూమిపై కూలుతుందని భావిస్తున్నారు.

ఇప్పుడు దూసుకొస్తుంది నాలుగో ముక్క …
నిజానికి ప్రస్తుతం భూమిపై కూలబోయేది నౌకలో ఒక భాగం మాత్రమే. ఇప్పటికే అంతరిక్షంలో ఇది 4 ముక్కలయ్యింది. 2 ముక్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి 48 గంటలపాటు మండి ఆవిరైపోయాయి. మరో భాగం కూడా ఈ తరహాలోనే కొంత నాశనమయ్యి న్యూజిలాండ్‌ సమీపంలో పడింది. ఒకటి మాత్రం భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. అది కూలడానికి మరింత సమయం పడుతుంది. మిగిలిన నాలుగో ముక్క మాత్రం ఇప్పుడు భూమిపైకి వేగంగా దూసుకొస్తుంది. ఈ నౌక ప్రాథమికంగా ఈజిప్టు, సిరియా, తుర్కియే, అజర్‌ బైజాన్‌ దేశాల్లో కుప్పకూలే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

పారాచూట్‌ పాడైపోయి ఉండవచ్చు…
రోదసి నుంచి భూమిపై కూలిపోయే ఇతర వ్యర్థాలతో పోలిస్తే ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ పతనం వల్ల తలెత్తే ప్రమాదం తక్కువేనని అంటున్నారు. అప్పట్లో శుక్రుడిపై ఈ నౌక దిగే సమయంలో ‘కాస్మోస్‌ 482’ వేగాన్ని తగ్గించడానికి పారాచూట్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అయితే 50 ఏళ్లకు పైగా నౌక అంతరిక్షంలోనే ఉండిపోవడంతో సౌర వికిరణం ప్రభావానికి ఆ పారాచూట్‌ వ్యవస్థ పాడైపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

జనావాసాలపై కూలే అవకాశాలు తక్కువే..
ఒమన్‌ సింధుశాఖ, ఈశాన్య ఆఫ్రికా, బోర్నియో, పశ్చిమార్ధ గోళంలోని ప్రదేశాల్లో వ్యోమనౌక కూలవచ్చని, అయితే భూమిపై సముద్ర ప్రాంతాలతో కూడిన జలావరణమే 70 శాతం ఉంది కాబట్టి జనావాస ప్రాంతాల్లో అది కూలే అవకాశాలు స్వల్పమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక అది నేరుగా ఒక వ్యక్తిపై పడే అవకాశం వేలు, లక్షల వంతుల్లో ఒక శాతం వంతు మాత్రమేనంటున్నారు.

➡️