
- 1-8 తరగతుల స్కాలర్షిప్స్ నిలిపివేత
- 9, 10 తరగతులకే ఇస్తామన్న మోడీ సర్కార్
- పేద విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేయటమే : కాంగ్రెస్
- కేంద్ర నిర్ణయాన్ని ఖండించిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్
న్యూఢిల్లీ : ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ల జారీలో మైనార్టీ విద్యార్థులకు కేంద్రం మొండిచేయి చూపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్కాలర్షిప్ పథకం నుంచి 1 నుంచి 8వ తరగతి మైనార్టీ విద్యార్థులను తొలగిస్తున్నామని ప్రకటించింది. 9, 10 తరగతుల విద్యార్థుల దరఖాస్తులనే ధ్రువీకరిస్తామని కేంద్రం తాజాగా వెల్లడించింది. 9, 10 తరగతుల విద్యార్థులు మాత్రమే అర్హులని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. దీనికి సంబంధించిన నోటీస్ ఒకటి జాతీయ స్కాలర్షిప్ పోర్టల్లో విడుదల చేశారు. సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల శాఖ అమలుజేస్తున్న ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి అనుగుణంగా ఇకపై నిబంధనలుంటాయని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, బిఎస్పి సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
స్కాలర్షిప్ కేవలం 9, 10 తరగతుల విద్యార్థులకే పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమియత్ ఉలేమా-ఈ-హింద్ తీవ్రంగా ఖండించాయి. సచార్ కమిటీ నివేదిక తర్వాతే ముస్లిం సమాజానికి ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్-కమ్మీన్స్ స్కాలర్షిప్స్ మొదలయ్యాయని, దీనిని ఇప్పుడు ఆపేయాలని నిర్ణయించటం సరైంది కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. స్కాలర్షిప్ ఆపేయటం వల్ల పాఠశాలల్లో ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ పథకం నుంచి మైనార్టీల విద్యార్థులను తొలగించటాన్ని బిఎస్పి నాయకుడు కున్వర్ డానిష్ అలీ ఖండించారు. పేద పిల్లల్ని విద్య నుంచి దూరం చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన కుట్రగా కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా అభివర్ణించారు.
2014-15కి ముందు 3.03 కోట్ల స్కాలర్షిప్లు ఇవ్వగా, అటు తర్వాత 5.20 కోట్ల స్కాలర్షిప్లు మైనార్టీ విద్యార్థులకు పంపిణీ చేశామని పార్లమెంట్లో (ఈ ఏడాది మార్చిలో) అప్పటి మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. ఆయన విడుదల చేసిన వివరాల ప్రకారం, 2014-15-2021-22 మధ్యకాలంలో మొత్తం 3,36,11,677 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఇందులో ముస్లిం విద్యార్థులు 53,13,905, క్రైస్తవ విద్యార్థులు-53,13,905, సిక్కు విద్యార్థులు-35,90,880, బౌద్ధ విద్యార్థులు-12,98,637, జైన్ విద్యార్థులు-4,58,665 మంది ఉన్నారు. వీటి కోసం కేంద్రం రూ.9,057 కోట్లు కేటాయించిందని నఖ్వీ చెప్పారు.
- ప్రభుత్వం ఎంత డబ్బు ఆదా చేస్తుంది? : ఖర్గే
మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు నిలిపివేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే బుధవారం విమర్శలు గుప్పించారు. 'నరేంద్ర మోడీ జీ, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఎస్సి, ఎస్టి, ఒబిసి, మైనార్టీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ను మీ ప్రభుత్వం నిలిపివేసింది. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందకుండా చేయడం ఏమిటి? పేద విద్యార్థుల నుంచి ఈ డబ్బును లాక్కోవడం ద్వారా మీ ప్రభుత్వం ఎంత డబ్బు సంపాదిస్తుంది లేదా ఎంత డబ్బు ఆదా చేస్తుంది' అని ఆయన ప్రశ్నించారు.