‘నా గుండె లోలకమై నీ పేరుతో డోలనాలు చేస్తుంది… నా బ్రెయిన్ తలపులలో ఆనందపు స్పెక్ట్రమ్ ఏర్పడింది’ ఇలా సాగుతుంది కవితా ఝరి ‘శూన్యం’ అనే కవితా సంకలనంలో. ఇది ఫిజిక్స్ అరుణ్ కుమార్కి మాత్రమే సొంతమైన వైజ్ఞానిక కవిత్వం. శాస్త్రీయత అతని తత్వం. సర్వ మానవత్వం అతని కవిత్వం. సాహిత్యం, సామాజికం, శాస్త్రీయం కలగలిపిన కవితా సంకలనం ‘శూన్యం’. భాషపై పట్టు… సైన్స్.. సామాజిక అంశాల మేళవింపుతో ముస్తాబైన కవితా కిరణాలను సాహితీ ప్రపంచంలోకి ప్రసరింపచేస్తున్నారాయన. సైన్స్లో భాగమైన ఫిజిక్స్ను ఇంటిపేరుగా ధృవీకరించుకున్న శక్తితో వినూత్న ప్రయాణం చేస్తున్న అరుణ్ సమాజంలోని రుగ్మతలను కవిత్వం అనే ఆయుధంతో రూపుమాపాలని తపిస్తుంటారు.
‘నేనో సీతాకోక చిలుకనై.. నా బాల్యపు స్మృతులను.. నా బ్రెయిన్ మెమొరీలో వెతగ్గా.. అసూయ, కోపం, స్వార్థంలేని పసిప్రాయం ఎంత బాగుందో..!’ అంటూ చిన్ననాటి నిస్వార్థపు గుర్తులను ఆనందంగా నెమరువేసుకుంటారు. ‘బాల్యమే బాగుంది. మళ్ళీ మళ్ళీ రానంది. నా మనసేమో మళ్ళీ ఓసారి రమ్మంటోంది’ అని ఆశావహాన్ని వ్యక్తం చేస్తారు ‘నానమ్మ పెంచిన ప్రాణాలే’ కవితలో రచయిత.
శ్రీశ్రీ గురించి చెబుతూ ‘కామన్ మ్యాన్కూ కవిత్వం రాసే హక్కుందని.. నవ కవిత కోసం దారి మార్చి హైవే వేశాడు’ అంటారు రచయిత. ‘మహాప్రస్థానపు మహా విస్ఫోటనపు విప్లవ క్షిపణుల వికిరణాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ ప్రయాణం అనితర సాధ్యం/ ఫిజిక్స్ ప్రభావం తీరని దాహం అని తనదైన శైలిని చిలకరిస్తారు ‘విప్లవ క్షిపణుల వికిరణాలు’ అనే కవితలో.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి నోబెల్ బహుమతి ఆసియాలోనే తొలిగా వచ్చిందని కొనియాడుతూ.. ‘జనగణమన’ మానవతా శిఖరంపై మతసామరస్యపు సందేశం ప్రతిధ్వనిస్తుందంటారు ‘మళ్ళీ ఓసారి నా దేశాన్ని మేల్కొలుపు’ అనే కవితలో.
మనిషి జీవించిన కాలంలో కోపం, అసూయాద్వేషాలు, అహంకారంతో.. అనాగరికతలో కొట్టుమిట్టాడటం తగదంటారు ‘చివరకు ఏం మిగిలింది’ అనే కవితలో. చనిపోయిన స్థితిలో ‘చితిమంటల కొలిమిలో నువ్వు దహనమైనప్పుడు కొన్ని ఏడుపుల మెరుపుధ్వనులైనా నీ చెవికి వినిపించాయా.. నలుగురు మోస్తున్న పాడెపై/ నిశ్శబ్దపు నిశ్చితార్థపు శాశ్వత/ నిద్రలో నువ్వు స్వప్నిస్తున్నప్పుడు/కొన్ని చైతన్యపు నడకల అలజడుల తంత్రులైనా నిన్ను కదిలించాయా.. అని నిష్కర్షగా ప్రశ్నిస్తారు రచయిత.
‘మళ్ళీ వస్తానమ్మా అని అమ్మకు మాటిచ్చి వెళ్ళిన కొడుకు ఓ మూటలో ముద్దలా వచ్చాడు ఇంటికి’ అంటూ హృదయాన్ని కదిలిస్తారు.. ‘మరో భగత్సింగ్ నా కొడుకంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటుంటే’ అనే దేశభక్తితో కూడిన భావావేదన కవి హృదయంలో కనిపిస్తుంది ‘అమ్మ జాతీయ జెండాను ముద్దాడింది’ అనే కవితలో.
ప్రాస.. కవి ధ్యాస టైటిల్లో వ్యక్తపరుస్తూ రాసిన ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్’ అనే కవిత, ప్లాస్టిక్ మహమ్మారి వలన భూమికి గల ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది. ప్రకృతి పరిరక్షణ నినాదంతో బతుకు విప్లవపు ప్రయాణం తథ్యమని చైతన్యపరుస్తోంది ఈ కవితా రూపం.
చికాగో సమావేశంలో నా దేశపు సందేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న వివేకానందుడి వాగ్ధాటి.. రామేశ్వరం వీధుల సాక్షిగా/కలాం మీకు సలాం అంటూ../కుష్టు వ్యాధిగ్రస్థులకు అమ్మ అయిన మథర్ థెరిసా స్ఫూర్తిని గుర్తుచేస్తూ.. బుద్ధుడు, గాంధీల చరిత్రను ఉటంకిస్తూ.. నాదేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగపు గుండె చప్పుడులో మత సామరస్యం, మానవత్వపు పరిమళం ప్రతిధ్వనిస్తున్నాయంటారు ‘మన రాజ్యాంగపు గుండె శబ్దమై’ అనే కవితలో.
‘యుగాది పాఠం’ అనే కవితలో ‘శిశిరం శూన్యమవుతుంది/ వసంతం మళ్ళీ చిగురిస్తుంది అంటూ భవిష్యత్తరాలకై కొత్త సంవత్సరంలో జీవిత ఉద్యమం ఆరంభించమంటూ ఉత్తేజభరితమైన సందేశాన్నిస్తున్నారు రచయిత.
మాతృభాష గత చరిత్రగా మిగిలిపోకూడదని, ఘనకీర్తితో వెలుగొందాలని తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించమంటారు ‘మన తెలుగు వెలుగు’ అనే కవితలో. ‘నేడేమైనా జరగని మిత్రమా. జయమో, అపజయమో, రేపోకటి ఉందని, గెలుపు వెలుగు చిమ్మే చీకటిని మ్రింగే స్తుందని నువ్వెప్పుడూ మరువకు’ అంటూ చరితకు నువ్వే ఓ టాగ్ లైన్ అంటూ యువతకు ప్రభోదిస్తాడు.
విభిన్నమైన అంశాలపై తనదైన రీతిలో రాసిన ఈ కవితా సంకలనానికి రచయిత భావాలకు అనుగుణంగా చిత్రకారుడు ఎస్.యెన్. వెంటపల్లి అందించిన ముఖచిత్రంతో కర్షక్ ప్రింటర్స్ హైదరాబాదు వారి ప్రచురణతో పుస్తకం ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
‘శూన్యం’లో వెలుగుతున్న అరుణ కిరణాలను మనమూ చదివి ఆస్వాదిద్దాం. శాస్త్రీయాన్ని జీవితానికి ఆపాదించుకుందాం.
పి. అరుణ్ కుమార్,
9394749536
వెల: రూ 220/-
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,
తెలంగాణా- 509209
టి. టాన్య
7095858888