అధిక రక్తపోటు నివారణ, గుర్తింపు, నియంత్రణ గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రపంచ హైపర్టెన్షన్ లీగ్ (డబ్ల్యూహెచ్ఎల్) ఆధ్వర్యంలో 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 17వ తేదీన ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నా అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం పెరుగుతూనే వుంది. ”మీ రక్తపోటును కచ్చితంగా కొలవండి, నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి” అన్నది ఈ సంవత్సరం ప్రపంచ రక్తపోటు దినోత్సవం యొక్క థీమ్. ఈ థీమ్ ఆరోగ్యం, దీర్ఘాయువును మెరుగుపరచడానికి కచ్చితమైన రక్తపోటు పర్యవేక్షణ, ముందస్తు గుర్తింపు, రక్తపోటు యొక్క సమర్థవంతమైన నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ రక్తపోటు గురించి కొన్ని విషయాలు..
ప్రపంచవ్యాప్తంగా 30-79 సంవత్సరాల వయస్సు గల 128 కోట్ల పెద్దలు రక్తపోటును కలిగి ఉన్నారు, మూడింట రెండు వంతులు తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. ఇటీవల కాలంలో రక్తపోటు బారినపడిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. గతంలో 30 సంవత్సరాల పైబడిన వారిలో అధిక రక్తపోటు సమస్య ఉండేది. ప్రస్తుతం 20 సంవత్సరాల వయసు వారు కూడా రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారైనా బి.పి చూపించుకోవలసిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది.
నిశ్శబ్ద హంతకి….
ప్రపంచవ్యాప్తంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ముగ్గురిలో ఒకరికి, భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉంది. గ్రామీణ నివాసితులలో 21.4 శాతం మందికి, పట్టణ నివాసితులతో 25 శాతం మందికి అధిక రక్తపోటు ఉంది. తమకు బి.పి ఉందనే విషయం చాలామందికి తెలియదు.రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే నిశ్శబ్ద మరియు విస్తృతమైన ఆరోగ్య సమస్య. చాలా సందర్భాలలో గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు గణనీయమైన నష్టం కలిగే వరకూ గుర్తించబడదు. రక్తపోటు చాలా ప్రమాదకరమైనప్పటికీ దీనికంటూ ప్రత్యేకమైన లక్షణాలు ఏమీ లేవు. తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి లాంటి ఏదో ఒక సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బి.పి చూస్తే ఎక్కువగా ఉందని గుర్తించబడిన కేసులే ఎక్కువ. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ (నిశ్శబ్ద హంతకి) అంటారు. ఆరోగ్యంగా ఉన్నవారిలో రక్తపోటు120/80ఎఎ ష్ట్రస్త్ర గా ఉంటుంది. 140/90కి దాటితే అధిక రక్తపోటు ఉన్నట్లు లెక్క. షుగరు, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్లకు 135/85 కు మించి ఉంటే అధిక రక్తపోటు ఉన్నట్లే.
సగం సగం సూత్రం..
మన దేశంలో 30% జనాభా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్న వారిలో దాదాపు సగం మందికి రక్తపోటు ఉందన్న విషయం తెలియదు. అధిక రక్తపోటు ఉందని తెలిసిన వారిలో దాదాపు సగం మంది మాకెందుకు రక్తపోటు వస్తుంది అని అలసత్వం చేసి మందులు వాడరు, తగిన జాగ్రత్తలు తీసుకోరు. మందులు వాడడం మొదలు పెట్టిన వారిలో దాదాపు సగం మంది రక్తపోటు అదుపు కాగానే మందులు మానేస్తారు. అంటే వంద మందికి రక్తపోటు ఉందని గుర్తిస్తే అందులో 10 నుంచి 15 మంది మాత్రమే రక్తపోటు మందులు కొనసాగిస్తారు. దీనిని వైద్యశాస్త్రంలో సగం సగం సూత్రం అంటారు .
వైట్ కోట్ హైపర్ టెన్షన్..
కొద్దిమందికి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే బి.పి అధికంగా నమోదవుతుంది. ఆసుపత్రి బయట ఉన్నప్పుడు మాత్రం రక్తపోటు అధికంగా నమోదు కాదు. దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు దీనికి ప్రధాన కారణం భయం. డాక్టర్ ఏం చెప్తాడో, బిపి ఉందని చెప్తాడేమో అనే భయం. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లోనే ఆ వ్యక్తి స్వయంగా లేదా కుటుంబ సభ్యుల ద్వారా బిపి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ మధ్యకాలంలో రోజంతా రక్తపోటును పర్యవేక్షించే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ఏ సమయంలో రక్తపోటు పెరుగుతుందో గమనిస్తూ దానిని అదుపు చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
రక్తపోటు చూసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..
రక్తపోటు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. సమయం సందరాÄ్భన్ని బట్టి విలువలో మార్పులుంటాయి. అందుకే రక్తపోటు పరీక్ష చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
– గడచిన గంటలో మద్యపానం, ధూమపానం, వ్యాయామం లాంటివి చేసి ఉండకూడదు.కాఫీ, టీ తాగి ఉండకూడదు.
– కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాక బీ.పీ చూడాలి.
– పరీక్ష చేసే సమయంలో బీపీ చూసే మిషన్ ఆ వ్యక్తి గుండె ఎత్తులో ఉండాలి.
– ఆ వ్యక్తి పాదాలు పూర్తిగా నేలకు ఆని ఉండాలి.
– ఆ వ్యక్తి వెనకాల ఆసరా ఉండాలి. చెయ్యి టేబుల్ మీద ఆని ఉండాలి.
– బీపీ చూసే సమయంలో ఆవ్యక్తి కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి.
జీవనశైలి..
– అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండడం.
– శారీరక శ్రమ లేకపోవడం.
– ఉప్పు ఎక్కువగా తీసుకోవడం.
– అధికంగా మద్యం సేవించడం.
– ధూమపానం చేయడం.
– మానసిక ఒత్తిడి మరియు ఆందోళన
– సరిపోయినంత నిద్ర లేకపోవడం.
– అడ్రినల్ మరియు థైరాయిడ్ వ్యాధి రుగ్మతలను కలిగి ఉండటం.
– గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ కనిపించడం.
ప్రమాదాలు..
– దీర్ఘకాలికంగా అదుపులో లేని రక్తపోటు వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుంది. మెదడుకు సరిగ్గా రక్తం అందక పక్షవాతం రావచ్చు. మూత్రపిండాలకు సరిగా రక్తం ప్రవహించక మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు. గుండెకు సరిగా రక్తం అందక గుండెపోటు రావచ్చు. కాళ్లకు రక్తం అందక కాళ్లు దెబ్బతినవచ్చు. దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు ఉన్న కారణంగా రక్తనాళాలు చిట్లి ప్రాణాపాయం జరగవచ్చు
– ఎక్కువ కాలం రక్తపోటు అదుపులో లేని కారణంగా గుండె ఎక్కువగా పనిచేసి గుండె సైజు పెరగవచ్చు. గుండె అవసరానికి సరిపడ పనిచేయలేక ఆయాసం, కాళ్లు వాపులు లాంటి సమస్యలు రావచ్చు.
– మూత్రపిండాలకు సరిగా రక్తం అందక మూత్రపిండాల పని తగ్గిపోయి సరిగా పని చేయక శాశ్వతంగా దెబ్బతిని నిత్యం డయాలసిస్ చేసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు..
– అధిక రక్తపోటు వల్ల కళ్ళు దెబ్బతిని చూపు మందగించవచ్చు.
– దీర్ఘకాలికంగా బిపి అదుపులో లేకుంటే జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవచ్చు.
కారణాలు..
కొద్దిమందిలో వంశపారంపర్యంగా రావచ్చు. కొద్దిమందిలో పర్యావరణ సమస్య వల్ల కూడా రావచ్చు. ఎక్కువమందిలో ప్రధాన కారణం వారి జీవనశైలి.
మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ తోడు దొంగలు
మధుమేహం ఉన్నవారిలో మూడింట రెండు వంతుల మందికి రక్తపోటు కూడా ఉంటుంది. ఈ రెండింటికి తోబుట్టువు లాంటిది కొలెస్ట్రాల్. మధుమేహం ఉన్నవారికి కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి బీపీ తోడైతే కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం మరీ ఎక్కువ.
మధుమేహం, రక్తపోటు రెండూ ఉన్నవారికి ఈ రెండూ లేని వారితో పోల్చుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ. ఈ మూడు జబ్బులు పోటీ పడుతూ గుండెపోటునే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, కళ్ళు దెబ్బ తినడం, కాళ్లు దెబ్బ తినడం లాంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి అందుకే వీటిని తోడు దొంగలు అంటారు.
నివారణ, నిర్మూలన కోసం మార్పులు..
జీవనశైలి మార్పులు అధిక రక్తపోటు చికిత్స, వైద్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలితో మందుల వాడకాన్ని తగ్గించుకుని, రక్తపోటును నియంత్రించు కోవచ్చు. వ్యాధి రాక మునుపే జాగ్రత్తలు తీసుకుంటే అధిక రక్తపోటు రాకుండానే చూసుకోవచ్చు.
ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి
మనదేశంలో అధిక రక్తపోటుకు ముఖ్య కారణం ఉప్పు ఎక్కువగా వాడడం. ప్రస్తుతం ఉప్పు మన శరీరానికి పెద్ద ముప్పుగా వుంది. ఉప్పు తినడాన్ని తగ్గిస్తే బీపీ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చడి, చెట్నీలు అప్పడాలు, వడియాలు, చిప్స్, మ్యాగీలు, కుర్కురేలు లాంటి బయట దొరికే ఆహారాల్లో దాదాపు అన్ని ఆహారాలకు తెలియకుండానే అధికమోతాదులో ఉప్పు ఉంటుంది. మన శరీర జీవన క్రియలకు ఉప్పు చాలా అవసరం. మనిషికి రోజుకు 2.5 గ్రాముల ఉప్పు అవసరం ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గరిష్టంగా రోజుకు ఐదు గ్రాములు వరకు ఉప్పు తీసుకోవచ్చని సూచించినా, మన దేశంలో సగటున ప్రతి మనిషి సుమారు 10 నుంచి 15 గ్రాముల వరకు తింటున్నారు. దీనివల్ల బీపీ పెరగడమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉప్పు రుచి నాలుకకు పుట్టుకతో తెలిసింది కాదు మనం అలవాటు చేసిందే కాబట్టి కొద్ది రోజులు తక్కువ ఉప్పు తినడంతో మన నాలుకకు అదేఅవుతుంది.ఆహారంలో ఉప్పును కొంచెం తగ్గించుకున్నా రక్తపోటు బాగా తగ్గుతుంది. ఉప్పులో ఉండే ప్రధానమైన మూలకం సోడియం. ఈ సోడియంను రోజుకు 2,300 మి.గ్రా లేదా అంతకంటే తక్కువకు పరిమితం చేయాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును 5 నుండి 6 మిమీ వరకు తగ్గించవచ్చు. ఆహారంలో సోడియం తగ్గించుకోవడానికి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వీలైనంత తగ్గించుకోవాలి. పెరుగులో మజ్జిగలో టేబుల్ సాల్ట్ వేసుకోవడం మానేయడం మంచిది. ఆహారానికి రుచిని జోడించడానికి మన ప్రధానంగా ఉప్పును వాడుతున్నాం. అలా కాకుండా మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం మంచిది.
అదనపు బరువును తగ్గించుకోవాలి..
బరువు పెరిగే కొద్దీ రక్తపోటు పెరుగుతుంది. అధిక బరువు ఉండటం వల్ల నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలుగుతుంది, ఈ పరిస్థితిని స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా రక్తపోటును మరింత పెంచుతుంది. ఒక కేజీ బరువు తగ్గితే ఒక మిల్లీమీటర్ బీపీ తగ్గుతుంది.అలాగే, నడుము పరిమాణం కూడా రక్తపోటు నియంత్రణలో ముఖ్యం. నడుము చుట్టూ ఎక్కువ కొవ్వు ఉంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. నడుము చుట్టుకొలత పురుషుల్లో 43 అంగుళాలు (102 సెంటీమీటర్లు) కంటే ఎక్కువ ఉన్నవారికి , స్త్రీలలో 35 అంగుళాల (89 సెంటీమీటర్లు) కంటే ఎక్కువగా ఉన్న వారికి రక్త పోటు ప్రమాదం ఎక్కువగాఉంటుంది. బరువు తగ్గించుకోవాలంటే తిండి తగ్గించుకోవాలి పని పెంచాలి.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి..
ఇందుకోసం ప్రతి సమస్యను పాజిటివ్ దృక్పథంతో పరిష్కరించుకోవాలి. యోగ, ధ్యానం, వ్యాయామం లాంటి కార్యక్రమాలు, సమాజసేవా కార్యక్రమాలు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఒంటరిగా ఉండకుండా కుటుంబసభ్యులతో, మిత్రులతో ఆనందంగా జీవితాన్ని గడపాలి. చేసే పనిలో సంతృప్తి పొందాలి.
మద్యాన్ని పరిమితం చేసుకోవాలి..
మహిళలు రోజుకు ఒక పెగ్గు కంటే తక్కువకు పురుషులు రోజుకు రెండు పెగ్గులు కంటే తక్కువకు ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయడం వల్ల రక్తపోటు దాదాపు 4 మి.మీ తగ్గుతుంది.కానీ ఎక్కువగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు చాలా పాయింట్లు పెరుగుతుంది. ఇది రక్తపోటు మందులను కూడా తక్కువ ప్రభావవంతం చేస్తుంది. మద్యాన్ని తగ్గించుకోవడం కంటే పూర్తిగా మానేస్తే ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
ధూమపానానికి దూరంగా ఉండాలి..
ధూమపానం రక్తపోటును పెంచుతుంది. ధూమపానం మానేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటు తగ్గడమే కాదు సహజ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది . ఎక్కువ కాలం జీవించడానికి దారితీస్తుంది.
రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి..
నిద్ర తగ్గితే బి.పి. పెరుగుతుంది. ప్రస్తుత టీవీలు సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత నిద్ర రాను రాను తగ్గిపోతోంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిది. రోజుకు 6గం కంటే తక్కువ నిద్ర 10 గం కంటే ఎక్కువ నిద్ర రెండూ ప్రమాదమే. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకునే ప్రయత్నం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు నమలడం, పొగ తాగడం, హాన్స్ నమలడం, ముక్కు పొడులు వేసుకోవడం మానుకోవాలి. వీటన్నిటిలో ఉండేది పొగాకే. అధిక రక్తపోటుకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణం. ఈ అలవాట్లను మానేయడం చాలా అవసరం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి..
నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత, నృత్యం లాంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల అధిక రక్తపోటు ఐదు నుంచి ఎనిమిది మిల్లి మీటర్ల వరకూ తగ్గుతుంది. వ్యాయామం ఆపితే మళ్ళీ బి.పి పెరుగుతుంది.. అలా జరగకుండా ఉండడానికి వ్యాయామం కొనసాగించడం ముఖ్యం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు కుదరకపోతే వారానికి ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి. అదీ కుదరకపోతే వారంలో 210 నిమిషాల పాటు వ్యాయామానికి తప్పక కేటాయించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..
తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు తక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు 11 మిమీ వరకు తగ్గించుకోవచ్చు. మధుమేహం లేనివారు పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది .ఈ పొటాషియం సోడియంకు భిన్నంగా పనిచేసే రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా రక్తపోటు అదుపులో లేకపోతే ఆలస్యం చేయకుండా రక్తపోటు మందులు వాడడం ప్రారంభించాలి. మాత్రలు వేసుకుని రక్తపోటు అదుపులో ఉంది అంటే, దాని అర్థం అదేమాత్రలు క్రమం తప్పకుండా వాడుకోవాలి అని. అదుపులో ఉందని మాత్రలు మానేస్తే రక్తపోటు మళ్లీ పెరిగి అత్యవసర ప్రమాదకర పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది.అలాగే అధిక రక్తపోటు వల్ల ఇంకా ఏమైనా సమస్యలు వస్తున్నాయా అని కనీసం ఏడాదికి ఒకసారి అన్ని పరీక్షలూ చేసుకొని దానికి తగిన మాత్రలు వాడుకోవాలి. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారైనా బిపిని తనిఖీ చేయించుకోవాలి. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు బి.పి. తనిఖీ చేయగలిగితే అధిక రక్తపోటును ముందే గుర్తించగలం. అధిక రక్తపోటు వల్ల వచ్చే సమస్యలను తగ్గించుకోగలం.
- డాక్టర్ ఎం.వి రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు
ప్రజారోగ్యవేదిక, ఆంధ్రప్రదేశ్