కాలిఫోర్నియా శాన్ డియాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు మోర్ఫో సీతాకోకచిలుకలపై పరిశోధనలు జరిపారు. వీటి ప్రకాశవంతమైన నీలి రంగు రెక్కల సహాయంతో క్యాన్సర్ దశలను గుర్తించవచ్చని తెలిపారు. వీటి రెక్కలపై ప్రత్యేకమైన సూక్ష్మదర్శిని నిర్మాణాలున్నాయి. పరిశోధకులు క్యాన్సర్ బయాప్సీ నమూనాల విశ్లేషణలో ఈ నిర్మాణాలను ఉపయోగిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం ద్వారా క్యాన్సర్తో పాటు మిగిలిన రోగాలనూ కచ్చితంగా నిర్ధారించవచ్చని వారంటున్నారు.
మోర్ఫో సీతాకోకచిలుక రెక్కలలో ఉండే ప్రకాశవంతమైన నీలం రంగు కాంతిని గ్రహించి, ఆ కాంతి వక్రీభవనం చెందేందుకు దోహదపడుతుంది. క్యాన్సర్ బయాప్సీ నమూనాను సీతాకోకచిలుక రెక్కపై ఉంచి క్యాన్సర్ ఏ దశలో ఉన్నదో సులభంగా గుర్తించవచ్చు. నీలిరంగు రెక్కలపై సన్నని గీతల రూపంలో ఉండే సూక్ష్మ నిర్మాణాలుంటాయి. వాటిపై కాంతి ప్రసరించి, అనేక దిశల్లో ఆ కాంతి వెదజల్లబడుతుంది. అంటే వక్రీభవనం చెందుతుంది.
ఫైబ్రోసిస్ కీలకం..
ఎముక కణజాలంలో సౌకర్యవంతమైన బలాన్నిచ్చే ప్రోటీన్ నిర్మాణాలుంటాయి. అవి కొల్లాజెన్ ఫైబర్ నిర్మాణాలు. వీటివలన ఫైబ్రోసిస్ ఏర్పడుతుంది. ఫైబ్రోసిస్, అంటే పేరుకుపోయిన పీచు కణజాలం. శరీరంలో మచ్చలు ఏర్పడటం, కణజాలం గట్టిగా మందంగా తయారవటాన్ని ఫైబ్రోసిస్ అంటారు. కొల్లాజన్ ఎక్కువ ఉత్పత్తవటం వలన ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. క్యాన్సర్ రావడంలో ఫైబ్రోసిస్ పాత్ర ప్రముఖమైనది.
ఆంకాలజీలో బయాప్సీ పరీక్ష ద్వారా ఫైబ్రోసిస్ స్థాయిలను నిర్ణయిస్తారు. తద్వారా క్యాన్సర్ ఏ దశలో ఉందనేది తెలుసుకుంటారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్లినికల్ పద్ధతుల్లో ఈ దశల మధ్య తేడాను కచ్చితంగా గుర్తించడంలో కొంత గందరగోళం ఉంది. వేర్వేరు పాథాలజిస్టుల నమూనాలు భిన్నంగా ఉండవచ్చు.. కానీ అధునాతన సాంకేతికతలకు ఖరీదైన, ప్రత్యేకమైన పరికరాలు అవసరం.
ఇదీ పరిష్కారం..?
పరిశోధనా బృందం మోర్ఫో సీతాకోకచిలుక రెక్కను ఉపయోగించి ఒక వినూత్న విధానాన్ని అభివృద్ధి చేసింది. సీతాకోకచిలుక రెక్కపై బయాప్సీ నమూనాను ఉంచి, దానిని ప్రామాణిక సూక్ష్మదర్శిని కింద పరిశీలించారు. ఇది రసాయన గుర్తులు లేదా ఖరీదైన సాధనాలు లేకుండానే కణితి నిర్మాణాన్ని కచ్చితంగా అంచనా వేసింది.
‘క్లినిక్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రామాణిక ఆప్టికల్ మైక్రోస్కోప్లను ఉపయోగించి చేసిన అధ్యయనాలను ఈ పద్ధతికి అన్వయించవచ్చు’ అంటారు శాన్ డియాగోలోని జాకబ్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ లిసా పౌలికాకోస్. ‘ఈ పద్ధతి మరింత ఫలితాలనివ్వడమే కాక కణజాల నిర్మాణంపై పరిమాణాత్మక సూచిక అంటారామె.’
ప్రకృతి నుండి ప్రయోగశాలకు..
శాన్ డియాగోలో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని పౌలా కిర్యాకి ప్రకృతి నుంచి వచ్చిన ఆలోచనే ఈ పరిశోధనకు నాంది. ఆమె పసాదేనా సిటీ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు మోర్ఫో సీతాకోకచిలుక రెక్కల ఆప్టికల్ లక్షణాలపై అధ్యయనం చేశారు. అవి వివిధ వాతావరణాలకు ఎలా స్పందిస్తాయో గుర్తించారు కిర్యా. ఆమె పౌలికాకోస్ ల్యాబ్లో బయోలాజికల్ ఇమేజింగ్ కోసం సింథటిక్ నానోస్ట్రక్చర్స్ సృష్టికర్త. ల్యాబ్లో ‘ఇప్పటికే మోర్ఫో సీతాకోకచిలుకలు కలిగి ఉన్న లక్షణాలు.. తాను వాటిపై చేసిన అధ్యయనాలు గుర్తొచ్చాయి. వాటిని ఇక్కడ ఎందుకు ఉపయోగించకూడదు?’ అనే ఆలోచన స్ఫురించింది. ఇది సహజ పరిష్కారంగా ఆమెకు తోచింది. ఈ పద్ధతిని ఉపయోగించి క్యాన్సర్ ఉధృతిని చివరిదశకు చేరకముందే గుర్తించవచ్చు. అలా అనేక మందిని కాపాడే అవకాశం ఉందని భావించారు కిర్యా.
ఆలోచన ఫలితం..
కిర్యా ఆలోచన ఫలితంగా పౌలికాకోస్ బృందం జోన్స్ కాలిక్యులస్ ఆధారంగా ఒక గణిత నమూనాను తయారు చేశారు. మోర్ఫో రెక్కలోని సూక్ష్మ నిర్మాణాలు, నానోస్ట్రక్చర్లు కాంతికి బలంగా స్పందిస్తాయని బృందం కనుగొన్నది. ఇది నిర్దిష్ట దిశలో వ్యాపించే ఒక రకమైన కాంతి అని గుర్తించింది. అయితే వాటి సంకేతాలు బలహీనంగా ఉంటాయని బృందం నిర్ధారించింది.
అండాశయ క్యాన్సర్ కణాల్లో ప్రత్యేకమైన కదలికలను కనుగొన్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్ బయాప్సీలలోనూ మంచి ఫలితాలు వచ్చాయి.
వీటిని అధునాతన, అధిక ధర కలిగిన, స్టెయినింగ్ పద్ధతుల్లోని పరికరాలను ఉపయోగించి చేసిన ప్రయోగ ఫలితాలతో సరిపోల్చారు. కచ్చితమైన రిపోర్ట్తో పరిశోధనలు విజయవంతమయ్యాయి.
రొమ్ము క్యాన్సర్ బయాప్సీ నమూనాల ఫలితాలతో సరిపోలాయి. ఈ సాంకేతికతను విస్తృత శ్రేణిలో క్యాన్సర్తో పాటు ఇతర ఫైబ్రోటిక్ వ్యాధులకూ వర్తింపచేయవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.