ఇక్కడ పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయులే!

దేశంలో మతవిద్వేషాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. వీటిపట్ల ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. స్వాతంత్య్ర ఉద్యమకాలం నుండి రాజకీయాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీనీ చూశారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ప్రజలకు మంచి కలిగించేవిగా లేవని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడినా దేశద్రోహం అంటున్నారని, కారణాలు ఏవైనా? అరెస్టు చేయడం కామన్‌ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడుగా మంచి సినిమాలు తీశారు. నిర్మాతగా సినీ ఇండిస్టీలో ఆయన కృషి మరవలేనిది. అంతేకాదు.. తెలుగు సినిమా నిర్మాతలు, సినీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఆయన ఎన్నో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

తమ్మారెడ్డి భరద్వాజ ఒక సినిమా కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి చిత్ర నిర్మాత. తల్లి కృష్ణవేణి. ఐదేళ్ల క్రితం చనిపోయారు. సోదరుడు లెనిన్‌బాబు. ఈయన కూడా సినిమా దర్శకుడే. అప్పట్లో తండ్రి కృష్ణమూర్తికి సినిమాలంటే చాలా ఇష్టం. దాంతో చిత్ర నిర్మాతగా రవీంద్ర ఆర్ట్స్‌ పతాకంపై ‘లక్షాధికారి’, ‘జమీందారు’, ‘బంగారు గాజులు’, ‘ధర్మదాత’, ‘దత్త పుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’ అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. పెద్ద కుమారుడు లెనిన్‌బాబు ఈ మధ్య చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. భరద్వాజ సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో బి.ఎ. పూర్తి చేసి, తండ్రిబాటలో సినీరంగం వైపు వచ్చారు.
సందేశంతో, కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకత్వం వహించారు. అవి ‘పోతే పోనీ’, ‘సంచలనం,’ ‘ఎంత బావుందో’, ‘రామ్మా! చిలకమ్మా!’, ‘స్వర్ణముఖి’, ‘అత్తా నీకొడుకు జాగ్రత్త’, ‘కూతురు’, ‘వేటగాడు’, ‘రౌడీ అన్నయ్య’, ‘ఊర్మిళ’, ‘పచ్చని సంసారం’, ‘స్వర్ణక్క’.. ఇలా దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా 15 సినిమాలు తీశారు. ‘పోతే పోనీ’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందారు.

సినీ కార్మికుల కోసం
ఆయన తండ్రి కమ్యూనిస్ట్‌. భరద్వాజ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఫెడరేషన్‌లో సభ్యుడు. ఈ కారణాల వల్ల ఆయన కార్మికసంఘాల సమస్యల వైపు ఆకర్షితులయ్యారు. తర్వాత ఆయన కెరీర్‌లో తెలుగు సినిమా నిర్మాతలు, సినీ కార్మికుల సంఘాల మధ్య అనుసంధానకర్తగా పనిచేశారు. వారి మధ్య వచ్చిన ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కృషి చేశారు.

అంతిమంగా కమ్యూనిస్టు సమాజం
ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మూడు వేల మంది నక్సలైట్లను వెంటాడి చంపాలని కేంద్ర, రాష్ట్ర బలగాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ సంఘటననీ ఎలా చూడాలని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ‘ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలైట్లను కాల్చిచంపడం అన్యాయం. వారు అడవుల్లో ఉండి పోరాడుతున్నారు. ఆదివాసీలను అభివృద్ధి చేయాలని, సమాజాన్ని బాగు చేయాలని కోరుతున్నారు. వారితో శాంతిచర్చలకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాంటీ గవర్నమెంట్‌ వాళ్లందరినీ లోపలవేస్తున్నారు. ఇది ఎమర్జెన్సీ కాదా? వరవర్రావుని ఎన్నో రోజులు నుంచి జైల్లో ఉంచారు. 80ఏళ్ల వయస్సులో ఆయన ఎవరిని చంపుతారు? రెండుకాళ్లు లేని సాయిబాబాని ఎంతో కాలంగా జైల్లో ఉంచి ఇబ్బందిపెట్టారు. ప్రశ్నించిన జర్నలిస్టులనూ అరెస్టు చేస్తున్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయులే. మతాలు పేరుతో ఈ దేశస్తులు కాదంటే ఎలా? దేశద్రోహులు అనేవారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. వారిని గుర్తించి శిక్షించాలి.
మతాలు, కులాలు పేరుతో మనుషుల మధ్య దూరం పెంచే ధోరణి ఇప్పటి పాలకుల్లో పెరిగింది. దీన్ని అందరూ గుర్తించాలి. ఇప్పుడు కమ్యూనిస్టు సిద్ధాంతమే ఔట్‌ డేటెడ్‌ అయిపోయింది. ప్రపంచం మొత్తం ఆ దిశగానే మార్పు కోరుకుంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అధికార పాలకులు ప్రజలను ఉచితాలతో ఆకర్షిస్తున్నారు.
కమ్యూనిస్టు సమాజంలో అందరికీ సమానత్వ హోదా ఉంటుంది. అందరూ కష్టపడి పనిచేస్తారు. దాని ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ మన పాలకులు కష్టపడకుండానే కొంతమందికి డబ్బు ఇస్తున్నారు. ఇది ఎక్కువకాలం నిలబెట్టుకోలేరు. అందుకే ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు రావాల్సిందే!’ అని దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

పేరు : తమ్మారెడ్డి భరద్వజ
పుట్టినతేది : 30 జూన్‌ 1948
వృత్తి : నిర్మాత, దర్శకుడు, నటుడు.
నటించిన సినిమాలు : ఈ రోజుల్లో (2012) , శీను వాసంతి లక్ష్మి (2004), నేనేెరా పోలీస్‌ (1991) విలన్‌గా.

➡️