ముందుచూపు

Apr 27,2025 08:48 #children stories

పూర్వం కోసలదేశాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు. మహేంద్రవర్మ ఏకైక సంతానం ఆదిత్యవర్మ. కొడుకంటే మహేంద్రుడికి వల్లమాలిన అభిమానం. కొడుకుని చూడకుండా ఉండేవాడు కాదు. పంచప్రాణాలు కొడుకే. తన తరువాత వారసుడుగా తన కొడుకే కాబట్టి కొడుకుపై తన ప్రేమను చంపుకుని విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపాడు. ఎక్కడ తన దగ్గరుంటే కొడుకు గారాబం వలన విద్య రాదోనని మహేంద్రుడి ఆలోచన.
ఆదిత్యవర్మ గురుకులంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. వేదవేదాంగాలు తెలుసుకున్నాడు. విలువిద్య, కత్తిసాము, కర్రసాములో ప్రావీణ్యం సాధించాడు. గురువు దగ్గర తనకు తానే సాటి, తనకు తానే పోటీ అని పేరు తెచ్చుకున్నాడు. విద్య పూర్తిచేసుకున్న ఆదిత్యవర్మ గురువు ఆశీర్వాదం తీసికుని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న కుమారుణ్ణి చూసి మహేంద్ర వర్మ ఆనందానికి అవధులు లేవు. వయోభారంతో ఉన్న తనకు సరైన వారసుడు తనకొడుకేనని మంత్రికి చెప్పాడు. మంత్రి ఒకసారి యువరాజు యుద్ధ విద్యాలేపాటివో పరిక్షించి ఆ తరువాత పట్టాభిషేకం చేద్దాం రాజా అన్నాడు. మంత్రి సలహాకు రాజు తల ఊపాడు.
కొసల రాజ్యానికి తూర్పు భాగంలో నిరంతం అంతర్యుద్ధాలు జరుగుతుండేవి. ఆదిత్యవర్మను ఆ అంతర్యుద్ధాలు అణచమని రాజు ఆజ్ఞాపించాడు. తన తండ్రి ఆజ్ఞ మేరకు రాజ్యంలోని తూర్పుభాగంలో తిరుగుబాట్లను మహేంద్రుడు విరోచితంగా యుద్ధం చేసి అణిచివేశాడు. తిరుగుబాటు నాయకుణ్ణి బహిరంగంగా ఉరి తీసాడు. భవిష్యత్తులో మరెవరూ తిరుగుబాటు చేయకుండా ఈ ఘటన తోడ్పడుతుందని ఆదిత్యవర్మ భావన. తిరుగుబాటు చేసిన సైనికులను జీవితకాల ఖైదీలుగా ఉంచమన్నాడు. వారితో జైల్లో మొక్కలు నాటించమన్నాడు. ఈ విషయాలను మంత్రి ద్వారా రాజు తెలుసుకుని కుమారుని విజయం చూసి పొంగిపోయాడు మహేంద్రవర్మ. కాకపోతే యుద్ధంలో పట్టుబడ్డ సైనికులను చంపకుండా మొక్కలు నాటించటమేమిటని మహేంద్రుని సందేహం. ఇదే విషయాన్ని కొడుకుని అడిగాడు. ఆదిత్యవర్మ వివరిస్తూ.. ‘ఆ తిరుగుబాటు నాయకుని వలలో పడి వీరు మనకి వ్యతిరేకమయ్యారు. కానీ వీరికి మనమీద నిజంగా తిరుగుబాటు చేయాలని ఉండదు. ఇన్ని అడవులున్నాయి కదా! యుద్ధ ఖైదీలతో మొక్కలు ఎందుకు నాటుతున్నానని మీకు అనుమానం కలిగి ఉండవచ్చు. మన పూర్వీకులు ముందు చూపుతో మొక్కలు నాటడం వలన మనం సుఖంగా వున్నాం. మనం మొక్కలు నాటడం వలన రాబోవుతరం సుఖంగా వుంటారు. ముందు ముందు జనాభా పెరుగుతుంది. ఎందుకంటే విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందుతుంది. మరణాలు తగ్గుతాయి. జననాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న అడవులు సరిపోవు. ఇంకా అడవులు పెంచాలి. అందుకే యుద్ధ ఖైదీలతో మొక్కలు నాటించుతున్నాను అన్నాడు ఆదిత్యవర్మ. ముందుచూపు, మానవత్వం కల కుమారుడు తన వారసుడు అయినందుకు మహేంద్రవర్మ పొంగిపోయి, పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టించాడు. సంతోషంగా తన కొడుకు రాజును చేశాడు.

– రాళ్లబండి సంగంనాయుడు
9490935258

➡️