తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన ఏకైక హీరోయిన్ విజయశాంతి. హీరోలకు ధీటుగా యాక్షన్ సీన్స్లో నటించి, మెప్పించి అనేక విజయాలు సాధించారు. ‘నేటిభారతం’లో ఆమె నటన సినీ చరిత్రలో మరిచిపోలేనిది. పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మధ్య ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
విజయశాంతి వరంగల్లో జన్మించారు. కుటుంబం మద్రాసు వలస రావడంతో ఆమె బాల్యం మొత్తం అక్కడే గడిచింది. అక్కడే కూచుపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. విజయశాంతికి పద్నాలుగేళ్ల వయస్సులో తండ్రి గుండెపోటుతో చనిపోయారు. ఆ బెంగతో తల్లి కూడా కొద్దిరోజులకే మరణించారు. ఒక అన్నయ్య ఉండేవారు (ఇప్పుడు ఆయనా లేరు). దాంతో విజయశాంతి పిన్ని దగ్గర కొద్దిరోజులు ఉన్నారు. విజయశాంతి అసలు పేరు శాంతి. తన పిన్ని విజయలలిత అలనాటి సినిమా నటి. అలా ఆమె పేరులోని ‘విజయ’ని శాంతి ముందు చేర్చి, విజయశాంతిగా గుర్తింపు పొందారు. విజయశాంతి ఏడవ ఏటే బాలనటిగా సినీరంగంలో ప్రవేశించి, కొన్ని చిత్రాల్లో నటించారు. తనను తానే పోషించుకోవాలన్న ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆమెకు చిన్నవయస్సులోనే అబ్బాయి. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లారు.
చిన్న వయస్సులోనే..
విజయశాంతి నటనలో శిక్షణ తీసుకోలేదు. దర్శకులు ఎలా చెబితే అలా చేసేందుకు ప్రయత్నించడమే నటన అనుకునేవారు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆమెను కథానాయకిగా తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీళ్ళొస్తాయి) కథానాయికగా నటించారు. అప్పుడు ఆమె వయస్సు పదహారేళ్లు. తెలుగులో అదే ఏడాది ‘కిలాడి కృష్ణుడు’ చిత్రంలో హీరో సూపర్స్టార్ కృష్ణతో ఆమె నటించారు. వయస్సు చిన్నది కావడంతో ఆమెకు ఆమె పాత్రల ఎంపికలో పెద్దగా ఆలోచన ఉండేది కాదు. తర్వాత ఎన్టీఆర్, ఎఎన్ఆర్ పక్కన హీరోయిన్గా చేశారు. ఎక్కువ సినిమాలు తమిళ చిత్రాల్లోనే చేశారు.
ప్రగతిశీల భావాలతో..
ప్రజానాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి.కృష్ణ దర్శకత్వంలో ‘నేటి భారతం’ సినిమా తీశారు. ఆ చిత్ర కథానాయిక పాత్రలో విజయశాంతిని ఎంపిక చేశారు. ఆమె ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ, ఆ పాత్రలో జీవించిందని చెప్పవచ్చు. ఎంతో ఆక్రోశం, ఆవేదనతో చెప్పిన డైలాగ్స్ అప్పటి తరాన్ని చైతన్యపరిచేలా, ఆలోజింపజేసేలా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. దీంతో ”నేటి భారతం” సినిమా ఘన విజయానికి విజయశాంతి ప్రధాన కారణమైంది. తొలిసారి ”ఉత్తమ నటి”గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ”నంది” అవార్డునూ గెలుచుకున్నారు. ఆమె నటన, ప్రతిభ నచ్చి టి. కృష్ణ తాను దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఆమెకు కీలకపాత్రను ఇచ్చారు. అవి ‘వందేమాతరం’, ‘నేటి భారతం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘ప్రతిఘటన’,’రేపటి పౌరులు’, ‘దేవాలయం’.
రెండు విధాలుగా..
విజయశాంతి ఓ వైపు ప్రగతిశీల చిత్రాల్లో, మరోవైపు చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా సమన్వయం చేసుకుంటూ నటించారు. ఇలా ఆమె సినీజీవితంలో కొద్ది సంవత్సరాలపాటు ఆమెలో నటిగా రెండు విధాలుగా సినిమాల్లో కనిపించారు. ‘ప్రతిఘటన’ చిత్రంలో అద్భుత నటనకు ఆమె రెండవసారి ”ఉత్తమ నటి”గా ”నంది” అవార్డును గెలుచుకోవటమే కాకుండా.. ప్రేక్షకుల్లో ఆమెకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు.
రిస్క్కు వెరవకుండా..
ఐ.పీ.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహనగాంధీ దర్శకత్వంలో.. తను కథానాయిక పాత్ర పోషిస్తూ తనే సొంత ప్రొడక్షన్ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ”నంది” అవార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ ”ఉత్తమ జాతీయ నటి” అవార్డులను సంపాదించి పెట్టింది. ఇందులోని వైజయంతి పాత్రలో షూటింగ్ సమయంలో రిస్క్ ఫైట్స్ చేయాలని చెబితే బెదరకుండా విజయశాంతి వీరోచితంగా ఫైట్స్ చేసేవారు. అందుకే ఆమెకు ”లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్” లాంటి బిరుదులు కూడా వచ్చాయి. మొదటిసారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్స్టార్ అని సంబోధించ సాగాయి. ఇలా దాదాపు 187 సినిమాలకు పైగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో ఆమె నటించారు.
చాలా రోజుల తర్వాత..
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో విజయశాంతి నటించారు. 58ఏళ్ల వయస్సులో ఫైట్స్ సీన్లు చేశారు. ఇది చూసిన అభిమానులు ”వైజయంతి కమ్ బ్యాక్!” అంటూ ఉత్సాహ పడుతున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆమె ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి” చిత్రం పూర్తి యాక్షన్ సినిమా. ‘నా అభిమానులకి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ దొరుకుతుంది. అదే పౌరుషం.. అదే రోషం. ఎంత వయసు అయినా తగ్గేదేలే.. ఇలానే స్ట్రాంగ్గా ఉంటాను..!’ అని మరింత ఉత్సాహపరిచారు.
అసలు పేరు : శాంతి
పుట్టినతేది : జూన్ 24, 1966న
నివాసం : హైదరాబాద్
జీవిత భాగస్వామి : మోటూరి వెంకట శ్రీనివాస్ ప్రసాద్
వృత్తి :నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు.