మూడురోజుల కిందట తెల్లవారుజామున ఆమె పెద్దగా కల్మా చదివి, తోడ్కొని పోవడానికి కళ్లెదుట ఫరీస్టాలు నిలుచుని ఉన్నారని భయంతో పెద్దపెద్దగా కేకలు వేసి, ఆ తర్వాత మాటా పలుకూ లేకుండా ఉండిపోయింది. కోడలు ఇదంతా నిద్ర కళ్లతో కంగారుగా, దుఃఖంగా చూసి అత్తగారికి ఆఖరు క్షణాలు వచ్చాయని నిర్ధారించుకుని నాలుగైదు ఫోన్లు చేసింది.
‘అత్తమ్మా.. అత్తమ్మా’ అని పిలిచి, కుదిపి చూసింది. కానీ అంతకుముందు వరకూ చిన్న పిలుపుకు కూడా బదులు చెప్తూ వచ్చిన అత్తగారు ఇక ఏమీ మాట్లాడటం లేదు. ‘ఊ’ అని ఎక్కడో నూతిలో నుంచి జవాబు చెబుతున్నట్టుగా తప్ప.
ఆమె ప్రాణమున్న మృతదేహమే అని గ్రహించిన రమాదేవి నర్సింగ్ హోమ్ నర్సు ‘నేను చేయాల్సిందేమీ లేదక్కా’ అని అదేవేళ బ్యాగ్ సర్దుకుని ‘నాకు రావాల్సింది ఫోన్పే చేయండి’ అని వెళ్లిపోయింది. అప్పటికే పది రోజులుగా గ్రాహకం లేదు. పాలచుక్కో నీటిచుక్కో ఓఆర్ఎస్ ఆరంజీ ఫ్లేవరుది గుక్కెడు పట్టించడమో తప్ప. ఎప్పుడోగాని బెడ్పాన్ కొద్దిగా నిండడం లేదు. లోపలంతా దెబ్బ తినేసిందని ఇంటికొచ్చి చూసెళ్లిన డాక్టర్ అన్నారు. మూడునెలలుగా మంచాన సాగుతున్నది. ఇప్పుడు ఈ స్థితికి చేరింది.
ఎంత మనసును సిద్ధం చేసుకున్నా, కొడుకు గదిలో నుంచి బయటకు వచ్చి తల్లి దగ్గర నిలుచుని వెక్కివెక్కి ఏడ్చాడు. తల్లి పొట్ట మీద అలవిగాని మాలిమితో చేయి వేసి ‘అమ్మా.. వెళిపోతున్నావా’ అన్నాడు. కొడుకు పిలుస్తున్న తల్లిప్రాణం. ఏ గుహాంతరాల నుంచో ‘ఊ’ అంది.
ఉదయం ఏడూ ఎనిమిది కంతా ఊళ్లోని దగ్గరి బంధువులు వచ్చి, పరిస్థితిని గమనించి, ఏ క్షణాన అటూ, ఇటూ అయితే తమ పనులను చక్కబెట్టుకొని, హాజరవ్వాలో బేరీజు వేసుకొని వెళ్లారు. లోకులు వస్తారు గదా అని కోడలు ఇంట్లో అడ్డదిడ్డంగా ఉన్నవి చక్కబెడుతుంటే మొగుడూ పిల్లలతో అంతకు ముందురోజే దిగబడిన కూతురు ఏడ్చి ఏడ్చి చాలించి తల్లి వంక చూడటానికి మనసొప్పక వంటగదిలో టీలు మరిగించే పనిలో ఉండిపోయింది. ఇలాంటి టైములో వచ్చిన అమ్మలక్కలు ఆ సమయాన మంచం ఎలా పట్టాలి, తల ఎటు, కాళ్లు ఎటు వుండాలనేది సూచించి ఆ తతంగాన్ని పూర్తిచేయించడం ఆనవాయితీ.
‘అబ్బారు. ఇవాళ జుమ్మా. మీ అమ్మ జొహర్ నమాజు టైముకు దేవుడి దగ్గరకు సెలవు తీసుకుంటే చాలా అదృష్టవంతురాలు’ అని ఒకావిడ కొడుకుతో అంది.
అమ్మకు శుక్రవారం కాకుండా మరే వారం ప్రాప్తమవుతుంది? అక్షరమ్ముక్క రాని ఇంటి నుంచి సంతకం పెట్టడం ఎరగని ఇంటికి కోడలిగా వచ్చి, పిల్లలను చదివించాలని మంకుపట్టు పట్టి, కొడుకును లాయర్ని చేసింది. కూతురిని టీచర్ని చేసింది. ఉలిగడ్డల హోల్సేల్ వ్యాపారం చేసే భర్త సంపాదనను వైనం చేసి ఇల్లు కట్టించింది. పుట్టినూరే మెట్టినూరు కావడాన వచ్చేపోయే పటాలానికి మసి కడగని చేతులతో వండి వార్చి ఇంటికి మర్యాద తెచ్చింది. చిన్న ఊరే అయినా కొడుకుతో అక్కడే ప్రాక్టీస్ పెట్టించి, కళ్ల ముందు పెట్టుకుంది.
కూతురు అదే జిల్లాలో అక్కడక్కడే తిరిగేలా బరి గీసింది. అంతగా కాపెట్టుకున్న తల్లి శుక్రవారాన్ని అడిగితే కాదంటాడా దేవుడు?
ఎప్పుడో తప్ప నమాజుకు వెళ్లని కొడుకు ఇంటల్లుడిని తోడు దీసుకొని జొహర్ నమాజుకు వెళ్లి ‘పర్వర్దిగార్.. మా అమ్మను పూవు రాలినంత సులువుగా నీ దగ్గరకు పిలుచుకో’ అని దువా చేశాడు. వస్తూ వస్తూ మసీదు బయట ధారాళంగా నాణాలు దానం చేశాడు. మధ్యాహ్నం మూడైంది. నాలుగైంది. చీకటి కూడా పడిపోయింది.
‘అత్తమ్మా’ అని కోడలు పిలిస్తే ‘ఊ’ అని ఎక్కడి నుంచో జవాబు.
‘అమ్మా’ అని కూతురు పిలిస్తే ‘ఊ’ అని బదులు.
కన్ను తెరవడం లేదు. శరీరం కదలడం లేదు. ఊపిరొక్కటే ఉంది. తాను బతికే ఉన్నానని పిల్లలకు చెప్పడానికన్నట్టు కుడి చేతి చూపుడువేలొకటి అప్పుడప్పుడు కదుపుతూ ఉంది.
‘అరె అబ్బారు… నువ్వూ నీ భార్య అయినకాడికి చేశారు. దేవతల్లే చూశారు. కూతురేమో పలికితే వాలిపోయేది. మీ అమ్మ చూడంది ఏంది? చేయంది ఏంది? ఇంకా ఏమిటికిరా ప్రాణం కొట్టకలాడతా ఉంది. ఏదైనా ఉంటే గుర్తుకు చేసుకోండిరా’ అంది పెద్దదీపం ఖాలాబీ. దూరపు చుట్టం. ఒకప్పుడు ఆమె ఇంట్లో మాత్రమే పెద్దదీపం ఉండేదట.
తెల్లవారే వార్త తెలిసినా జొహర్ టైముకు ప్రాణం విడివడొచ్చని ఎవరో అంటే ఆ టైమ్కంతా వంట చేసుకుని అన్నం తినేసి వచ్చి కాళ్ల దగ్గర కూచుని జపమాలతో దరూద్ చదువుతోంది. చనిపోయే మనిషికి డబ్బూదస్కం సాయం చేయకపోయినా దరూద్ చదివి పుణ్యం సాయం చేయవచ్చు. దరూద్ను ఎంతమంది ఎన్నిసార్లు చదివితే అంత పుణ్యం మూటగట్టుకుని జీవి అల్లామియా దగ్గరకు వెళుతుంది. కూతురు, కోడలు చదువుతూనే ఉన్నారు. ఆ రాత్రికి ఇంకో ముగ్గురు నలుగురు ఆడవాళ్లు చేరి చదవడమూ, నమాజులు చేయడమూ, ఖురాన్ పఠించడమూ చేస్తూనే ఉన్నారు. ప్రాణం పోలేదు.
మరుసటి రోజు ఉదయం ముందరి రోజు మనుషులే మళ్లీ చూడను వచ్చారు. అయితే ముందరి రోజు ఉత్సుకత, విచారం వారిలో లేదు. ‘ఇలాంటివి తేలేటి లెక్కలు కాదు’ అని వారిలో వారు అనుకున్నారు. ‘ప్రాణం పోతే నిన్ననే పోవాలి. ఆగిందా.. ఎప్పుడు తెల్లవారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. రోజుల తరబడి ఇలాగే ఉన్నవారు ఉన్నారు’ అనంటే కొడుకు గుండెలు గుబగుబలాడాయి. తల్లి ప్రాణం నిలిచి ఉండటం కంటే ఇలా నిలిచి ఉండటం ఏ సంతానమూ భరించలేనిది.
‘యాల్లా… మా అమ్మ ప్రాణం అనాయాసంగా పోతే పదకొండు మంది అనాథ పిల్లలకు వచ్చే రంజానుకు కొత్త బట్టలు పెడతాను’ అని కొడుకు మొక్కుకుంటే ‘ఇరవై ఒక్క ఖురానులు దానం ఇస్తాను’ అని కూతురు మొక్కుకుంది. వండుకోవాలో వద్దో, తినాలో వద్దో, ఏడ్వాలో వద్దో ఏమీ తెలియక ఉంది.
మొదటిరోజు టైముకే రెండోరోజు వచ్చిన పెద్దదీపం ఖాలాబీ రావడమే కోడలిని పిలిచి ‘అమ్మారు… రాత్రి కూచుని ఆలోచించాను. మీ అత్తమ్మకు తెల్ల చందువాల పులుసు ఇష్టం. ఇది సీజనో కాదో దొరికి చస్తాయో లేదోగాని దొరికితే తెప్పించి, కూరొండి, ఐదు గిన్నెలు పేదలకు ఇవ్వు. ప్రాణం నిమ్మళపడి ఇంక పోతానంటుందేమో’ అంది.
అసలే తత్తర బిత్తరగా ఉన్న కోడలికి చర్రుమన్నా.. శాంతంగానే జవాబు ఇచ్చింది.
‘అయ్యో ఖాలాబీ.. మా ఆయనకి నేనేం తింటానో తెలియకపోయినా వాళ్లమ్మ ఏం తింటుందో బాగా తెలుసు. వారానికి ఒక తడవ కిలో వెయ్యికిపోయినా తెచ్చి కూరొండిస్తాడు. బంగాళాఖాతంలో సగం చందువాలు మా అత్తమ్మే తినుంటుంది. ఆ లోటేమీ జరగలేదు. అందుగ్గా దారబందరాన్ని పట్టుకు వేలాడే రకంగాదు మా అత్తమ్మ’ అంది.పెద్దదీపం ఖాలాబీ టీ కోసం చూసి, అది అందాక మళ్లీ కోడలితోనే అంది.
‘అది గాదమ్మారు. అది కొడుకంటే ప్రాణం అన్నట్టుగా కనిపిస్తుంది. గాని దాని అసలు ప్రాణమంతా కూతురే. ఏదైనా ఇచ్చుకునేదుంటే ఇచ్చుకోలేకపోతే మీరు పొమ్మన్నా పోదే జీవమూ’.. కోడలికి ఇప్పుడు నిజంగానే చర్రుమంది.
‘ఆ పంచాయతీ జరిగి మూణ్నెల్లు. దేవుడి దయవల్ల మా ఆయన సంపాదిచ్చి నా మెడలో ఒకటి, రెండు నగలు దిగవేశాక ఒకటే అనుకున్నా! దేవుడా సేవ చేసే నాటకం ఆడి మా అత్తమ్మ బంగారాన్ని కాజేశానన్న చెడ్డపేరు నాకొద్దు అని. ఏనాడూ ఆమె బంగారాన్ని ఆశించ లేదు. అయినా సరే పంచాయితీ పెట్టి సాక్ష్యుల్ని నిలబెట్టి మూడొంతులు కూతురికి, ఒక వంతు నాకు మా ఇష్టప్రకారమే పంచింది. లేని తకరారును మీరు రేపకండి’..
ఇంతలో లోపలి నుంచి వింత, వికృతమైన మూలుగు వినిపించింది. ప్రాణం పోయే ముందు వినవచ్చే మూలుగు. అందరూ లోనకు పరిగెత్తారు. మంచం చుట్టూ చేరి మంచం మీదున్న ఆకారాన్ని పరికించి చూశారు. ఆ క్షణాన అక్కడి ఒక్కొక్కరి ముఖాన్ని చూస్తే మనిషి ప్రాణం పోవాలని కోరుకోవడం కూడా ఎంతటి దైవసమానమైన కోరికో తెలుస్తుంది. ప్రాణం పోలేదు. చూపుడువేలు మాత్రం కదులుతూనే ఉంది. పెద్దదీపం ఖాలాబీ మెల్లగా బయటకు వచ్చి, ఎందుకనో పెద్దగా ఏడుపు మొదలెట్టింది. వీధి గేటు దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్న కొడుకు కంగారుగా లోపలికి వచ్చాడు.
‘ఒరే అబ్బారు… ఏమిట్రా ఈ నలుగుడు మీ అందరికీ. మీ అమ్మ కష్టాన్ని నేనే చూడలేకపోతున్నా.. మీరంతా ఎలా ఉంటున్నార్రా… ఇలా కాదుగానీ ఆ ఇస్లాం పేట తోడుదొంగను పిలూ. అదొస్తేగాని దీని ప్రాణం పోదు. అది చెప్తే తప్ప ఇది ప్రాణం విడువదు. దీనికేం గావాలో ఆ దొంగమొకానికి తప్ప ఇంకెవ్వురికీ తెలియదురా’ అంది ఏడుస్తూ.
‘ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో చిన చిన్న విరుగుళ్లు తెలిసినవాళ్లు ఉండాలిరా’ అంది మళ్లీ.
ఆమె చెబుతున్నది ముంతాజ్ ఆంటీ గురించని కొడుక్కి అర్థమైంది. తల్లి మంచాన పడినప్పటి నుంచి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే ‘ఏం చేయన్రా… ఈ మోకాళ్ల నొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేకున్నానే. అయినా దాన్ని చూడ కుండా ఉండగలనా? అలాగని చూడ గలనా?’ అని ఏడ్చింది ముంతాజ్ ఆంటీ.
ఇద్దరూ ప్రాణస్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగి, ఒకే ఊళ్లో ఈ పేటన నువున్నావు గదా ఆ పేటన నేనున్నా నులే అని భరోసాగా బతికి, సంసారాల్లో సొదకు గోడచేర్పుగా నిలిచినవారు. నవ్వితే నవ్వినవారు.. ఏడిస్తే ఏడ్చినవారు.. నుదుటి రాతలను కలిపి చదువుకున్నవారు…
‘నిన్న తెల్లవారుజాము మొదటి ఫోను ఆమెకే వెళ్లింది. ఇంకా రాలేదు. ఇవాళైనా రావాలి. రాలేదు.’
‘ఆమె గారా? ఆమె వస్తే ఇంకేమి?’ అన్నాడు కొడుకు భంగపోతూ.
‘అలా భంగపోతే ఎలారా? ముందు ఫోన్ చెరు. కొట్లాడు’.. అంది పెద్దదీపం ఖాలాబీ.
భర్త వాలకం చూసి, కోడలే చేతిలోని ఫోన్ తీసుకుని, రింగ్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. అవతలివైపు ఆంటీ ‘హలో’ అని ఆ సంగతి వదిలి ఇంట్లో వాళ్లను కేకలు వేస్తుంటే, కొడుకు కోడలు చెబుతున్న సమాధానాలు చెవిన పడుతున్నాయి.
‘ఈ ప్రేమలు ఇప్పుడు కారడం దేనికిరా… కారాల్సిన టైములో కారితే బాగుండేది’ అని వాళ్లను జాడిస్తూ లైనులోకి వచ్చి ‘ఒరె.. అబ్బారు… ఏంట్రా… అది నన్నొదిలి పోతుందంటనే..’ అని ఏడుస్తూ అంది.
కొడుక్కి ఏడుపొచ్చింది. ‘అవునాంటీ’ అన్నాడు.
‘చూడ్రా… నిన్న తెల్లవారున నీ పెళ్లాం చేస్తే వీడు ఎత్తాడట. నాకు తెలియనే తెలియదు. ఆ తర్వాత ఫోన్ ఆపు జేసేసి పాడైందని చెప్పాడు. నిన్నంతా ఏం జరిగిందో నాకు తెలియనే తెలియదు నాన్నా. ఉదయాన్నే తెలిసింది. నన్ను తీసుకెళ్రా అంటే తీసుకెళ్లడు. కదల్లేని మెదల్లేని ఈ ప్రాణాన్ని ఎందుకురా అందరూ కలిసి బాధిస్తున్నారూ’… ఏడుస్తోంది.
కొడుకు ఫోను లాక్కున్నట్టున్నాడు ‘ఇలియాస్ భారు. సారీ… నీకు తెలియందేముంది. మా నాన్నకు జీవితాంతం చాకిరీ చేసి, నానా బాధలు పడి, ఆయన పోయిన ఈ రెండేళ్లుగాగానీ కొంత స్థిమితంగా లేదామె. ఇన్నాళ్లూ నాలుగ్గోడల మధ్య ఉండిపోయిందే ఇకనైనా తిప్పుదాం అంటే మోకాళ్లేమో బిగుసుకు పోయాయి. ఇప్పటికి రెండుసార్లు పడింది. ఆపరేషన్ అంటే ఆరు లక్షలడుగుతున్నారు. ఏదో ఉన్నన్నాళ్లు అంత తినిపించుకుని, చూసుకుందామనుకుంటే మీ అమ్మ పరిస్థితి వినడానికొచ్చింది. మనిషే పోయిందంటే వార్త వినిపించడం వేరు. ఇలాంటి స్థితిలో మీ అమ్మను చూస్తే ఈమె తట్టుకునేమాట నిజమేనా. కొత్తబాధ ఎక్కడ తెచ్చుకునేదని నేనే దాచా’ అన్నాడు.
అవతల ముంతాజ్ ఆంటీ కేకలు పెరిగాయి.
‘ఇలియాస్ భారు.. ఇప్పుడెలాగూ మధ్యాహ్నం గడిచిపోయింది. సాయంత్రం డాక్టరు దగ్గరకు తీసుకు పోయి ఒకసారి చూపించుకుని మాత్ర ఏదైనా వేయాల్సుంటే వేసి పొద్దున్నే తీసుకొస్తా. నన్ను నమ్ము’ అని పెట్టేశాడు.
అందరూ ఉసూరుమన్నారు. ‘రేపటికి అటో ఇటో అవకపోద్దా అని వాడి ప్లాను’ కోపంగా అంది పెద్దదీపం ఖాలాబీ.
‘లేదులే ఖాలాబీ… పెయిన్ కిల్లరు ఏదైనా వేసి, బీపీ గీపీ చూపించుకుని తీసుకురావడం మంచిదే గదా. మన అమ్మ మనకెంతో వాళ్లమ్మ వాళ్లకంత’ అంది కోడలు.
సాయంత్రపు వెలుతురు మామూలుగానే నిరాశకు అనుకూలంగా ఉంటుంది. ఆ రోజుటిది మరీ తోచడానికి ఏమీ లేనట్టుగా చేస్తూ ఆ ఇంటి మీదకు వచ్చింది.కూతురు వజూ చేసుకుని, హిజాబ్ ధరించి, తల్లి పక్కన కూచుని, దేవునితో సంవాదానికి దిగినట్టుగా ఆయతులు చదవసాగింది. ఆ కూతురికి పదేళ్ల వయసున్నప్పుడు తల్లి ఖురాను పూర్తి చేయించి పూర్తయినందుకు సాంగెం ఘనంగా చేసి భోజనాలు పెట్టించింది. పూలహారాన్ని మెడలో వేసి చెంపలకు హత్తుకుంటూ ‘దేవుడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా’ అనడం గుర్తుకు వచ్చి కూతురి కనుగుడ్లు నీటిగుండాలవుతున్నాయి. దేవుడు చల్లగా చూడాల్సింది బతుకులోనేనా. చావులో కాదా.
‘యాల్లా… మేరి మాకీ ముసీబత్ ఆసాన్ కర్’…
రాత్రి ముదిరి ఇంట్లోకి మరింత వెలితిని తెచ్చింది. బంధువుల కుర్రాడొకడు పరోటాలు, దోసెలు ఇంకా నానా రకాల పదార్థాలు పాలిథిన్ కవర్లలో తెచ్చి, నా వంతు పని ఇది అన్నట్టుగా కాగితం ప్లేట్లలో పెట్టి, తలా కొంత ఇచ్చి వెళ్లాడు.
‘ఇన్నిమార్లు తిరిగేది లేదు’ అని పెద్దదీపం ఖాలాబీ జపమాల తీసుకుని రాత్రికి ఉండిపోతే కూతురు, కోడలు దైవిక తలంపులతో జాగారం చేస్తూ మంచం మీద మధ్య మధ్య కన్నేస్తూనే వచ్చారు.
ప్రాణం పోలేదు. మూడవ రోజు. తెల్లవారింది.
ఉదయం ఎనిమిదీ, ఎనిమిదిన్నరకు ఆ ఇంటి ముందు షేర్ఆటో ఆగడం బహుశా తమ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఘటనగా ఆ ఇంటి జనులు ఎప్పటికీ చెప్పుకుంటారు. ముంతాజ్ ఆంటీ వచ్చింది.
అతి మెల్లగా ఆటో దిగి, చేతికర్ర ఊతంగా, పక్కన కొడుకు ఉండి నడిపిస్తూ ఉంటే, రెండు మెట్ల గడప అయినా పది నిమిషాల సమయం తీసుకుని ఎక్కి, ఇంట్లోకి ఆమె వేసిన మొదటి అడుగు ఆ స్నేహితురాలి హృదయాన్ని తాకే ఉంటుంది. ఇష్టమైన వ్యక్తుల ఉమ్మడి ఆనందాల్లోనే కాదు, ఉమ్మడి దుఃఖంలో కూడా తోటివారు విపరీతంగా పాల్గొనాలనుకుంటారు. ముంతాజ్ ఆంటీని చూడగానే ఎవరి ఏడుపు ఎలా రేగేదోగానీ చిత్రంగా ముంతాజ్ ఆంటీ చాలా గంభీరమయ్యి అందరినీ కంటిచూపుతో నిలువరించగలిగింది.
‘ఎక్కడా.. అదీ.. దొంగదీ… ఎవరిచ్చారు దానికి టికెట్టు’ అని లోపలికి వచ్చింది. పగలే అయినా ట్యూబ్లైట్ వేసి ఉంది. తెల్లటి పక్క మీద నైటీలో నిదురపోతూ స్నేహితురాలు. మంచం పక్కన కుర్చీలో ప్రయత్నం మీద కూర్చోగలిగింది. స్నేహితురాలి నుదురు మీద చేయి వేస్తూ, అంత మార్దవంగా ఎవరూ పిలువ లేరు… ‘మెహరూన్’ అంది.
‘ఊ…..’ అద్దో ప్రాణం.
‘మెహరూన్’..
‘ఊ ….’ ఉలికిపడుతున్న ప్రాణం.
ముంతాజ్ ఆంటీ ఎంతో దిటవుగా దుఃఖాన్నంతా కంటి కొసల్లో నిలిపి ‘వచ్చాగా.. వచ్చానమ్మా.. వచ్చానే’ అంటుంటే ‘ఊ.. ఊ.. ఊ’.. అని జవాబు. చాలాసేపటి వరకూ ముంతాజ్ ఆంటీ తన స్పర్శతో ఏం మాట్లాడిందో ఆ స్నేహితురాలు ఏం విందో. ఇప్పుడు గదిలో అందరూ స్త్రీలే మిగిలారు.
‘ఏమే ముంతాజ్. సత్యం చెప్పు. ఏందిది… దీని మనసులో ఏముందో నీకు తెలుసునా? ఏం వెలితి ఉండి సంధిలో కొట్టకలాడతా ఉంది…’ అంది పెద్దదీపం ఖాలాబీ అంతసేపూ ఉగ్గబట్టుకుని. ముంతాజ్ ఆంటీ మంచం వైపే చూసింది. స్నేహితురాలి చేతిని చేతుల్లోకి తీసుకుని, నిమిరింది.
‘ఏయే వెలుతులని లెక్కబెడతావ్ ఖాలాబీ.. ఏయే వెలుతులని? నీకు తెలియదా? సంసా రంలో పడ్డాక ఆడదానికి వేయి వెలుతులు. లెక్కబెట్టుకుంటే లెక్క తేలుతాయి. వద్దనుకుంటే ఏవీ మిగలవు. అలా వద్దను కోవడం వల్లే గదా కాపరాలు సాగి పైకప్పులు నిలుస్తున్నాయి. దీనికేమైంది.. రాణల్లే బతికింది… రాణల్లే పోతుంది.. కన్నతల్లుల్ని, బిడ్డలు దిక్కూదివాణం లేకుండా వదిలేస్తున్న ఈ రోజుల్లో నా సఖి అయినవారందరి మధ్యన నిశ్చింతగా పోతోంది.. ఇంతకు మించి ఏం కావాలి?’..
‘మరి ఈ రంధి?’
‘అదే అర్థం కావడం లేదు’… అని ముంతాజ్ ఆంటీ తాను కూర్చున్న కుర్చీని మరింతగా తిప్పుకుని స్నేహితురాలి పక్కను, దాని మీదున్న స్నేహితురాలిని నఖశిఖం చూసింది.
కోడలి వైపు చూసి ‘దీని జుట్టుకు రబ్బరు బ్యాండు వేసి ఉన్నావా?’ అంది.
కోడలు అయోమయంగా ‘అవును’ అంది.
‘మాడు మీదనా మెడ మీదనా?’
కోడలు ఇంకా ఆశ్చర్యంగా ‘మాడు మీద’ అంది.
‘నీ మొహం. అలాంటి జుట్టుతో అది పాయిఖానాకే వెళ్లదు. అల్లామియా ఎదుటికి వెళుతుందా? మీరంతా మళ్లీ కోడళ్లూ, కూతుళ్లూ. నాశినం. ముందు దీనికి జడ వేయాలి’ అంది కోపంగా ప్రయత్నంతో లేచి నిలబడుతూ.
అందరూ కలకలంతో కదిలారు. లాయర్ గారని రమాదేవి నర్సింగ్ హోమ్ వాళ్లు తక్కువ అద్దెకు ఇచ్చిన ఆస్పత్రి మంచం అది. లివర్ తిప్పితే పైకి లేస్తుంది. కోడలు, కూతురు చెరో రెక్కన ఆసరా ఇచ్చి, వెన్నుకు హస్తాలు చేర్చి, కొద్దిగా ముందుకు నెట్టి తెరిపి ఇస్తే, తల వెనుకగా వచ్చిన ముంతాజ్ ఆంటీ స్నేహితురాలికి అగడా బగడాగా వేసిన జుట్టు ముడి చూసి ‘ఇలా ఉంటారు మీ నిర్వాకాలు’ అంది ఇంకా కోపంగా.
‘తొందరగా దువ్వెన ఇచ్చి చావండి’… అని హూంకరించింది.
దువ్వెన అందేలోపు రబ్బర్ బ్యాండ్ తీసి పారేసి, జుట్టును విడుదల చేసి, ఒక అరచేతి మీద వెంట్రుకలన్నీ తీసుకొని, మరో అరచేత్తో బిడ్డను నిమిరినట్టు నిమిరింది. రెండు చేతులతో నుదుటి మీదుగా వెంట్రుకలన్నింటినీ అందుకుంటూ కొసల వరకూ సవరిస్తూ ఎడమ చేతి చూపుడువేలు మధ్యవేలు కత్తెరగా చేసి, జుట్టు మొత్తం దొరకబుచ్చుకుంది. బిగువుకు గుంజింది. ఆనెక కుడిచేత్తో దువ్వెన అందుకుని జుట్టులో అతి సుతారంగా గుచ్చగానే స్నేహితురాలి పెయ్య కంపించి కళ్ల నుంచి కన్నీరో, లోపలి స్రావాలో జలజలమని రాలి పడ్డాయి.
‘ఆంటీ’… కూతురు, కోడలు ఏదో చెప్పబోయారు.
ముంతాజ్ ఆంటీ ఏం మాట్లాడకుండా జడ వేయడం మొదలెట్టి, తెల్లగా వెండి దారాల్లా ఉన్న వెంట్రుకలను తీర్చిదిద్దుతూ, తొందరే లేనట్టుగా సిద్ధం చేస్తూ ‘ఈ జడ వల్లే ఇది నాకు ఫ్రెండయ్యింది తెలుసా’ అంది. ‘ఏం మెహరూన్.. గుర్తులే?’ అని రెట్టించింది.
గదిలోని ఆడవారు స్నేహితురాలి ముఖాన్నే చూస్తున్నారు. అంతవరకూ ప్రేతకళతో ఉన్న ముఖాన నూర్ దిగుతోంది. రోగలక్షణం చాలించింది. ఫరీస్టాలు వచ్చి నిలబడి ముంతాజ్ ఆంటీ మాటలు వింటొండొచ్చు.
‘దీని కంటే నేను ఐదేళ్లు పెద్దదాన్ని. దీన్ని బుడంకాయలా చూసేదాన్ని. జడ వేయమని వచ్చిందొక రోజు. దీనికి జడ పిచ్చి. వాళ్లమ్మకు తెలిస్తే ఆడదానికి జీవితం ఆడించడం తెలుస్తుందని మా నాన్నమ్మ అనేది. మా నాన్నమ్మ జుట్టు చిక్కు తీయడంలో ఎక్స్పర్టు. అలాంటి వేయి అంబరాలలో నొకటి ఎక్స్పర్ట్లు ఆ రోజుల్లో ఉండేవారు. మీరు పిల్లలు..
ఏ బొచ్చూ తెలియదు… కుంకుడుకాయ రసం తలకు బోసుకుని స్నానం చేశాక, వెంట్రుకలను ఆరబెట్టి, చెత్త ఏరి, చిక్కు తీయడం అంటే మాటలు కాదు. ఆ విద్యలో మా నానమ్మ పలాతున్. నాకు నేర్పింది. మా అమ్మ జడ బాగా వేస్తుంది. నేనూ నేర్చుకున్నాను. అందుగ్గా వీధిలోని ఆడపిల్లలందరి దగ్గర నా డిమాండు జాస్తిగా ఉండేది. ఇద్దో ఇది హైదరాబాద్ గాజులు నాకు లంచమిచ్చి, ఫ్రెండుగా చేసుకుని, నా చేత జడ వేయించుకునేది. నేను తప్ప దీని వెంట్రుకలు ఎవరూ తాకడానికి ఒప్పుకునేది కాదు. ఏం మెహరూన్… గుర్తులే?’…
గదిలోని స్త్రీలు ఆ ఇద్దరూ స్నేహితులను ఆ క్షణాన చూడటం, వినడం భాగ్యమన్నట్టుగా ఉన్నారు.
‘నిద్రపోయి లేస్తే ఏ ఆడదాని జుట్టైనా, జడైనా కుదురుగా ఉండవు. కాని ఇది నిద్రపోయి లేస్తే ఒక్క వెంట్రుక కదిలేది కాదు. అసలు దీనికి వారంపాటు జడ వేయకపోయినా వెంట్రుక కదలదు. అంత జాగ్రత్తగా చూసుకునేది. నేనెప్పుడైనా నాగా వేసి వాళ్లమ్మ చేత వేయించుకుంటే ఏడుపు ముఖం పెట్టేది. వద్దన్నా మాడు నుంచి మొదలెడుతుంది, మా అమ్మ… తూ.. నాకొద్దు అనేది. దీనికి మెడ నుంచి మొదలెట్టాలి. జడను కాస్త గాలి పీల్చుకోనీ… అనేది నాతో. మీరు గమనించి చూస్తే స్టూడియోల్లో దిగిన ఫోటోల్లో ఇదుందా అసలు. ముందుకు వేసుకున్న జడ తప్ప. మేమిద్దరం కూడా దిగాం ఒక ఫొటో…. జడలు ముందుకు వేసుకుని. దొంగ ముఖంది… నా కురచ జడను చూపి ఓడించాలనుకుంది… నేను తక్కువ తిన్నానా? ఇంత పొడుగు సవరంతో నైసు చేసి మోసం చేశా. ఏం మెహరూన్… గుర్తులే?’…
వెంట్రుకల సవరింపు పూర్తయ్యాక దువ్వెనలో చేరిన జుట్టును చేతివేళ్లు దగ్గరగా చేసి విడిపించి, దువ్వెన తల్లో పెట్టుకుని, రెండు చేతులతో వైనంగా మడిచి పొట్లంలా కట్టి, ఇంకో దువ్వెన పళ్ల మధ్యన భద్ర పరిచి, తల్లోని దువ్వెన తిరిగి అందుకుంది ముంతాజ్ ఆంటీ… జడ వేసేందుకు.
‘పెళ్లయ్యాక పిల్లా పాపలతో కళకళలాడాలనుకుంటారు అందరూ. ఇది జడతో కళకళలాడాలి అనుకుంది. కాని కాపురానికి అడుగు పెడితే జడ వేసుకునేదానికే లేదు. దీని మొగుడికి ముగ్గురు చెల్లెళ్లు. దీని పెళ్లయిన ఆర్నెల్ల నుంచి ఒకొక్కరి పెళ్ళిళ్లు అయ్యాయి. ఆ అల్లుళ్లు వస్తే ఇది అత్తతో సమానం. అత్తగారు జడ వేసుకుని కులుక్కుంటూ తిరగరాదు. అసలు జడ చూపిస్తూ తిరగడమే ఆ రోజుల్లో తప్పు. ఆ ఇంట ఇంకా పెద్ద తప్పు. కొన్నాళ్లు కొంగు కింద దాచింది. కొన్నాళ్లు పగటి పూట దాచింది. ఆ తర్వాత జడ మీద కోరికనే దాచేసింది. దీని మొగుడికి పెళ్లాం మనసులో ఏం ఉందో పట్టిందనా? ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లాం జడే వదిలేసిందే అనన్నా చూడాలి గదా. ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే ”రావే జడ వేస్తాను… ముడితో ఎందుకు తిరుగుతావ్” అనంటే ”ఇప్పుడు అదొక్కటే తక్కువ” అనేది, ”నేను దేవుడి దగ్గరకు వెళ్లేప్పుడే ఇక జడ వేసుకునేది” అనేది. దేవుడి దగ్గరకు వెళ్లేప్పుడు! సన్నజాజులు ఎండకు ఆరబెట్టి, కొబ్బరినూనె వేడి చేస,ి దించి, దానిలో ఆ సనజాజులను నానబెట్టి సీసాకు పట్టుకుంటే బలే వాసన. దీనికి ఇష్టం. దేవుడు సీసాలు సీసాలు దీని కోసం రెడీ చేసి ఉంటాడు ఈ పాటికి. ఏమే మెహరూన్… రెడీ చూసి ఉండడూ? నా కోసం పెట్టుమే. వెనకే రాకుండా ఉంటానా?’….
జడ వేయడం పూర్తయ్యింది. లివర్ తిప్పితే మంచం మెల్లగా కిందకు దిగింది. జడను భుజం మీదుగా ముందుకు వేసి స్నేహితురాలిని జాగ్రత్తగా పడుకోబెట్టింది ముంతాజ్ ఆంటీ.
‘దీనికో పాపిటబిళ్ల ఉండాలి. ఎవరి వాటాకు వచ్చింది?’
‘నాకే ఆంటీ’ అని కోడలు గబగబా వెళ్లి బీరువా తెరిచి తెచ్చింది.
ముంతాజ్ ఆంటీ ఆ చాంద్తారా పాపిటబిళ్లను స్నేహితురాలి శిరస్సున సింగారించి, బాగా ముందుకు వొంగి, మెటికలు విరుస్తూ ‘ఎంత బాగుందమ్మా నా బంగారు స్నేహితురాలు…. నా బంగారుతల్లి… ఒసే మెహరూన్’…. అంది.
చేతికర్ర మీద బలం వేస్తూ నిలబడింది.
ఎవరో నీళ్లు ఇచ్చారు. కొద్దిగా తాగింది.
‘నేను బయలుదేరుతానైతే’ అంది.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
కొడుకును పిలిచి, కొడుకు భుజాన్ని ఆసరా చేసుకుని మెల్లగా నడుస్తూ, షేర్ఆటో వచ్చే వరకూ రెండు నిమిషాలు వీధిగడప దగ్గర నిలుచుంది. లోపల పెద్దగా ఏడుపులు మొదలయ్యాయి.
రెండు మెట్ల ఆ గడపను అతి కష్టం మీద దిగి, ఆటో ఎక్కి, ఇంటివైపు చూస్తూ, బొడ్డున ఉన్న దస్తీని తడుముకుంటూ ఉండగా షేర్ఆటో కదిలింది.
అర్థాలు :
ఫరిష్టా- దైవ భటుడు,
జొహర్ నమాజ్- మధ్యాహ్నం చదివే నమాజ్,
దరూద్- ప్రవక్తకు స్తోత్రం,
వజూ- ముఖం, చేతులకు నీటిశుభ్రం,
కల్మ- పరమ వాక్యం (ఇస్లాంలో ఆరు ముఖ్య కల్మాలు ఉంటాయి)
– మహమ్మద్ ఖదీర్ బాబు, 9705444243