కనువిప్పు

Jan 12,2025 08:45 #Sneha

ఆనంద్‌ పదవ తరగతి చదువుతున్నాడు. ఎప్పుడు చూసినా స్నేహితులతో ఆడుతూ, తిరుగుతూ పాఠశాలకు గైర్హాజరు అవుతూ ఉండేవాడు. ఆనంద్‌ తండ్రి బతుకుతెరువు కోసం దుబారు వెళ్లాడు. ఈ మధ్యకాలంలో తన భార్యపిల్లలతో మాట్లాడడానికి బంధువులతో సెల్‌ఫోÛన్‌ పంపించాడు. ఆ సెల్‌ఫోÛన్‌ మోజులో పడి.. ఆనంద్‌ పాఠశాలకు వెళ్లకుండా, హోంవర్క్‌ చేయకుండా వుండేవాడు. రాత్రింబగళ్లు ఆ సెల్‌ఫోన్లో రకరకాల గేములు ఆడుతుండేవాడు. దాని ప్రభావంతో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. వేసవి సెలవుల్లో దుబారులో ఉంటున్న ఆనంద్‌ తండ్రి తన ఇంటికి చేరుకున్నాడు.
తన కుమారుడు ఆనంద్‌ పదవ తరగతి ఫెయిల్‌ అయ్యాడని తెలుసుకొని బాధపడ్డాడు. దానికి గల కారణాలను భార్యను అడిగి తెలుసుకున్నాడు. ఒకరోజు ఆనంద్‌ను ప్రేమగా పిలిచాడు. తన పక్కన కూర్చోమని చెప్పాడు. ‘చూడు ఆనంద్‌ బతుకుదెరువు కోసం నేను మీకందరికీ దూరంగా దుబాయిలో బతుకుతున్నాను. మీతో మాట్లాడడానికి సెల్‌ఫోన్‌ పంపించాను. ఇది అందరికీ అవసరం కూడా. కానీ నువ్వు చదువుకునే విద్యార్థివి. అదేపనిగా సెల్‌ఫోన్లో రకరకాల గేములు ఆడుతు, సమయాన్ని వృధా చేసుకున్నావు. భవిష్యత్తును నువ్వే నాశనం చేసుకున్నావు. స్నేహితులందరూ బాగా చదివి, మంచి మార్కులతో పదవ తరగతి పాసయ్యారు. నేను చిన్నప్పుడు నీలాగే సరిగా చదవకుండా ఆటపాటలతో కాలక్షేపం చేశాను. మా తల్లిదండ్రులు ఎంత చెప్పినా నేను పట్టించుకోలేదు. అందుకు నేను ఇప్పుడు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాను. బతుకు తెరువు కోసం దుబారు వెళి,్ల అష్టకష్టాలు పడుతున్నాను. నాలాగే నీ జీవితం కాకూడదనే ఉద్దేశంతో నిన్ను చదివిస్తున్నా. బాగా చదివి, ఉద్యోగం సంపాదించి మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకున్నాం. కానీ నీవు అవేమీ అర్థం చేసుకోకుండా నీకు నచ్చినట్లు ప్రవర్తించావు. ఇకనైనా నీ తప్పును తెలుసుకొని, బాగా చదువుకో’మని తండ్రి సుతిమెత్తగా వారించాడు.
తండ్రి మాటలకు వెంటనే ఆనంద్‌కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ల మీద పడ్డాడు. ‘నాన్న మీ మాటల వల్ల నాకు కనువిప్పు కలిగింది. నేను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించాను. ఇకనుండి మీరు ఆశించినట్లు బాగా చదివి, ఉద్యోగం సంపాదిస్తాను’ అని తండ్రికి మాటిచ్చాడు. తన మాటలు ఆనంద్‌కు బాధ కలిగినా, చివరికి అతనిలో మార్పు రావడం సంతోషం కలిగించింది.

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌
9441762105

➡️