పత్రికా స్వేచ్ఛ… ప్రజా హక్కుల కవచం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా న్యూస్‌ చానళ్లు వున్నాయి. పత్రికలు, యూట్యూబ్‌ చానళ్లు అయితే వేల సంఖ్యలోనే వుంటున్నాయి. రోజుకొకటి ప్రింట్‌ మీడియా, యూట్యూబ్‌ వంటి డిజిటల్‌ వేదికల విషయంలో మీడియా రంగంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. పాలకులకు గిట్టని వాయిస్‌ వినిపించే మీడియా సంస్థలను అణగదొక్కే ప్రయత్నం పెద్దఎత్తున జరుగుతోంది.
ఈ క్రమంలో ప్రతి ఏడాది మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటున్నాం. పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను గౌరవించడానికి, మీడియా స్వాతంత్య్రం, మానవహక్కుల పరిరక్షణకు హామీ ఇవ్వడంలో సాధించిన పురోగతిని పరిశీలించడానికి, అంచనా వేయడానికి, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం. అదే సమయంలో పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు గుర్తుచేసే రోజు కూడా.
ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

బిజెపి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు, మానవహక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రత్యేకించి ”రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)” వంటి సంస్థలు, భారత్‌ యొక్క ప్రెస్‌ స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో గణనీయమైన తగ్గుదలను నమోదు చేశాయి. 2014లో 140వ స్థానంలో ఉన్న భారత్‌ 2024 నాటికి 180 దేశాల్లో 161వ స్థానానికి దిగజారింది.

అణచివేత, చట్టపరమైన ఒత్తిళ్లు..
‘పత్రికా స్వేచ్ఛకి అర్థం ఏదైనా వుందంటే, అది విమర్శించడానికి, వ్యతిరేకించడానికి వున్న స్వేచ్ఛ’ అంటారు జార్జ్‌ ఆర్వెల్‌. తద్విరుద్ధంగా బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛపై అత్యంత వివాదాస్పద అంశం జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు. దేశద్రోహం, అపవాదు వంటి ఆరోపణలతో అనేకమంది పాత్రికేయులు నిర్బంధించబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో సిద్దీక్‌ కప్పన్‌ నిర్బంధం, రాణ అయ్యూబ్‌ వంటి జర్నలిస్టులపై సైబర్‌ దాడులు, క్రిమినల్‌ కేసులు బనాయించారు. బిజెపి ప్రభుత్వ నిరంకుశ, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా గొంతువిప్పిన మీడియా సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులకు దిగడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. పత్రికలకు ఇవ్వాల్సిన ప్రకటనలను సైతం నిలిపివేసి, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ… వారిని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూడటమూ పెద్దఎత్తున జరుగుతోంది. బిబిసి ఇండియా, ది వైర్‌, న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలపై ఈడీ దాడులు, ఆంక్షలు అందుకు అతిపెద్ద ఉదాహరణలుగా చెప్పొచ్చు. ‘న్యూస్‌క్లిక్‌పై దాడి భారతదేశ మీడియా స్వేచ్ఛా సమరంలో అతి దారుణమైన సందర్భం. 1975 నాటి ఎమర్జెన్సీ తర్వాత చెప్పుకోవాల్సిన ఘటన ఇదే!’ అని ది హిందూ మాజీ ప్రధాన సంపాదకులు ఎన్‌.రామ్‌ వ్యాఖ్యానించారు. అయితే, దీన్ని కేవలం మీడియా వ్యవహారంగానేగాక పోలీసుల పెత్తనంతో సాగిన రాజకీయ నేపథ్యంగా చూడవలసి వుంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. వామపక్ష ప్రజాస్వామిక భావజాలంతో పనిచేసే స్వతంత్ర మధ్యతరహా మీడియా సంస్థపై జరిగిన ఈ దాడి.. జర్నలిజానికి పొంచివున్న సవాళ్లకు సంకేతమని రామ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రిక ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్‌ గిరిజేశ్‌ వశిష్ట నిర్వహిస్తున్న ‘నాకింగ్‌ న్యూస్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ను ఆకస్మికంగా మూసివేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించే అనేక యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఇప్పటికే మూతపడ్డాయి.

కార్పొరేట్‌ ప్రభావంలో యాజమాన్యం..
ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కార్పొరేట్‌ సంస్థలు మీడియాను కొనుగోలు చేయడంతో స్వతంత్ర ఛానళ్లను తగ్గిస్తుంది. ఉదాహరణకు, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ యాజమాన్యంలోని నెట్‌వర్క్‌ 18, ఇండియా టుడే వంటి మీడియా సంస్థలు ప్రభుత్వ విధానాలకు అనుకూలమైన సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయనేది జగద్విదితం.

డిజిటల్‌ సెన్సార్షిప్‌, ఇంటర్నెట్‌ నిషేధాలు..
జమ్మూ-కాశ్మీర్‌ వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ నిషేధాలు, సామాజిక మాధ్యమాలను నియంత్రించే ఐటీ నియమాలు (2021) అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ విమర్శకుల సోషల్‌ మీడియా ఖాతాలను నిరోధించడం, వార్తాపత్రికలను సెన్సార్‌ చేయడం సర్వసాధారణమైంది.

ప్రతిపక్ష గొంతుల అణచివేత..
రైతు ప్రదర్శనలు, కోవిడ్‌-19 సందర్భంలో ప్రభుత్వ వ్యవహారశైలిని విమర్శించిన జర్నలిస్టులు హెచ్చరికలు, హింసను ఎదుర్కొన్నారు. హర్యానా పోలీసులు 2021లో కర్ణతి కౌర్‌ వంటి జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు. ఫేక్‌ న్యూస్‌, జాతీయ భద్రత అనే సాకులు చూపుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం నిస్సిగ్గుగా చేస్తోంది. మరోవైపు స్వతంత్ర మీడియాను అణచివేస్తోంది.

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం..
పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం అసంపూర్ణం. మీడియా స్వేచ్ఛను పునరుద్ధరించడానికి, నిష్పాక్షిక న్యాయపరమైన విచారణ, జర్నలిస్టుల సురక్షా చట్టాలు, ప్రభుత్వం-మీడియా సంబంధాల పారదర్శకత అవసరం. భారత్‌లో దాడులకు గురవుతున్న పత్రికా స్వేచ్ఛకు సంబంధించి.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ జర్నలిస్టులకు మద్దతు ఇవ్వడం కీలకం. బిజెపి పాలనలో పత్రికా స్వేచ్ఛకు ఎదురయ్యే సవాళ్లు కేవలం మీడియా సంస్థలకు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించినవి కూడా. సమాచార స్వాతంత్య్రం భారత రాజ్యాంగం యొక్క మూలసూత్రాల్లో ఒకటి. ఆ నిబద్ధతను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు వుంది. నిర్భీతితో, నిర్భయంగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలి. పత్రికా స్వేచ్ఛ.. పౌర, రాజకీయ, మతపరమైన హక్కులకు నిలయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధి పత్రికలు. పత్రికారంగం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభం. ఇది ప్రజలకు వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కులకు కవచంలా పనిచేస్తుంది. దీనిని కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యత.

పత్రికా స్వేచ్ఛ అంటే..?
పత్రికా స్వేచ్ఛ అంటే మీడియా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా, ప్రభుత్వ హస్తం లేకుండా వార్తలను ప్రచురించే హక్కు కలిగి ఉండడం. ఇది ఏకపక్ష వార్తలు కాకుండా, సమగ్ర, సమానమైన వేదికను అందించడానికి అవసరం. ‘మీ మాటలతో నాకు ఏకీభావం లేకపోయినా.. అవి చెప్పే మీ హక్కును మరణం వరకు కూడా రక్షిస్తాను’ అంటారు వాల్టైర్‌. కానీ, దీనికి విరుద్ధమైన భావనలో భారతీయ మీడియా స్వేచ్ఛ నలిగిపోతోంది. సెడిషన్‌ వంటి కాలహరణ చట్టాలు పునరుద్ధరించబడుతున్నాయి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాసిన వార్తలపై కేసులు పెట్టడం ద్వారా జర్నలిస్టుల్ని భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది జర్నలిస్టులు నెలల తరబడి జైళ్లలో వున్న ఘటనలు మన కళ్ల ముందే అనేకం జరిగాయి. అందుకే అంటారు అంబేద్కర్‌.. ‘ప్రజాస్వామ్యం సజావుగా నడవడానికి పత్రికా స్వేచ్ఛ అవసరం’ అని. నిబంధనల పేరుతో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ట్విట్టర్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుండటంతో వీటిపై ఒత్తిడి పెరుగుతోంది.
అదే సమయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననం వాంఛనీయం కాదు. ఇది ప్రజాస్వామ్య హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు హాని కలిగిస్తుందన్న విషయం మీడియా రంగంలో పనిచేసేవారు గుర్తించాలి. ఇతరుల స్వేచ్ఛకు, హక్కులకు భంగం కలిగే కథనాలను వండివార్చడం అంటే.. విచ్ఛిన్నకర శక్తులకు అవకాశం ఇచ్చినట్లే అవుతుంది.

జర్నలిస్టుల భద్రత..
దేశంలో జర్నలిజం ప్రమాదకర వృత్తిగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులు హత్య చేయబడ్డ ఘటనలు సంచలనం రేపాయి. వివిధ కేసుల్లో దోషులకు శిక్ష పడకపోవడం, బాధితులకు న్యాయం లభించకపోవడం వల్ల మరోసారి జర్నలిస్టుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో జర్నలిస్టుల హక్కులను పరిరక్షించే ప్రత్యేక చట్టాలు రూపొందించాల్సిన అవసరం వుంది. పత్రికా స్వేచ్ఛకు ప్రజల మద్దతు కూడా అవసరం. అదేవిధంగా న్యాయవ్యవస్థ జోక్యం పెరగాలి. పాత్రికేయులపైన, మీడియా సంస్థలపైన జరుగుతున్న దాడులు, అన్యాయంగా జరుగుతున్న అరెస్టులపై కోర్టులు స్వతంత్రంగా వ్యవహరించాలి.

– జేవియర్‌
9849210436

➡️