అనుకున్నదొకటి… అయ్యిందొకటి !

Apr 20,2025 13:26 #Sneha, #story, #sunday book

రామయ్య అగ్రహారంలో రామయ్యశాస్త్రీ, అతని భార్య కమలమ్మ నివాసం ఉంటున్నారు. శాస్త్రి ఆ ఊరిలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అతని దగ్గరికి వచ్చి వారికి సంబంధించిన పలు అంశాలు నివృత్తి చేసుకొనేవారు. ఈ విధంగా శాస్త్రి గారు ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి పేరు సంపాదించారు. ఆ ఊరి సర్పంచ్‌, అతనికి మంచి ఇల్లు కూడా ఇస్తూ.. కొద్దిగా బాగు చేసుకోమని సలహా ఇచ్చారు. ఉదయం లేసింది మొదలు శాస్త్రి గారికి విద్య, వివాహ,వాస్తు….ఇట్లాంటి సమస్యలతో వచ్చే వారితో ఒక నిమిషం ఖాళీ కూడా ఉండేది కాదు. అందరికీ సహనంతో పరిష్కారం చెప్పేవారు. ఈ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు కూడా!. ఇంత ఉన్నా, తన ఇల్లుని బాగు చేసుకోడానికి సమయం ఉండేది కాదు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఆ నీరు అంతా ఇంటి ముందే నిలిచి ఉండి, ఇబ్బంది పడేవారు.
భార్య కమలమ్మ ఎంత మొత్తుకున్నా ‘దేనికైనా సమయం రావాలి’ అంటూ కాలం గడిపేవారు. ఒక రోజు రాత్రి ఆ ఊరిలోకి దొంగలు వచ్చారు. ఎవరి ఇంటికి కన్నం వేద్దామా అనుకుంటూ ఉండగా, ‘శాస్త్రి గారు బాగా సంపాదిస్తున్నారు. ఈ మధ్యనే మంచి మంచి నగలు కూడా కొన్నట్లుంది. అతని ఇంటిలో దొంగతనం చేస్తే మన కరువు కూడా పోతుంది’ని భావించి ముగ్గురు దొంగలు శాస్త్రి ఇంటిలోకి ప్రవేశించారు. వాళ్ళ ప్రవేశాన్ని గమనించిన శాస్త్రి, భార్య కమలమ్మ చెవిలో ఒక విషయం చెప్పారు. ‘వాళ్ళు వినబడేటట్లు నన్ను ప్రశ్నలు అడుగు నేను కూడా సమాధానాలు వారికి వినిపించేటట్లు చెప్తా’నన్నారు.
దొంగలు వాళ్ళు నిద్రించే గది కిటికీ దగ్గరకి వచ్చేసరికి భార్య తన భర్తతో ‘ ఏమండీ! ఈ మధ్యన మీరు కొన్న రవ్వల నెక్లెస్‌, 20 తులాల వడ్డాణం, బంగారు గాజులు….ఇవన్నీ ఎక్కడ పెట్టారు? కనబడలేదు.’ అని అడిగింది.
‘గట్టిగా అరవకే… ఇంట్లో ఉంటే, ఎప్పుడైనా దొంగలు పట్టుకుపోతారని ముందుగా ఊహించి, మన ఇంటి కాంపౌండ్‌ ఈశాన్యమూల ఆరు అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పు గుంతలో పెట్టాను. ఏ దొంగలకు కూడా తెలియదు’ని చెప్పాడు.
ఈ సంభాషణ అంతా విన్న దొంగలు ఆనందంతో అక్కడ నుండి వెళ్లి వెంటనే శాస్త్రి చెప్పిన కొలతలు ప్రకారం పలుగు, పార, గునపం పట్టుకుని ఈశాన్య మూల గొయ్యి తీయడం ప్రారంభించారు. మొత్తం మీద శాస్త్రి చెప్పినట్లే గొయ్యి తీశారు. అయినా బంగారం దొరకలేదు. ఇంకా కిందన ఉంటుందేమోనని కొద్దిగా తవ్వుతుండగా తెల్లారిపోయింది. దొంగలు ఉసూరు మంటూ గొయ్యి నుండి పైకి వచ్చారు. పంతులు కృతజ్ఞతగా ”మీరు నాకు మంచి సహాయం చేసార్రా! ఎప్పటినుండో నేను ఇంకుడు గుంత తీయాలనుకుంటున్నా. నా వల్ల కాలేదు. ఒకటి రెండు సార్లు సర్పంచ్‌ కూడా చెప్పారు. అయినా తీరుబాటు లేకపోయింది. ఇన్నాళ్ళకి మీరు నా సమస్య పరిష్కారం చేశారు. నిజానికి నా దగ్గర ఏమీ బంగారం లేదు. మీరు దొంగలైనా నాకు మంచి చేసారు. ఇక నుంచైనా బుద్ధిగా బతకడం నేర్చుకోండి’. అంటూ ఆశీర్వదించారు. దొంగలు పంతులు గారికాళ్ళపై పడి క్షమించమని కోరి, అక్కడనుండి వెళ్లిపోయారు.

ఎల్‌.వి జగన్నాథరావు
9440282996

➡️