కొత్తపేట పురపాలక సంఘఉన్నత పాఠశాలలో మాధవరావు ప్రధానోపాయుడిగా పని చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు వచ్చి పాఠశాల స్థాయిలో మొదటి స్థానంలో వచ్చిన ఒక విద్యార్థికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇవ్వడం ఆనవాయితీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో రాజు, రాము, గోపీలు ఒకే మార్కులు రావడంతో ఎవరికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇవ్వాలో అర్థం కాలేదు. తోటి ఉపాధ్యాయుల సలహాలను తీసుకుందామని సమావేశం ఏర్పాటు చేసాడు మాధవరావు.
‘ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఒకరికి ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇవ్వాలని మీకందరికీ తెలుసు. కాని ఈ సంవత్సరం ముగ్గురు ఒకే మార్కులు తెచ్చుకున్నారు. ముగ్గురిలో ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలో చెప్పండి’ అని సమావేశాన్ని ఉద్దేశించి అన్నాడు మాధవరావు.
‘ముగ్గురికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా సార్’ ఎప్పుడూ లౌక్యంగా ఉండే సోషల్ మాష్టారు అన్నాడు.’ ముగ్గురికి పరుగు పందెం పెట్టి ఎవరు గెలిస్తే వారికి ఇవ్వండి’ అని నవ్వుతూ అన్నాడు వ్యాయామం మాష్టారు.
‘ఎవరు పద్యాలు ఎక్కువ చూడకుండా చెపుతారో వారికి ఇవ్వండి’ అని తెలుగు మాష్టారు అన్నాడు.
‘ఒక ప్రయోగం ఇచ్చి ఎవరు బాగా చేస్తే వారికి ఇస్తే సరి’ అని సైన్స్ మాష్టారు అన్నాడు.
‘పది లెక్కలు ఇచ్చి ఎవరు వేగంగా వేస్తారో వారికి ఇవ్వొచ్చు’ అని గణిత మాష్టారు అన్నాడు. అందరి మాటలు విన్న మాధవరావు
‘ఇవన్ని ప్రతిరోజు వారు చేస్తున్నదే. నేను ఒకటి చేద్దామనుకుంటున్నాను. మీరు అందరూ ఏకీభవిస్తే చేద్దాం. అది ఏమిటంటే ఒక వారం రోజులు ముగ్గురు విద్యార్థులు ఉదయం ఉద్యానవనంలో మొక్కలకు నీళ్ళు పోయాలి. మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో భోజనం సమయంలో పాల్గొనాలి. సాయంత్రం గ్రంధాలయాన్ని సందర్శించాలి.ఈ మూడు కార్యక్రమాలు ఎవరైతే క్రమం తప్పకుండా చేస్తారో వారిని ఎన్నుకుందాం. ఈ విషయం వారి తల్లి దండ్రులకి కూడా తెలియచేస్తాను.’ అని అనడంతో
‘మరి ముగ్గురూ అ పనులు చేస్తేనో.అప్పుడు ఎవరికివ్వాలి’ అనుమానం వ్యక్తం చేసాడు ఇంగ్లీష్ మాష్టారు.
‘అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం’ అన్నాడు మాధవరావు.
‘అలాగే! మీరు చెప్పినట్టే చేద్దాం’ అని అందరూ ఏకీభవించారు. ఈ విషయాన్ని రాజు, రాము, గోపీలకు వారి తల్లిదండ్రులకు తెలియచేసాడు మాధవరావు. వారం రోజులు గడిచింది.
తోటి ఉపాధ్యాయులతో మాధవరావు సమావేశం ఏర్పాటు చేసాడు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతూ
‘మనం అనుకున్నట్టుగానే ముగ్గురు విద్యార్థులు మూడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రాము మాత్రమే ఉత్తమ విద్యార్థికి అర్హత సాధించాడు’ అని అన్నాడు.
‘ముగ్గురు హాజరైతే రాము ఒక్కడే ఎలా అర్హత సాధించాడు సార్’ కుతూహలంతో అడిగారు అందరూ.
‘నాకు నాటకాలు పిచ్చి ఉందని మీకందరికి తెలుసు. ఆయా శాఖల నిర్వాహకుల అనుమతితో మొదటగా ఉద్యానవనంలో తోటమాలి వేషంలో వారం రోజులు ఉదయం వెళ్ళాను.
అక్కడకి వచ్చిన ముగ్గురులో రాజు, గోపి కాసేపు ఆటలు ఆడుకున్నారు. కాని రాము మాత్రం మొక్కలకి నీళ్ళుపోస్తూ, వచ్చిన సందర్శకులతో ఆత్మీయంగా మెలిగారు. మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో వృద్ధుడి వేషంలో వెళ్ళి భోజనాల మధ్యలో కూర్చున్నాను. ముగ్గురిలో రాజు, గోపి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. కాని రాము మాత్రం వృద్ధుల అందరికీ భోజనాలు పెడుతూ, అందరితో ప్రేమగా మాట్లాడుతూ గడిపాడు. సాయంత్రం అటెండర్ వేషంలో గ్రంధాలయానికి వెళ్ళాను. ముగ్గురిలో రాజు, గోపి సినిమా పత్రికలు చూసుకుంటూ కాలం గడిపారు. రాము మాత్రం కథలు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదువుతూ ముఖ్య మైన విషయాలను నోటు పుస్తకంలో రాసుకునేవాడు. బట్టీ పట్టి మార్కులు తెచ్చుకోవడం తెలివికీ, విలువలకి కొలమానం కాదు. వృద్ధుల పట్ల ప్రేమ, దయ, మొక్కలను పరిరక్షించడం పట్ల పర్యావరణంపై బాధ్యత, పుస్తకాలను విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలనే ఉత్సుకత చదువుతో పాటు విద్యార్థికి ఉండాలి. అవి రాములో ఉన్నాయని నేను ప్రత్యక్షంగా చూసాను. కనుక ఈ ఏడాది పాఠశాల ఉత్తమ విద్యార్థి రాము అని ప్రకటిస్తున్నాను’ అని చిరునవ్వుతో మాధవరావు చెప్పగానే సహ ఉపాధ్యాయులు అందరూ చప్పట్లుకొట్టారు.
వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ అండ్ పాఠశాల కమిటీ చైర్మన్ చేతులు మీదుగా ప్రధానోపాధ్యాయులు, సహ ఉపాధ్యాయులు రాముకి ఉత్తమ విద్యార్థి పురస్కారం అందచేశారు.
– కయ్యూరు బాలసుబ్రమణ్యం
94441791239