యథేచ్ఛగా లేటరైట్‌ తవ్వకాలు

భారీ వాహనాలతో తరలింపు
అధికార పార్టీ నాయకుని అండ!
చోద్యం చూస్తోన్న అధికార యంత్రాంగం
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : ఎర్ర బంగారంగా పేరొందిన కోట్ల విలువైన లేటరైట్‌ను మైనింగ్‌ మాఫియా ఇష్టానుసారం తవ్వుకుపోతోంది. దగ్గరుండి తవ్వకాలు చేయిస్తున్నది జిల్లాలో అధికారి పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తి కావడంతో అధికార యంత్రాంగం చేష్టలుడిగింది. ఇచ్చిన అనుమతులు ఎక్కడో, తవ్వుతున్నది ఎక్కడో గుర్తించి తేడా ఉంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన లేటరైట్‌ అక్రమ తవ్వకాలు టిడిపి కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయి. మైనింగ్‌ మాఫియాకు గతంలో వైసిపి అండగా ఉండగా, ఇప్పుడు టిడిపి అండగా నిలిస్తోంది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికిలద్దిలో జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడికి అన్‌ సర్వేడ్‌ ల్యాండ్‌లో 296.34 ఎకరాల్లో లేటరైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం 2041వ సంవత్సరం వరకు అనుమతులు మంజూరు చేసింది. ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో ఖనిజ తవ్వకాలకు గిరిజనేతరులకు అవకాశం లేకపోవడంతో గిరిజనుడైన లక్ష్మణరావును అడ్డంపెట్టుకొని మైనింగ్‌ మాఫియా రంగంలోకి దిగింది. పీసా, 1/70 చట్టాలను ఉల్లంఘించింది. గ్రామసభలు నిర్వహించి ఆమోదం పొందాలన్న నియమం పాటించలేదు. గత ప్రభుత్వ కాలంలో చెలరేగి తవ్వకాలు చేపట్టిన మైనింగ్‌ మాఫియాకు గిరిజనుల ప్రతిఘటన, న్యాయపరమైన సమస్యలతో తవ్వకాలకు కొంత ప్రతిబంధకం ఏర్పడింది. ప్రభుత్వం మారడంతో మైనింగ్‌ మాఫియా కూడా మారింది. గత ప్రభుత్వానికి అనుకూలురైన వ్యాపారుల స్థానంలో ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో మెలిగే మైనింగ్‌ వ్యాపారులు తవ్వకాలు చేస్తున్నారు. నర్సీపట్నానికి చెందిన ఒక వ్యాపారి ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. రెవెన్యూ, అటవీ శాఖ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులెవరిలోనూ లేటరైట్‌ అక్రమ తవ్వకాలపై చలనం లేకుండా ఉంది. లేటరైట్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉంది. అక్రమ రవాణా కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మీదుగా సాగుతోంది. రోజుకు కనీసం రెండు వేల టన్నులకుపైగా లేటరైట్‌ను యంత్రాలతో తవ్వి, భారీ వాహనాల్లో రౌతులపూడి మండలం జలదం వద్ద ఏర్పాటు చేసిన క్రషింగ్‌ ప్రదేశానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి రావికంపాడు రైల్వే స్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వేర్వేరు మార్గాల్లో పంపిస్తున్నారు. లేటరైట్‌ తవ్వకాల లీజు వసూలు వివరాలు, రాయల్టీ కింద జమైన డబ్బుల వివరాలు గనులు, భూగర్భ శాఖ నర్సీపట్నం డివిజన్‌ కార్యాలయంలో అందుబాటులో లేవు. ప్రస్తుతం లేటరైట్‌ తవ్వుతున్న నాగులకొండ నుంచి లేటరైట్‌ క్రషింగ్‌ ప్రదేశం జలదం వరకు అటవీ శాఖ అనుమతుల్లేకుండా చెట్లు నరికి భారీ రహదారి ఏర్పాటు చేసుకున్నా అటవీ శాఖాధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. లేటరైట్‌ తవ్వకాల ఫీజు, రాయల్టీ విషయమై గనులు, భూగర్భశాఖ నర్సీపట్నం డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివాజీని ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా హెక్టార్‌కు ఏడాదికి రూ.26 వేలు, రాయల్టీ కింద టన్ను ఒక్కంటికీ రూ.150 చొప్పున రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చెల్లిస్తుండడంతో ఆ వివరాలు తమవద్ద లేవని చెప్పారు. లేటరైట్‌ తవ్వకాలతో తమకు సంబంధంలేదని, అనుమతులు ఇవ్వడం వరకే తమ పని అని తెలిపారు.

➡️