అదాని పవర్ ప్లాంట్ బాధితుల గోడు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ‘మా బతులకు మమ్మల్ని బతకనివ్వండి… ఇన్నాళ్లూ రోడ్లు, వైద్యారోగ్యం, బడి, గుడి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదీ లేకపోయినా మా కాయకష్టంతో ఎలాగోలా బతుకీడ్చుకొచ్చాం. చివరికి పండించిన తిండిగింజలు కిందికి తెచ్చుకోవడానికిగానీ, పెబుత్తం ఇచ్చిన కోటా బియ్యం కొండపైకి తీసుకెళ్లడానికిగానీ, దారి, రవాణా సదుపాయాలు కల్పించకపోయినా మేము పెబుత్తంపై ఆధారపడలేదు. ఎవరో పవర్ ప్లాంట్ పెట్టుకోవడం కోసం మా బతులు లేకుండా చేస్తామంటే ఎలా?’
ఇదీ .. విజయనగరం జిల్లా వేపాడ మండలం కరకవలస పంచాయతీ పరిధిలోని పాత మారిక, కొత్త మారిక సహా అదే పేరుతో ఉన్న అనేక గిరిజన గూడేల ప్రజానీకం ఆవేదన. గిరిశిఖర గ్రామాల్లోని మారిక గూడేల్లోనూ, గిరిజనుల పంట భూముల్లోనూ అదానీకి చెందిన ఓపెన్ లూప్ పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భీతిల్లిన గిరిజనులంతా సిపిఎం అండతో ధర్నాలు, వంటా-వార్పు, ప్రదర్శనలు వంటి రూపాల్లో నిరసనలు తెలియజేస్తుండడం విదితమే. ఈ నేపథ్యంలో పాత, కొత్త మారిక గ్రామాలను ‘ప్రజాశక్తి’ సందర్శించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఎవరైనా వస్తే చావోరేవో తేల్చుకుంటామంటూ గిరిజన యువకులు తెగేసి చెబుతున్నారు. కరకవలస పంచాయతీ కేంద్రం నుంచి మారిక గూడేలను చేరుకోవాలంటే సుమారు పది నుంచి 14 కిలోమీటర్ల మేర నాలుగు గిరిశిఖరాలను దాటుకుంటూ వెళ్లాలి. దట్టమైన అటవీ ప్రాంతంలో ముళ్లపొదలను, చెట్టూ చేమలను పక్కకు నెట్టుకుంటూ అత్యంత సాహసంతోనే చేరుకోవాలి. తాము పండించిన జన్నలు, కొర్రలు, అవిశలు వంటి చిరుధాన్యాలు, కూరగాయలను గిరిజనులు అష్టకష్టాలు పడుతూ కిందికి తెచ్చేవారు. తీరా కిందికి దిగాక మైదాన ప్రాంతం ప్రారంభంలోనే దళారులు రంగప్రవేశం చేసి ఆయా వ్యవసాయ ఉత్పత్తులను కారుచౌకగా కొట్టేసేవారు. వచ్చిన కాస్త సొమ్ముతో నూనె, ఉప్పు వంటి రెండు మూడు రకాల సరుకులతో వెనుదిరగడం గిరిజనులకు సర్వసాధారణమైంది. కొండలు, గుట్టలు దాటుకుంటూ ముందుకు సాగడమంటే మాటలు కాదు. జ్వరమో, జబ్బో వస్తే పసర మందులే దిక్కు!. ఆస్పత్రి సదుపాయం లేదు. కిందికి దిగాలంటే కనీసం డోలీ మోతకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఏ మాత్రమూ ఆధారపడకుండా అక్కడి గిరిజనులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. సిపిఎం నాయకత్వంలో ఏళ్ల తరబడి చేసిన పోరాట ఫలితంగా రూ.7 కోట్లతో రోడ్డు మంజూరు చేసినప్పటికీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అదానికి చెందిన పవర్ ప్లాంట్ కోసం ఈ ప్రాంతంలోని సుమారు 214 ఎకరాల భూమిని గుర్తించి నోటిఫై చేయడం గిరిజనులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆ గిరిజన గూడేలను సందర్శించిన సందర్భంగానూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అడవి తల్లి నుంచి తమను దూరం చేస్తే బతకలేమంటూ కన్నీరుమున్నీరయ్యారు. వచ్చినవారిని విల్లంబులతో ఎదుర్కోవడం తప్ప తమకు మరో దారి తెలియదని తెలిపారు. పేనాలు పోయినా తమ ప్రాంతాన్ని వదులుకునేది లేదని అర్జున్ అనే గిరిజన యువకుడు ‘ప్రజాశక్తి’కి చెప్పాడు.
పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా తీర్మానిస్తాం
మారిక ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెట్టడం అంటే అడవి నుంచి మమ్మల్ని దూరం చేయడమే. దీన్ని ఏ మాత్రమూ సహించేది లేదు. గ్రామ సర్పంచ్గా ఉన్న నాకుగానీ, నా ప్రజలకుగానీ మాట వరుసకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ భూములు దోచుకునేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసినట్టు పత్రికల్లో వచ్చిన వరకు,, సిపిఎం నాయకులు చెప్పినంత వరకు మాకు తెలియదు. కేవలం మా పంచాయతీలోని గిరిజనులను మాత్రమే కాదు, అడవిపై ఆధారపడిన గిరిజనులందరినీ ఐక్యం చేసి, ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటాం. ఇందుకోసం పవర్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ గ్రామ సభలో తీర్మానిస్తాం.
– పాతబోయిన పెంటమ్మ, సర్పంచ్, కరకవలస
చాలా రోజులుగానే కుట్ర
మా గ్రామాలను, జీవనాధారంగా ఉన్న మారిక కొండ ప్రాంతాన్ని కాజేసేందుకు ప్రభుత్వం చాలా రోజులుగా కుట్ర చేస్తోంది. ఏడాది క్రితమే మా గ్రామానికి పడమట దిక్కున ఉన్న శారదా నది వైపున కొంతమంది సర్వే చేశారు. అప్పట్లో మేము హెచ్చరించడంతో వెనుదిరిగారు. ఇప్పుడు మాకు తెలియకుండా అధికారుల ద్వారా నోటిఫికేషన్ జారీ చేయించారు. ప్రభుత్వ కుట్రను సాగనివ్వం.
– పల్లి సోమేష్, మారిక గ్రామం