రాయనపాడు రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ

  • రూ.12.13 కోట్లతో అభివృద్ధి
  • 58 శాతం పనులు పూర్తి

ప్రజాశక్తి- ఇబ్రహీంపట్నం : ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాయనపాడు రైల్వేస్టేషన్‌ అబివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని ఈ రైల్వేస్టేషన్‌ 1899లో ప్రారంభమైంది. దీనిని 1980-81 మధ్య కాలంలో పూర్తి స్థాయిలో విద్యుద్దీకరించారు. అప్పటి నుండి ప్రయాణికులకు విస్తృత సేవలందిస్తోంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పధకం కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 53 రైల్వేస్టేషన్లను రూ.20,061 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా రాయనపాడు రైల్వే స్టేషన్లో రూ.12.13 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌కు శాటిలైట్‌ స్టేషన్లుగా రాయనపాడు, మధురా నగర్‌, గుణదల, రామవరప్పాడు, కృష్ణా కెనాల్‌ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ బైపాస్‌ స్టేషన్‌గా రాయనపాడు స్టేషన్‌కు పేరుంది. దీంతో, విజయవాడకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్లో మొత్తం 22 రైళ్లు ఆగేలా చర్యలు చేపట్టనున్నారు. స్టేషన్‌ ఆధునీకరణలు భాగంగా మూడు ఫ్లాట్‌ ఫారాలతో ఎన్‌ఎస్‌జి 5 కేటగిరి రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ రద్దీ (రైళ్ల రాకపోకలు)ని మెరుగుపర్చడం, స్టేషన్‌ను సుందరీకరించడం, ప్రదేశ ద్వారం వద్ద వరండా ఏర్పాటు, వికలాంగులకు అనుకూలమైన టాయిలెట్ల ఏర్పాటు, స్టేషన్‌ భవనంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఎసి వెయిటింగ్‌ హాలు, పార్కింగ్‌ స్థలం ఏర్పాటు, ప్లాట్‌ ఫారాలను మెరుగుపర్చడం, షెల్టర్‌ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే సంప్రదాయ కొండపల్లి బొమ్మలతో కూడిన ఛాయాచిత్రాలతో స్టేషన్‌కు అద్భుతంగా తీర్చిదిద్దారు. కవర్‌ ఓవర్‌ (సిఒపి) నిర్మాణంతో సహా ఒక ప్లాట్‌ ఫారాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. షెల్టర్లు, ప్లాట్‌ ఫామ్‌ ఉపరితలం, వెయిటింగ్‌ హాలు, మాడ్యులర్‌ టాయిలెట్‌ ముఖ భాగం, సర్కులేటింగ్‌ ఏరియా, లిఫ్ట్‌ ఏర్పాటు తదితర పనులు 58 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

స్టేషన్‌ మాస్టర్‌, లోకో పైలెట్లు, గార్డులకు క్యాబిన్లు లేక ఇక్కట్లు

అభివృద్ధి పనులు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. స్టేషన్‌ మాస్టర్‌ క్యాబిన్‌, లోకో పైలట్‌, గార్డులకు గదులు కేటాయించలేదు. దీంతో, విధుల నిర్వహణలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి విధుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పనులు పూర్తయ్యే క్రమంలో స్టేషన్‌ మాస్టర్‌ క్యాబిన్‌, లోకో పైలట్‌, ఇతర సిబ్బందికి ప్రత్యేక క్యాబిన్లు నూతనంగా నిర్మిస్తారా? లేక పాత క్యాబిన్లలో ఏర్పాట్లు చేస్తారా? అనేది రైల్వే అధికారులు స్పష్టం చేయడం లేదు. నిత్యం ప్రజలకు సేవలందించే తమకు సరైన వసతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు.

మే 2న ప్రారంభోత్సవం?

2017-18, 2022-23 లలో భారతీయ రైల్వేస్టేషన్ల పునర్విభజన ఆధారంగా ఆదాయం, బాహ్య ప్రయాణికుల నిర్వహణపరంగా రాయనపాడును నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌ (ఎన్‌ఎస్‌జీ)-6 రైల్వేస్టేషన్‌గా గుర్తించారు. సుమారు కోటి రూపాయలు ఆదాయం గడిస్తూ ఒక మిలియన్‌ ప్రయాణికులకు సేవలందిస్తోంది. మే 2న రాజధాని అమరావతి పున:ర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాయనపాడు రైల్వేస్టేషన్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

➡️