కృష్ణాడెల్టాలో ప్రతిపాదిత పనులకు లభించని ఆమోదం
ఆందోళనలో రైతాంగం
ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : కృష్ణాడెల్టాలో కాల్వలు, డ్రెయిన్లు ఆధ్వానంగా మారాయి. వీటిల్లో తూడు, గుర్రపుడెక్క పెద్దఎత్తున పేరుకుపోయింది. నిర్వహణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడం సమస్యగా మారింది. అధికారులు రెండు నెలల క్రితం పంపిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం లభించలేదు. సకాలంలో నీరు విడుదల చేసినా కాల్వల ఎగువ ప్రాంతాలకు మాత్రమే నీరు అందుతుందని, శివారు భూముల్లో నాట్లు వేయడానికి ఆలస్యం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బందరు కాల్వ 1.51 లక్షల ఎకరాలకు, కృష్ణా ఈస్ట్రన్ డెల్టా కెనాల్ (కెఇబి) 1.38 లక్షల ఎకరాలకు, ఏలూరు కాల్వ 0.56 లక్షల ఎకరాలకు, రైవస్ 2.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. మొత్తం డెల్టాలోని 5.62 లక్షల ఎకరాలకు ప్రధాన కాల్వలు, వాటి ఉప కాల్వల ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ఈ ఏడాది సకాలంలో కాల్వలు, డ్రెయిన్ల నిర్వహణా పనులు పూర్తి చేయకపోవడంతో రైతులు ఆందోళన చెబుతున్నారు. వీటి పనులకు ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదు. కెసి డివిజన్లో 144 పనులకు రూ.7.48 కోట్లు, కెఇ డివిజన్లో 121 పనులకు రూ.8.45 కోట్లు, స్పెషల్ డివిజన్లో 15 పనులకు రూ.1.30 కోట్లు, డ్రెయిన్లపై 304 పనులకు రూ.తొమ్మిది కోట్ల మేర ప్రతిపాదలను జనవనరుల శాఖ రెండు నెలల క్రితం ప్రభుత్వానికి పంపింది. అయితే ఆ ప్రతిపాదలను ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు.
నామినేషన్ పద్ధతిలో పనులు !
ప్రస్తుత సీజన్ జూన్లో పంటల సాగుకు నీరు విడుదల చేసేలా చూస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కాల్వల నిర్వహణ పనులకు వేసవి కాలం అనుకూలమైనది. అయితే మే 10వ తేదీ వచ్చినా కాల్వల మరమ్మతులకు ఆమోదం లభించలేదు. మొత్తం రూ.26.23 కోట్ల విలువైన పనులకు ఎటువంటి టెండర్లూ పిలవడం లేదు. ప్రజాప్రతినిధులు సూచించిన వారికి నామినేషన్ పద్ధతిలోనే కేటాయిస్తున్నారు.
కాల్వలకు నీరు విడుదలవ్వక ముందు, వర్షాలు కురువక ముందు పనులు పూర్తి చేస్తే ఆ పనుల నాణ్యతను పరిశీలించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే ఆలస్యం కావ్వడంతో హడావుడిగా చివరి నిమిషంలో పనులు చేపట్టి తూతూమంత్రంగా మమ అనిపిస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నీరు పారేదెలా?
కాల్వల కనీస నిర్వహణ పనులు సకాలంలో జరగకపోవడంతో ప్రతి ఏటా రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జూన్ చివరి వారంలో కాల్వలకు నీరు విడుదలైనా శివారు భూముల్లో సెప్టెంబర్ మొదటి వారానికి ఆలస్యంగా వరి నాట్లు వేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుకోవాల్సి వస్తుండడంతో రైతులకు అదనపు భారం పడుతోంది. ఈఏడాది ప్రధాన కాల్వలతోపాటు ఉప కాల్వలు గుర్రపుడెక్క, తూడు, మట్టితో పూడిపోయాయి. వేసవి సీజన్లో తాగునీటి చెరువులు నింపడమే గగనంగా మారింది. గ్రామ పంచాయతీల వారు ఎక్కడికక్కడ విద్యుత్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకుని కాల్వల్లోని నీటిని తోడి చెరువులు నింపారు. ఈ పరిస్థితుల్లో సకాలంలో డెల్టాకు సాగునీరు అందడంపై రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాల్వల మరమ్మతులు చేపట్టాలని పలువురు రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)లో వినతులు సమర్పించారు.