ముంచేస్తున్న నాసిరకం మొక్కలు !

Apr 22,2025 09:09 #Poor plants are drowning!
  • అనుమతుల్లేని నర్సరీలు స్పందించని అధికారులు

ప్రజాశక్తి -గంగవరం : చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలో అనుమతులు లేని నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కర్ణాటకలోని మంచి బ్రాండెడ్‌ విత్తనాల పేరుతో నాసిరకం మొక్కలు విక్రయిస్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. కనీసం లైసెన్సులు కూడా లేని నర్సరీలు మాయమాటలతో నాసిరకం మొక్కలు రైతులకు అంటగట్టి వేల రూపాయల నష్టం కలిగించి రైతుల జీవితాలను అంధకారం చేస్తున్నాయి. నాసిరకం నర్సరీలపై నిఘా వుంచాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంచేస్తున్న నాసిరకం మొక్కలు
గంగవరం పరిదిలోనిó పుంగనూరు – పలమనేరు రహదారిలో ఒక కిలోమీటరు దూరంలోనే పది నర్సరీలు, ఏడు కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 నర్సరీలు వున్నాయి. ఈ నర్సరీలలో గోసు, వంకాయ, మిరప, కాలీఫ్లవర్‌, బొప్పాయి, టమాటా మొక్కలు విక్రయిస్తున్నారు. వీటిని నర్సరీ నిర్వాహకులు కర్ణాటక నుంచి మంచి బ్రాండెడ్‌ విత్తనాలు తెచ్చి మొక్కలు పెంచి ఇస్తున్నామని నమ్మించి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. కూరగాయల పంటలు పండించడానికి గతంలో రైతులు తమంతట తాము విత్తనాలతో నార్లు పోసుకొని పక్వానికి వచ్చిన తర్వాత పొలాల్లో రకరకాల కూరగాయల పంటలు పండించేవారు.
ప్రస్తుతం ఊరుకో నర్సరీ కావడంతో నర్సరీ నిర్వాహకులు నాసిరకం విత్తనాల తెచ్చి ఆ విత్తనాలకు రకరకాల పేర్లతో మొక్కలు తయారుచేసి రైతులకు విక్రయిస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేవు. లక్షల రూపాయలు ఆదాయం ఆర్జిస్తున్నా ప్రభుత్వానికి ఎలాంటి రుసుం చెల్లించడంలేదని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రైతులువాపోతున్నారు.

యథేచ్ఛగా అనుమతుల్లేని నర్సరీలు
గంగవరం మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో సుమారు 15 నర్సరీలు వున్నాయి. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన మంచి బ్రాండెడ్‌ విత్తనాలతో పెంచిన మొక్కలు విక్రయిస్తున్నామని నమ్మిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ నర్సరీలకు లైసెన్సులు కూడా లేవని, గత ప్రభుత్వంలో లైసెన్సులు తీసుకోవాలని హెచ్చరించినా ఖాతరు చేయలేదని రైతులు వాపోతున్నారు. వీటిపై సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు వేల రూపాయల నష్టం
రైతులు ఒక్కో మొక్క రూపాయి నుండి ఐదు రూపాయల వరకు పెట్టుబడి పెట్టి పొలాల్లో నాటిన తర్వాత వంద మొక్కలకు కనీసం 40 శాతం వరకు చనిపోతున్నాయని, మళ్లీ వాటి స్థానంలో మొక్కలు నాటినా పంట ఒక్కసారిగా రాకపోగా కొన్ని మొక్కలు పూత దశలో కొంత భాగం, పంట పూర్తి దశలో మరి కొంత భాగం కోల్పోయి రకరకాలుగా వేల రూపాయల్లో తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం నర్సరీలలో టమాటా, మిరప, వంకాయ, క్యాలీఫ్లవర్‌, గోసు, బొప్పాయి, తదితర కూరగాయల మొక్కలు పెంచి విక్రయిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ఈ నాసిరకం మొక్కలు నాటి కష్టాలు పాలు కావాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 శాతం మొక్కలు చనిపోయాయి
నేను రెండు ఎకరాలలో కాలీఫ్లవర్‌ నాటాను. అందులో 40 శాతం మొక్కలు చని పోయాయి. ఆ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలతో అల్లుకుపోయింది. ఈ విషయాన్ని నర్సరీ వారిని అడిగితే మీరు వాటికి సక్రమంగా నీరు అందిం చడం లేదు.. ఎక్కువగా క్రిమి సంహారక మందులు వాడడంతోనే అలా అయిందని బెదిరిస్తున్నారు.. అయితే నాసిరకం విత్తనాలతోనే ఈ సమస్య వచ్చింది.. –  వెంకటరమణ, రైతు

➡️