కుదింపే లక్ష్యమా?

  • విశాఖ ఉక్కుపై కేంద్రం రేషనలైజేషన్‌ కత్తి
  • 9,510 మంది సరిపోతారన్న కేంద్ర మంత్రి
  • ప్రస్తుతం విధుల్లో 13,460 మంది సిబ్బంది

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందా? విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి కార్మికులు ఏళ్లతరబడి నిరంతరాయంగా సాగిస్తున్న పోరాటం అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. కార్మికులను చీల్చడానికి, నయానా, భయానా లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తాజాగా సిబ్బంది సంఖ్యను గణనీయంగా కుదించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భైపతిరాజు శ్రీనివాస్‌ వర్మ ఇటీవల పార్లమెంటులో ఇచ్చిన జవాబుకూడా ఈ భయాలను మరింత తీవ్రం చేసేదిగా ఉండటం గమనార్హం. గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశంలో విక్రమ్‌జిత్‌ సింగ్‌ అనే రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు పలు విషయాలను మంత్రి శ్రీనివాస్‌ వర్మ ప్రస్తావించారు. పబ్లిక్‌ రంగ సంస్థల్లో సిబ్బంది వివరాలు, ఖాళీల భర్తీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో వివిధ సంస్థల్లోని స్థితి గతులను మంత్రి పేర్కొన్నారు. అయితే, ఒక్క విశాఖ
ఉక్కు విషయంలోనే రేషనలైజేషన్‌ను ప్రస్తావించిన కేంద్ర మంత్రి ప్లాంటు నిర్వహణకు 9,510 మంది సరిపోతారని చెప్పారు. ప్రస్తుతం 13,460 మంది విధులు నిర్వహిస్తున్నారని కూడా ఆ సమాధానంలోనే ఆయన తెలిపారు. దీంతో సిబ్బంది సంఖ్యను కుదించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆందోళనలు నెలకొన్నాయి.

మంత్రి ఏం చెప్పారు…?

విశాఖ ఉక్కుకు మంజూరైన సిబ్బంది, ప్రస్తుతం ఉన్న సిబ్బంది, జరిగిన రిక్రూట్‌మెంట్ల వివరాలను టేబుల్‌ రూపంలో అందచేశారు. ఆ టేబుల్‌ కిందనే విశాఖ ఉక్కు పరిశ్రమలో రేషనలైజేషన్‌ కోసం ఒక అధ్యయనాన్ని నిర్వహించినట్లు, ఆ అధ్యయనంలో 7.3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తికి 9,510 మంది కార్మికులు (ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌)లు సనిపోతారని తేలినట్లు పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌లు 2,561 మంది, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు 6,949 మంది సరిపోతారని కూడా ఆయన వివరించారు. మంత్రి ఇచ్చిన లెక్కల ప్రకారమే ప్రస్తుతం జనరల్‌ విభాగంలో 2,338 మంది, ఇతరుల్లో 2028 మంది ఎగ్జిక్యూటివ్స్‌ విధులు నిర్వహిస్తున్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ జనరల్‌ విభాగంలో 4,997 మంది, ఇతరుల్లో 4077 మంది ఉన్నారు. మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం రెండు విభాగాల్లోనూ కోత పడనుంది. మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారమే ఈ ఏడాది 19,795 మంది సిబ్బంది విశాఖ ఉక్కుకు మంజూరయ్యారు. దీంతో పోల్చుకుంటే వేల సంఖ్యలో పోస్టులు ఖాళీఉన్నట్లు ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. అయితే, ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను మంత్రి తన సమాధానంలో సున్నాగా చూపించారు. దీంతో ఈ ఏడాది పోస్టుల భర్తీ ఉండదని తేలిపోయింది. దాంతో పాటు రేషన్‌లైజేషన్‌ను ప్రస్తావించడంతో ఉన్న సిబ్బందిలోనూ కోత పెట్టనున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

➡️