- అయోమయంలో మిర్చి రైతులు
- ధర తగ్గినా కొరవడిన చేయూత
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : యార్డుకు తీసుకువచ్చి మిర్చిని విక్రయించే ప్రక్రియలో తొలి దశ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. వేసవి దృష్ట్యా ఈ నెల 12 నుంచి జూన్ 9 వరకు గుంటూరు మిర్చి యార్డుకు అధికారులు సెలవులు ప్రకటించారు. క్వింటాలు మిర్చి ధర రూ.11,781 కన్నా తగ్గితే కేంద్రం సాయం చేస్తుందని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. గత నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో మిర్చి రైతులకు క్వింటాలుకు కనిష్టంగా రూ.తొమ్మిది వేలు, గరిష్టంగా రూ.13 వేలు వచ్చింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.11,781 కన్నా ధర తగ్గితే సంబంధిత తేడా సొమ్ము ఇస్తామని ప్రకటించినా ఒక్క రైతుకు కూడా సాయం అందించలేదు.
రోజుకు సగటున లక్ష టిక్కిలకు పైగా విక్రయించిన రైతుల్లో 60 శాతం మందికి రూ.10 వేల లోపు ధర లభించింది. మిగతా 40 శాతం మంది రైతులకు గరిష్టంగా రూ.13 వేల వరకు ధర లభించింది. రాష్ట్రంలో 2024-25 ఖరీఫ్ సీజన్లో 4,32,500 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. సగటు ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు వచ్చింది. పెట్టుబడిలోనే ఎకరాకు రూ.50 వేల నుంచి లక్ష వరకు నష్టం వాటిల్లింది. 2023-24 సీజన్లో డిసెంబరు నుంచి మే నెల వరకు 98.63 లక్షల బస్తాల మిర్చి యార్డుకు రాగా 2024 డిసెంబరు నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 1.05 కోట్ల మిర్చి బస్తాల సరుకు యార్డుకు వచ్చింది. కానీ గత ఏడాది సగటు ధర రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ఉండగా ఈ ఏడాది రూ.9 వేలనుంచి రూ.13 వేల వరకు ఉండటంతో రైతులకు క్వింటాలుకు కనిష్టంగా రూ.ఐదు వేలు, గరిష్టంగా రూ.10 వేల వరకు నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన ధర రూ.11,781 కన్నా తక్కువ ధరకు వస్తే తాము ఈ ధరకు రైతుల నుంచి 25 శాతం దిగుబడులు కొంటామని ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వం రూపాయి సాయం చేయలేదు. క్వింటా మిర్చి కొనుగోలు చేయలేదు. ప్రకటించిన సాయం అందించకుండానే తొలి విడత సీజన్ ముగియడంతో రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతులు పలుమార్లు ఆందోళన చేసినా, రైతు సంఘాల వారు వినతులు వచ్చినా ప్రభుత్వం కనీసం స్పందించలేదు.