షమీకి చోటు

  • 14 నెలల తర్వాత రీ ఎంట్రీ
  • ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టి20 సిరీస్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) జట్టును ప్రకటించింది. బిసిసిఐ శనివారం ప్రకటించిన 15మంది ఆటగాళ్ల జాబితాలో టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి చోటు దక్కింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ ఎంపికయ్యారు. ఇంగ్లండ్‌తో ఈనెల 22న ఐదు టి20ల సిరీస్‌ జరుగనుంది. బిసిసిఐ ప్రకటించిన జట్టులో పేసర్‌ షమీ 14 నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి చేరాడు. నవంబర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్‌ తరఫున బరిలోకి దిగాడు. దాదాపు 43 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. సయ్యద్‌ ముష్తాక్‌ అలీ ట్రోఫీలో షమీ తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో బరోడాపై రెండు వికెట్ల పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న విజరు హజారే ట్రోఫీలో మూడు మ్యాచులు ఆడి.. ఐదు వికెట్ల తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న షమీని ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత ఎంపిక చేస్తారని భావించినా చోటు దక్కలేదు. తాజాగా సెలెక్టర్లు వైద్య బృందంతో చర్చించి తిరిగి జాతీయ జట్టులోకి తీసుకున్నారు. మహ్మద్‌ షమీ చీలమండ గాయం కారణంగా నవంబర్‌ 2023 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. టి20 ప్రపంచకప్‌ తర్వాత ప్రపంచకప్‌ షమీ.. గాయంతో జట్టుకు దూరంగా ఉంటున్నాడు. 23 టి20ల్లో 24 వికెట్లు పడగొట్టాడు.

జట్టు: సూర్యకుమార్‌(కెప్టెన్‌), సంజు, జురెల్‌(వికెట్‌ కీపర్లు), అభిషేక్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌, రింకు సింగ్‌, నితీశ్‌ రెడ్డి, అక్షర్‌(వైస్‌ కెప్టెన్‌), హర్షీత్‌ రాణా, ఆర్ష్‌దీప్‌, షమీ, వరుణ్‌ చక్రవర్తి, బిష్ణోరు, సుందర్‌.

➡️