Olympics: క్వార్టర్‌ ఫైనల్‌ మరో భారత రెజ్లర్‌

పారిస్ : పారిస్ ఒలింపిక్స్‌ -2024లో శనివారం జరిగిన మహిళల 76 కిలోల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో మరో భారత రెజ్లర్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. భారత రెజ్లర్ రీతికా హుడా చక్కనైన ప్రదర్శనతో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని ఓడించింది. రెండో రౌండ్‌లో 29 సెకన్లు మిగిలి ఉండగానే రిఫరీ ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో రితికా హుడాను విజేతగా ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం జరిగిన బౌట్‌లో బెర్నాడెట్‌పై 12-2తేడాతో రితికా పైచేయి సాధించింది. దీంతో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిని అమలు చేశారు. ఇద్దరు రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే.. రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి.. పది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా తేలుస్తారు. క్వార్టర్‌ ఫైనల్లో రితిక.. కిర్గిస్తాన్‌కు చెందిన ఐపెరి మెడిట్‌ కిజీతో తలపడనుంది.

➡️