Asian Champions Trophy : అదరగొట్టిన అమ్మాయిలు

Nov 21,2024 00:25 #Hockey, #Sports, #women's
  • ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత భారత్‌
  • ఫైనల్లో చైనాపై గెలుపు

రాజ్‌గిర్‌(బీహార్‌): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని మరోసారి ముద్దాడింది. బిహార్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారతజట్టు బుధవారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో చైనాను 1-0తో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను మూడో క్వార్టర్‌లో దీపిక కుమారి చేసింది. 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. భారత్‌కు చైనా గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి రెండు క్వార్ట్స్‌లో ఇరుజట్లు గోల్స్‌ చేయలేకపోయాయి. అయితే, మూడో క్వార్టర్స్‌లో దీపికా గోల్‌ చేసి భారత్‌ను ఆధిత్యంలో వెళ్లేలా చేసింది. ఈ టోర్నీలో దీపికకు ఇది 11వ గోల ్‌కావడం విశేషం. గతేడాది రాంచీలో 2016లో సింగపూర్‌లో ఈ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు అద్భుతంగా సమన్వయం చేస్తూ చైనాను నిలువరించింది. తొలి అర్ధభాగంలో ఎలాంటి గోల్‌ చేయకపోయినా.. ద్వితీయార్థం తొలి నిమిషంలో దీపికా పెనాల్టీ కార్నర్‌లో గోల్‌ చేసి అభిమానుల్లో జోష్‌ నింపింది. మూడో క్వార్టర్‌లోనే భారత్‌కు ఆధిక్యాన్ని రెట్టింపు చేసే సువర్ణావకాశం లభించింది. అయితే 42వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో దీపిక కొట్టిన షాట్‌ను చైనా గోల్‌కీపర్‌ కుడివైపు డైవ్‌ చేసి కాపాడింది. మూడో క్వార్టర్‌లో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించినా.. గోల్‌గా మలచలేకపోయారు. అయితే, మ్యాచ్‌ చివరలో మరోసారి భారత క్రీడాకారులు తడబడ్డారు. జపాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో 16 పెనాల్టీ కార్నర్‌లో ఒక్క దాన్ని కూడా గోల్స్‌గా మలచలేకపోయిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో మొదటి 30 నిమిషాల్లోనూ నాలుగు పెనాల్టీ కార్నర్‌ వృథా అయ్యాయి. పెనాల్టీ కార్నర్‌లో గోల్‌ సాధించడం భారత్‌కు బలహీనంగా మారింది. ఈ టైటిల్‌ను భారత్‌ చేజిక్కించుకోవడం ఇది మూడోసారి. దక్షిణ కొరియా జట్టు కూడా గతంలో మూడుసార్లు విజేతగా నిలిచింది. మూడోస్థానం కోసం మలేషియాతో జరిగిన పోరులో జపాన్‌ జట్టు 4-1 గోల్స్‌తో గెలిచింది.
టైటిల్‌ విజేతగా నిలిచిన భారతజట్టు ఆటగాళ్లకు బీహార్‌ ప్రభుత్వం నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.3లక్షలు నగదు, సహాయ, ఇతర సిబ్బందికి రూ.1.50లక్షలు చొప్పున అందజేయనున్నట్లు హాకీ ఇండియా(హెచ్‌ఐ)కు ఓ ప్రకటనలో తెలిపింది.

➡️