సెమీస్‌కు ఆయుశ్‌, ఉన్నతి

May 10,2025 00:05 #Badminton Tournament, #for sports

తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
తైపీ సిటీ(చైనా): తైపీ ఓపెన్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీఫైనల్లోకి ఆయుశ్‌ శెట్టి, ఉన్నతి హుడా దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్‌ శెట్టి 16-21, 21-19, 21-14తో బి.యంగ్‌(కెనడా)పై చెమటోడ్చి నెగ్గాడు. ముఖ్యంగా రెండో గేమ్‌లో ఇరువురు షట్లర్లు ప్రతి పాయింట్‌ కోసం పోరాడారు. ఆ సెట్‌లో ఆయుశ్‌ చేజిక్కించుకొని.. మూడో గేమ్‌లో యంగ్‌కు ఆయుశ్‌ ముచ్చెమటలు పట్టించి ఆ గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి ఉన్నతి హుడా కూడా సంచలనం నమోదు చేసింది. తనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న తైపీకి చెందిన వై.యంగ్‌పై మూడుసెట్ల హోరాహోరీ పోరులో చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ గేమ్‌లో ఉన్నతి 21-8తో తొలి గేమ్‌ను చేజిక్కించుకొని.. రెండో గేమ్‌లో పోరాటాపోటీగా తలపడి 19-21తో ఆ సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 21-19తో చేజిక్కించుకొని సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఉన్నతి జపాన్‌కు చెందిన మియాజాకితో తలపడనుంది.

➡️