- వారం రోజులు : బిసిసిఐ
- 57మ్యాచ్లు పూర్తి.. 16మ్యాచ్లకు బ్రేక్
- డబ్బులు వాపస్ ఇస్తాం: ఫ్రాంచైజీలు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-18 వారం రోజులు వాయిదా పడింది. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపిఎల్ మిగిలిన మ్యాచ్లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ఐపిఎల్ పాలక మండలిలో చర్చించాం. ప్రసారకర్తలు, స్పాన్సరర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. మన సాయుధ బలగాల స్థైర్యం, సన్నద్ధతపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ.. అందరి అభిప్రాయాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐపిఎల్ తమ ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చింది. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని కొంతకాలం వాయిదా వేసినట్లు బిసిసిఐ అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం లక్నో వేదికగా లక్నో-బెంగళూరు జట్ల మధ్య ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. ధర్మశాల వేదికగా ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ కూడా అర్ధాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచులు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, మే 25న కోల్కతా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 57 లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
డబ్బులు రీఫండ్ చేస్తాం: సన్రైజర్స్
ఐపిఎల్ టోర్నమెంట్ను వారంరోజులు వాయిదా వేయడాన్ని అన్ని ఫ్రాంచైజీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ సహా పలు ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ వారం రోజుల్లో జరిగే మ్యాచ్ల టికెట్ డబ్బులను వాపస్ ఇస్తామని ఆయా ఫ్రాంచైజీలు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించాయి. మే 10న (శనివారం) ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్ టికెట్లు కొన్నవాళ్లకు డబ్బులు రీఫండ్ చేస్తాం’ అని ఆరెంజ్ ఆర్మీ తన పోస్ట్లో రాసుకొచ్చింది. అలాగే లక్నో-బెంగళూరు మధ్య లక్నోలోని ఏక్నా స్టేడియంలో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్కు సంబంధించి తిరిగి ఇచ్చేస్తామని ఆ ఫ్రాంచైజీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.