లాహోర్: పాకిస్తాన్ సూపర్ లీగ్(పిఎస్ఎల్)పై నీలినీడలు కమ్ముకున్నాయి. బుధవారం అర్ధరాత్రి రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరిగినట్లు సమాచారం. ఇక్కడే గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. బాబర్ ఆజం కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే, స్టేడియానికి దగ్గర్లోనే డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైన పాక్ బోర్డు.. క్రికెటర్లు రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు ఈ లీగ్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు.. భారత్-పాక్ పరస్పర దాడుల నేపథ్యంలో తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా చెప్పడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ప్రిమియర్ లీగ్ షెడ్యూల్ ప్రకారం సాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
