యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందన

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబును భారత యువ క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ సచివాలయంలో తనను కలిసిన నితీశ్‌ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) తరఫున ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీశ్‌కు చంద్రబాబు అందజేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేయడం ద్వారా తెలుగువారి సత్తాను నితీశ్‌ ప్రపంచానికి చాటారని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి లోకేశ్‌తో భేటీ: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో నితీశ్‌కుమార్‌ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. తెలుగువారి సత్తాను అంతర్జాతీయ వేదికలపై నితీశ్‌ చాటారని లోకేశ్‌ అభినందించారు. సన్మానించి, వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. క్రీడా పాలసీలో క్రికెట్‌ను చేర్చి, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నితీశ్‌ కోరారు.

➡️