విదేశీ గడ్డపై టెస్ట్ సిరీస్ సాధించిన తొలి మహిళా జట్టుగా రికార్డుల్లోకి
ఇంగ్లండ్తో ఏకైక టెస్ట్లో 270 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
లండన్: లార్డ్స్ టెస్టులో టీమిండియా అమ్మాయిలు ఇంగ్లండ్ను ఓడించి నయా చరిత్ర సృష్టించారు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న తొలి భారత జట్టుగా హర్మన్ ప్రీత్ సేన రికార్డుపుటల్లోకెక్కింది. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 136 పరుగులతో సోమవారం నాల్గోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు 186 పరుగులకు ఆలౌటైంది. 457 పరుగుల భారీ ఛేదనలో క్రాంతి గౌడ్(2/54).. సయాలీ సత్ఘరే(2/24)ల ధాటికి ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. కెరీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టమ్మీ బ్యూమంట్ డకౌట్ కాగా.. హీథర్ నైట్(13)లను ఔట్ చేసిన క్రాంతి విజయానికి పునాది వేసింది. మూడో రోజు పోరాడిన అమీ జోన్స్.. నాలుగోరోజు తొలి సెషన్లోనే ఔటవ్వగా.. టీమిండియా విజయం మరింత సులువైంది. తొలి సెషన్ మొదట్లోనే అమీ జోన్స్(54) వికెట్ తీసిన స్నేహ్ రాణా(4/42) ఆతిథ్య జట్టు ఓటమిని ఖాయం చేసింది. సోఫీ ఎకిల్స్టోన్(50)తో కలిసి ఎనిమిదో వికెట్కు 22పరుగులు జోడించిన ఇసీ వాంగ్(1)ను దీప్తి శర్మ బౌల్డ్ చేసింది. తర్వాతి ఓవర్లోనే లారెన్ బెల్(0)ను దీప్తి బౌల్డ్ చేయగా.. క్రీజులో కుదురుకున్న ఎకిల్స్టోన్ను రాణా ఔట్ చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ను 170 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో టీమిండియాకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించగా.. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 7వ వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్ కు 456 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 457 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అమీ జోన్స్, సోఫీ ఎక్లెస్టోన్ ఇద్దరు మాత్రమే అర్ధసెంచరీలతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు తీయగా.. సయాలీ, క్రాంతి, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీసిన క్రాంతి గౌడ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
స్కోర్బోర్డు...
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 285 పరుగులు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 170పరుగులు
ఇండియా రెండో ఇన్నింగ్స్ : 341/7డిక్లేర్డ్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బౌచర్ (ఎల్బి)సయాలీ 2, బ్యూమౌంట్ (బి)క్రాంత్ గాడ్ 0, హీథర్ నైట్ (సి)రీచా (బి)క్రాంతి గాడ్ 13, స్కీవర్ బ్రంట్ (బి)స్నేహ్ రాణా 11, కాప్సే (బి)సయాలీ సత్గైర్ 21, అమీ జోన్స్ (సి)షెఫాలీ వర్మ (బి)స్నేహ్ రాణా 54, మాడీ విల్లెర్స్ (సి)రీచా ఘోష్ (బి)స్నేహ్ రాణా 26, ఎక్లేస్టోన్ (బి)స్నేమ్ రాణా 50, వాంగ్ (బి)దీప్తి శర్మ 1, లారెన్ బెల్ (బి)దీప్తి శర్మ 0, లారెన్ ఫిలెర్ (నాటౌట్) 4, అదనం 4. (62.5ఓవర్లలో ఆలౌట్) 186పరుగులు.
వికెట్ల పతనం: 1/2, 2/6, 3/23, 4/34, 5/59, 6/126, 7/135, 8/157, 9/159, 10/186
బౌలింగ్: సయాలీ సత్గైర్ 10-2-24-2, క్రాంతిగాడ్ 11-0-54-2, స్నేహ్ రాణా 19.5-0-42-4, శ్రీచరణి 9-2-25-0, దీప్తి శర్మ 12-0-36-2, షెఫాలీ వర్మ 1-0-1-0.








కామెంట్లు (0)