హర్మన్‌ప్రీత్‌ సేనకు పరీక్ష

  • నేడు దక్షిణాఫ్రికా మహిళలతో చివరి లీగ్‌ మ్యాచ్‌
  • ముక్కోణపు సిరీస్‌

కొలంబో: ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళలజట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌ బుధవారం ఆడనుంది. టోర్నీలో భాగంగా తొలుత ఆడిన రెండు లీగ్‌ మ్యాచుల్లోనూ గెలిచి దాదాపు ఫైనల్‌కు చేరుకుంది అనుకున్నా… ఆతిథ్య శ్రీలంకతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన్‌ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మహిళలతో బుధవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్‌ప్రీత్‌ సేనకు ఫైనల్‌ బెర్త్‌ ఖాయం కానుంది. మిగిలిన జట్లతో పోల్చిచూస్తే భారత్‌కు మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా మహిళలు ఆడి రెండు లీగుల్లోనూ ఓడి ఫైనల్‌ బెర్త్‌ నుంచి దాదాపు నిష్క్రమించినా.. ఆ జట్టు భారత్‌, శ్రీలంకతో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్‌రేట్‌ విషయంలో భారత్‌ కంటే వెనుకబడి రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని లంక 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 11న జరిగే ఫైనల్లో టైటిల్‌కై తలపడనున్నాయి.

భారత్‌కు ఎదురుదెబ్బ

సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కశ్వీ గౌతమ్‌ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్‌ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్‌ క్యాప్డ్‌ పేసర్‌ క్రాంతి గౌడ్‌తో రీప్లేస్‌ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యుపిఎల్‌లో రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది.

➡️